Metpally | మెట్ పల్లి : పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదులపై జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. మెట్ పల్లి పోలీస్ స్టేషన్ను ఆయన మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, రికార్డుల నిర్వహణ, సిబ్బంది హాజరు వివరాలను పరిశీలించారు. రౌడీ షీటర్లు, నేరస్తులపై నిఘా అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు భద్రత కల్పించడంతో విజిబుల్ పోలీసింగ్ కీలక పాత్ర పోషిస్తుందని, సిబ్బంది తమకు కేటాయించిన గ్రామాల పూర్తి సమాచారం సిబ్బంది వద్ద ఉండాలన్నారు. గ్రామాల్లో ఎలాంటి సంఘటనలు జరిగినా పై అధికారులను తక్షణమే సమాచారం ఇవ్వాలని సూచించారు. నేరాలను ముందుగానే అరికట్టే విధంగా ఇంటలిజెన్స్ సేకరణ, బీట్ వ్యవస్థ, రాత్రి పూట పెట్రోలింగ్, వాహన తనిఖీలు, అనుమానిత వ్యక్తులపై నిఘా, సీసీ కెమెరాల వినియోగాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.
రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లు, జైలు నుంచి విడుదలైన నేరస్తుల కదలికలపై ఎప్పటికప్పుడు ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు. మాదక ద్రవ్యాల ఆక్రమ రవాణా, విక్రయం. వినియోగంపై జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేయాలని, గంజాయి. డ్రగ్స్, నిషేదిత పదార్థాల ఆక్రమ రవాణాను ఆరికట్టేందుకు ప్రత్యేక నిఘా కొనసాగించాలని ఆదేశించారు. యువతను మాదక ద్రవ్యాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గ్రామాలు, విద్యా సంస్థల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఆన్లైన్ మోసాలు, ఓటీపీ, కేవైసీ, ఫేక్ ఇన్వెస్ట్మెంట్ యాప్లు డిజిటల్ ఆరెస్ట్ వంటి మోసాలపై ప్రజలను ఆప్రమత్తం చేయాలని ఆదేశించారు. రోడ్డు భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగంపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని, ప్రమాదకర డ్రైవింగ్, మైనర్లు వాహనాలు నడపడం, మోడిఫైడ్ సెలెన్సర్లపై చట్టపరమైన చర్యలు కొనసాగించాలని సూచించారు. ఎస్పీ వెంట డీఎస్సీ రాములు, కిరణ్కుమార్ ఉన్నారు.