తల్లిదండ్రులు జన్మనిస్తే..వైద్యుడు పునర్జన్మనిస్తాడు.. తన కష్టనష్టాలను పక్కనబెట్టి రోగుల సేవలో తరిస్తాడు.. అత్యవసర పరిస్థితుల్లో తన ప్రాణాలను పణంగా పెట్టి నమ్ముకొని వచ్చిన వారిని రక్షిస్తాడు. అందుకే మన పెద్దలు వైద్యో నారయణోహరి అన్నారు. అన్ని వృత్తుల్లోకెల్లా వైద్యవృత్తి పరమ పవిత్రమైనది. ఈ నేపథ్యంలోనే వారి సేవలను గుర్తు చేసుకొని గౌరవించేందుకు ఏటా జూలై1న వరల్డ్ డాక్టర్స్ డేగా జరుపుకుంటున్నాం.
విద్యానగర్, జూన్ 30 : మన శరీరంలో ఏ సమస్య వచ్చినా, ఏదేని ప్రమాదం జరిగినా డాక్డర్ వద్దకే పరుగెడుతాం. మన ప్రాణాలను వారి చేతిలో ఉంచుతాం. అలాంటి విపత్కర పరిస్థితుల్లో వైద్యులందించే సేవలు శ్లాఘనీయం. గతంలో అనేక మహమ్మారిల నుంచి మానవావాళిని రక్షించారు. ఇటీవలే ప్రపంచంపై స్వైర విహారం చేసిన కరోనాను జయించడంలో వారియర్స్గా ముందునడిచారు. అసమాన ధైర్యసాహసాలతో సేవలందించి వైరస్ పీచ మణిచారు. ఇలాంటి అనేక సందర్భాల్లో వైద్యులు ప్రజల ప్రాణాలను కాపాడి మానవ మనుగడను సుస్థిరం చేశారు.
ఏఐఆర్ సూత్రాన్ని పాటించాలి
వైద్యవృత్తిలో మూడు ఏఆర్ఐ సూత్రాన్ని పాటించాలి. ఇందులో ఏ అంటే అవేలబిలిటీ (అన్ని వేళల్లో రోగులకు అందుబాటులో ఉండాలి. అత్యవసర పరిస్థితిలోనైనా డాక్టర్ వస్తాడు. బతికిస్తాడనే నమ్మకాన్ని కలిగించాలి). ఐ అంటే ఇంట్రెస్ట్ (తాను చేస్తున్న వృత్తి మీద వైద్యులకు అభిరుచి, నమ్మకం ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో జీవనోపాధి కోసం ఈ వృత్తిలో ప్రవేశించవద్దు). ఇక ఆర్ అంటే రెగ్యులారిటీ( తాను చేస్తున్న పనిలో క్రమబద్ధ్దత ఉండాలి. నిర్ధిష్టమైన కాల ప్రణాళికలను పాటించాలి).
గౌరవమిచ్చేందుకే స్పెషల్ డే..
అనుక్షణం రోగుల సేవలో తరిస్తూ శారీరక, మానసిక ైస్థెర్యాన్ని పెంపొందించేందుకు తపించే వైద్యులకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం. ఆ ప్రాణదాత పోసిన ఊపిరి, ప్రతి ఉచ్ఛ్వాసలో ఆయనకు కృతజ్ఞత తెలుపుతూనే ఉంటుంది. రోగి గుండె ప్రతి లయనోనూ వైద్యుడి పేరునే పలకరిస్తూ ఉంటుంది. అయినప్పటికీ వైద్యుల కోసం ప్రత్యేకంగా ఒక రోజును కేటాయించారు. అదే వరల్డ్ డాక్టర్స్ డే . ఈ రోజున వివిధ దేశాల్లో ప్రజలు, వైద్యులు సుఖ సంతోషాలతో పాటు సిరిసంపదలతో కలకాలం వర్ధిల్లాలని దేవుడిని ప్రార్ధిస్తారు.
చంద్రరాయ్ పుట్టిన, మరణించిన రోజే..
మన దేశానికి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ బిదాన్ చంద్ర రాయ్ 1882 జూలై 1న జన్మించాడరు. ఈయన భారత వైద్యరంగానికి ఎనలేని సేవలందించారు. విద్యా వేత్త, స్వాతంత్య్ర సమరయోధుడు అయిన రాయ్ 1948 నుంచి 1962 వరకు 14 ఏండ్లపాటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. యాదృచ్ఛికంగా 1962 జూలై 1న మరణించారు. ఆయన పుట్టిన, మరణించిన రోజు ఒక్కటే కావడంతో మనదేశంలో ఏటా జూలై 1న జాతీయ వైద్య దినోత్సవం జరుపుకుంటున్నారు. దైవంలాంటి ఈ వృత్తిలో కొనసాగతున్న వైద్యుల సేవలను ఈ సందర్భంగా స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది.
