కరీం‘నగరం’లో నల్లా పన్నుల చెల్లింపు అస్తవ్యస్తంగా మారింది. ఆన్లైన్లో ఓ తీరు, రికార్డుల్లో మరో తీరు ఉండడంతో నగరవాసులు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. దీనికి తోడు ఈ విభాగం సిబ్బంది తీరుతో పన్నులు చెల్లించేందుకు తిప్పలు పడాల్సి వస్తున్నది. ఆన్లైన్లో బకాయి భారీగా ఉన్నట్టు, రికార్డుల్లో తక్కువగా ఉన్నట్టు చూపుతుండగా, దీనిపై స్పష్టతనిచ్చేవారు కరువయ్యారు. అసలు ఏ పన్ను చెల్లించాలని అడిగినా చెప్పే దిక్కు లేకుండా పోయిందని ప్రజలు వాపోతున్నారు. అసలు నల్లా పన్నులు ఏ మేరకు ఉన్నాయో తెలియడం లేదని ఆవేదన చెందుతున్నారు.
కరీంనగర్ కార్పొరేషన్, మార్చి 19 : కరీంనగర్ నగరపాలక సంస్థలో నల్లా పన్నును ఆన్లైన్ చేసే ప్రక్రియ ఐదేళ్ల కిందే మొదలైంది. అయితే సిబ్బంది నిర్లక్ష్యం వల్ల అది కాస్తా అస్తవ్యస్తంగా మారింది. ఒక ఇంటికి ఒకే నల్లా కనెక్షన్ ఉన్నా ఆన్లైన్లో మాత్రం రెండు నల్లా కనెక్షన్లు ఉన్నట్టు చూపిస్తున్నది. మరి కొన్ని ఇళ్లకు సంబంధించి వారు గతేడాది వరకు నల్లా పన్నులు చెల్లించినా.. ఏళ్ల తరబడిగా బకాయిలున్నట్టు కనిపిస్తున్నది. ముఖ్యంగా ఆన్లైన్ చేసే ప్రక్రియలో సిబ్బంది సరిగ్గా నమోదు చేయకపోవడం వల్లే ఈ సమస్యలు వచ్చాయని గతంలోనే ఇంజినీరింగ్ అధికారులు చెప్పారు.
వాటిని సరి చేస్తామని చెప్పినా ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో సరి చేయలేకపోయారు. దాంతో ఇప్పుడు నగరవాసుల వద్ద పాస్బుక్ గానీ, గతంలో చెల్లించిన రసీదులు గానీ లేకపోతే భారీగా బకాయిలు చెల్లించే పరిస్థితి ఉన్నది. తాము ఎప్పటికప్పుడు నల్లా పన్నులు చెల్లిస్తున్నా ఇంకా భారీగానే బకాయిలు ఉన్నట్టు చూపిస్తున్నదని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిని సరిచేయాల్సిన అధికారులు సాంకేతిక కారణాలు సాకుగా చూపుతున్నారని వాపోతున్నారు. అయితే వీటిల్లోనూ ముడుపులు ఇస్తే అంతా సక్రమమే అన్నట్టు సాగుతుందని ఆరోపిస్తున్నారు.
ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న సమయంలో నల్లా పన్ను చెల్లించేందుకు వచ్చే నగరవాసులు పెద్దసంఖ్యలో నగరపాలక సంస్థకు వస్తున్నారు. ఈ సమయంలో సహకరించాల్సిన ఈ విభాగం సిబ్బంది చుక్కలు చూపిస్తున్నారు. ముందుగా ఆన్లైన్లో ఉందో లేదో పరిశీలించుకోవాలని సూచిస్తున్నారు. తర్వాత ఆన్లైన్లో లేకపోయినా భారీగా బకాయిలు ఉన్న రికార్డుల్లో చూసుకోవాలని చెబుతున్నారు. అక్కడకు వెళ్తే గంటల తరబడిగా వేచి ఉన్నా సరైన సమాధానం ఇవ్వకుండా.. ఇప్పుడైతే ఈ యేడాది పన్ను చెల్లించాలని పంపిస్తున్నారు.
పన్ను చెల్లించిన తర్వాత ఆన్లైన్ చేసుకోవడానికి కూడా నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో చెల్లించిన రసీదులు లేకపోతే అక్కడ చూపించిన బకాయి చెల్లించాల్సిందేనని అధికారులు స్పష్టం చేస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. మరికొన్ని సందర్భాల్లో రికార్డుల్లో ఓ పేరు, ఆన్లైన్లో మరో పేరు ఉంటున్నదని వాపోతున్నారు. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఈ విషయంలో పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.