కొత్తపల్లి, నవంబర్ 2 : దక్షిణ కాశీ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి కార్తీకమాసం సంగీత నృత్య నీరాజనం-2022 నేషనల్ లెవల్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఫెస్టివల్-32 కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ లంబోదర కల్చరల్ అకాడమీ వారు కరీంనగర్లోని మానేరు విద్యా సంస్థలకు చెందిన విద్యార్థిని డీ రిత్వికకు జాతీయస్థాయి నటరాజ నంది అవార్డు-2022ను ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా చిన్నారికి ప్రశంసాపత్రంతో పాటు నంది, నటరాజ జ్ఞాపికలను అందజేశారు. బుధవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో రిత్వికను మానేరు విద్యా సంస్థల చైర్మన్ కడారి అనంతరెడ్డి అభినందించి మాట్లాడారు. మానేరు విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తుండడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అభిలాషించారు. సాంస్కృతిక రంగంలో రాణించినట్లే విద్యలోనూ రాణించాలని, అప్పుడే వారు సాధించిన సర్టిఫికెట్లకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో మానేరు విద్యా సంస్థల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.