సామాన్యులకు అత్యున్నత వైద్యం
సామాన్యులకు కూడా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో వైద్యమందించే ఏకైక హాస్పిటల్ రేనే.. సింగరేణి కార్మికుడి కుమారుడిగా జీవితాన్ని ప్రారంభించిన. దవాఖానలో గుండె, ఆర్థో, యురాలజీ, నెఫ్రాలజీ సేవలు ఆరోగ్యశ్రీ ద్వారా అందిస్తున్నాం. 150 పడకల దవాఖానలో 24 గంటల పాటు సేవలందిస్తున్నాం. వైద్య పితామహుడు బీసీ రాయ్ను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తున్నాం. తన తల్లి బంగారి లక్ష్మి పేరిట ఏటా 15 మందికి పైగా పేదలకు కీలు మార్పిడి శస్త్ర చికిత్సలను ఉచితంగా చేస్తున్నాం.
-బంగారి స్వామి, ఆర్థోపెడిషియన్
ఆవో.. గావో చలేకు మంచి స్పందన
ఐఎంఏ పిలుపు మేరకు చేపట్టిన అవో గావోకు మంచి స్పందన లభిస్తుంది. ఇందులో భాగంగా దేశంలోనే అత్యధికంగా 20 గ్రామాలను దత్తత తీసుకున్న జిల్లాగా కరీంనగర్ నిలించింది. వైద్యులు జన్మించిన గ్రామాలను ఎంపిక చేసుకొని సేవలందిస్తున్నాం. రానున్న రోజుల్లో ఐఎంఎ తరుపున ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తాం.
– డాక్టర్ బీఎన్రావు, ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు
సర్కారు దవాఖానల్లో మెరుగైన సేవలు
తెలంగాణ ఏర్పటైన తర్వాత ప్రభుత్వ దవాఖానల్లో వైద్య సేవలు మెరుగు పడ్డాయి. ఓపీ, ఐపీలతో దవాఖానాలు కిటకిటలాడుతున్నాయి. పూర్తి స్థాయిలో మందులు, వైద్యులు అందుబాటులోకి వచ్చాయి. గతంలో నెలకు 200 లోపు అయిన ప్రసవాలు ప్రస్తుతం నెలకు 800 దాటాయి. గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం అయ్యాక ఇంటికి వెళ్లే వరకు పూర్తి స్థాయిలో భరోసా కల్పించడంతో జిల్లాలో వందకు 80 శాతం ప్రభుత్వ దవాఖానాల్లోనే ప్రసవాలు జరుగుతున్నాయి.
– డాక్టర్ కృష్ణ ప్రసాద్, ప్రభుత్వ దవాఖాన
సూపరింటెండెంట్ (కరీంనగర్)
స్థానికంగానే అత్యాధునిక వైద్యం
రోగులకు వైద్యులపై నమ్మకం ఉండాలి. 24 గంటలూ రోగుల సేవలోనే ఉండే డాక్టర్లను నమ్మకపోతే ఎవరిని నమ్ముతారు. కానీ అత్యవసర పరిస్థితుల్లో రోగి బంధువులు నానా హంగామా చేస్తారు. హైదరాబాద్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు కరీంనగర్లోనే అన్నిరకాల వైద్య సేవలు, అత్యాధునిక వసతులతో పేదలకు అందుబాటులో ఉన్నాయి.
– డాక్టర్ విజయమోహన్రెడ్డి, ఫిజీషియన్
ప్రజల్లో నమ్మకం పెరగాలి
వైద్యులు రోగులకు మంచి చేయాలనే చూస్తారు. అన్నిసార్లు ప్రాణాలు కాపాడడం ఎవరివల్లా కాదు. కానీ కొందరు ఈ మధ్యకాలంలో వైద్యులను బ్లాక్మెయిల్ చేయడం పరిపాటిగా మారింది. వైద్య వృత్తిపై ప్రజల్లో నమ్మకం పెరగాలి. ఇందుకు వైద్యులూ కృషిచేయాలి.
– చిట్టుమల్ల ప్రదీప్ కుమార్, వైద్యుడు
కార్పొరేట్ స్థాయి వైద్యం
కరీంనగర్ ప్రభుత్వ దవాఖానలో కార్పొరేట్కు దీటుగా సేవలందిస్తున్నాం. కేసీఆర్ సర్కారు ప్రోత్సాహంతో క్లిష్టమైన మోకీలు, తొంటి మార్పిడి, కంటి శస్త్ర చికిత్సలు చేస్తున్నాం. రోజుకు పదికి పైగా ఆపరేషన్లు జరుగుతున్నాయి. ఇప్పటికే దవాఖానాకు అత్యాధునిక పరికరాలతో పాటు మెడికల్ కళాశాల ఏర్పాటుతో రానున్న రోజుల్లో మరింత నాణ్యమైన సేవలందుతాయి.
– డాక్టర్ నవీన, అదనపు ఆర్ఎంవో (కరీంనగర్ ప్రభుత్వ దవాఖాన)