కలెక్టరేట్, మార్చి 31: ఏటా ఆర్థిక సంవత్సర చివరలో ఉపాధి కూలీలకు పెంచే వేతనంలో కేంద్రం తీవ్ర వివక్ష చూపుతున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా ఒకే విధమైన వేతన పెంపు విధానం అమలు చేయాల్సి ఉండగా, ఇష్టారాజ్యంగా వేతన పెంపు పద్ధతి అవలంబిస్తున్నదని కూలీలు విమర్శిస్తున్నారు. కొన్ని రాష్ర్టాల్లో రూ.50 నుంచి రూ.60 వరకు పెంచగా, తెలంగాణలో కేవలం రూ.28 మాత్రమే పెంచడం పట్ల కూలీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ఎనిమిది గంటల పాటు పని చేస్తే కూలి రూ.300 మాత్రమే గిట్టుబాటు కావడం తమను చిన్నచూపు చూడడమేనని కూలీలు పేర్కొంటున్నారు.
కరువు పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి ఉపాధి లభించక ఇబ్బందులు పడుతున్న దినసరి కూలీల కోసం 2005లో అప్పటి కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా పనులకు హాజరయ్యే కూలీలకు సౌకర్యాలు కల్పిస్తూ, వారం వారం వారి బ్యాంకు ఖాతాల్లో కూలి డబ్బులు జమయ్యేవి. 2014 వరకు ఈ పథకం ద్వారా కూలీలకు నిత్యం ఉపాధి లభించేది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకంపై నిర్లక్ష్యపు జాడ్యం ఆవహించింది. గతంలో కూలీలకు కల్పించిన సౌకర్యాలు, చేయాల్సిన పనుల్లో కూడా కోత పెట్టింది. నెలల తరబడి కూలీల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం లేదు.
తమకు అనుకూలంగా ఉండే రాష్ర్టాల్లో గిట్టుబాటు అయ్యేలా కూలి పెంచుతూ, ఇతర చోట్ల మాత్రం నామమాత్రంగా వేతన పెంపును అమలు చేస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో సుమారు 40కి పైగా వివిధ రకాల పనులు చేసేలా ఉపాధి కూలీలకు వెసులుబాటు కల్పించింది. ప్రస్తుతం కేవలం 14 పనులు మాత్రమే చేసేలా ఉత్తర్వులు విడుదల చేసింది. గత ఆర్థిక సంవత్సరం నుంచి వాటినే అమలు చేస్తున్నారు. అలాగే, నిబంధనలు కూడా సమూలంగా మార్చి, ఈ ఆర్థిక సంవత్సరం నుంచి పని చేస్తున్న చోట రోజుకు రెండు సార్లు ఫొటో దిగి ఎన్ఎంఎంఎస్ యాప్ ద్వారా ఫీల్డ్ అసిస్టెంట్ ఫొటోలు అప్లోడ్ చేయడం తప్పనిసరి అయింది.
ఇప్పటికే జాబ్కార్డుకు ఆధార్ అనుసంధానం చేయగా, అనేక మంది కూలీల కార్డులు లింక్ కాకపోగా, వారి ఖాతాల్లో కూలి డబ్బులు జమకావడం లేదు. ఆధార్ అనుసంధానం కాని కూలీల హాజరు కూడా పడడం లేదు. దీంతో జిల్లాలోని అనేక మంది ఉపాధి పనులకు దూరమవుతున్నారు. జిల్లాలో గతేడాది లక్ష్యం 28.30 లక్షల పనిదినాలు కల్పించాల్సి ఉండగా, ఇప్పటి వరకు కేవలం 20 లక్షల పని దినాలు మాత్రమే కూలీలకు కల్పించినట్లు తెలిసింది. 1,22,988 కుటుంబాలకు జాబ్కార్డులుండగా, కేవలం ఏడు వేల కుటుంబాలకు మాత్రమే వంద రోజుల పాటు పని కల్పించినట్లు అధికారులు వెల్లడించిన గణాంకాల ద్వారా స్పష్టమవుతున్నది. జిల్లాలో ఉపాధి కూలీల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా తగ్గుతున్నట్లు అధికారుల లెక్కలు వెల్లడిస్తున్నాయి.