Pattana Pragathi | పట్టణం మురుస్తున్నది. స్వరాష్ట్రంలో ప్రగతికేతనం ఎగరేస్తున్నది. నాటి ప్రభుత్వాల పట్టింపులేమితో దశాబ్దాలుగా అరకొర నిధులతో కనీస సౌకర్యాలకు నోచుకోని బల్దియాలు, నేడు సీఎం కేసీఆర్ చేపట్టిన పట్టణ ప్రగతితో సరికొత్తగా మెరుస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, రామగుండం నగరాలతోపాటు 14 మున్సిపాలిటీలు ప్రగతిబాట పట్టాయి. నెలనెలా కోట్లాది ప్రగతి నిధులు ఇస్తుండడంతో సకల సౌకర్యాలతో పెద్ద పెద్ద నగరాలకు ఏమాత్రం తీసిపోనివిధంగా అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయి. మొత్తం 1500 కిలోమీటర్ల పొడవునా సీసీ రోడ్లు, ఇంకా ప్రధాన ఏరియాల్లో సమీకృత మార్కెట్లు, ఓపెన్ జిమ్లు, దారుల వెంట ఎల్ఈడీ కాంతులతో తళుకులీనుతున్నాయి. పట్టణ ప్రగతి రూపురేఖలు మార్చగా, పట్టణ ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
నేడు పట్టణ ప్రగతి దినోత్సవం
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం పట్టణ ప్రగతి దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రతి కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో జెండా ఎగురవేస్తారు. పట్టణ ప్రగతి ద్వారా, పట్టణానికి వచ్చిన నిధుల వివరాలను, వివిధ సంక్షేమ పథకాల ద్వారా పట్టణ ప్రజలకు జరిగిన లబ్ధిని, పట్టణంలో మౌలిక వసతుల వివరాలు, జీవో 58, 59 వల్ల కలిగిన లబ్ధి వంటివి వివరిస్తారు. అవార్డుల వివరాలను తెలియజేస్తారు. ఉత్తమ మున్సిపాలిటీల, కార్పొరేషన్ల వార్డు కౌన్సిలర్లు, చైర్మన్లు మేయర్లు, ఉద్యోగులకు సన్మానం చేస్తారు.
కరీంనగర్, జూన్ 15(నమస్తే తెలంగాణ): సాధారణ నిధులతో, అపసోపాలు పడుతూ, అభివృద్ధి జాడ కానరాక, అష్టకష్టాలతో భారంగా సాగుతూ వచ్చిన మున్సిపాలిటీలకు స్వరాష్ట్రంలో కొత్త ఊపు వచ్చింది. నాటి పాలనలో ఉమ్మడి జిల్లాలో ఉన్న మున్సిపాలిటీలు అభివృద్ధికి ఆమడ దూరంలోనే నిలిచిపోయాయి. తెలంగాణ రాక ముందు కరీంనగర్, రామగుండం, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, సిరిసిల్ల పట్టణాలు మాత్రమే మున్సిపాలిటీగా ఉండగా, పెద్దపల్లి, మంథని, వేములవాడ, జమ్మికుంట, హుజూరాబాద్ లాంటి పెద్ద పట్టణాలు సైతం గ్రామ పంచాయతీలుగానే చలామణి అయ్యేవి. వేలాది జనాభాను కలిగి ఉన్నప్పటికీ గ్రామ పంచాయతీల పరిధిలోనే ఉండడంతో ఆదాయాలు లేక, ఖర్చులు ఎక్కువవవడంతో పంచాయతీలుగా ఉన్న పెద్దపెద్ద పట్టణాలు పూర్తిగా మునిగిపోయాయి. సాధారణ నిధుల లేమి, ప్రభుత్వాలు ఎప్పుడో ఏడాదిలో ఒకటి, రెండు సార్లు ఆర్థిక సంఘం నిధులు ఇచ్చి చేతులు దులుపుకునే సందర్భాలే అధికం.
తెలంగాణ ఏర్పాటు అనంతరం అన్ని విభాగాల్లో, శాఖల్లో ఎలాగైతే వృద్ది కనిపించిందో మున్సిపాలిటీల్లోనూ అలాంటి వృద్ధే జరిగింది. మున్సిపల్ అభివృద్ధి శాఖ మంత్రిగా కేటీఆర్ బాధ్యతలు తీసుకోవడంతో మున్సిపాలిటీల్లో నవశకం ప్రారంభమైంది. ప్రభుత్వం కొత్త మున్సిపల్ చట్టాన్ని అమల్లోకి తీసుకురావడంతో పాటు పరిపాలన పరమైన అనేక సంస్కరణలను చేపట్టింది. మున్సిపాలిటీల సంఖ్యను పెంచడంతో పాటు, గతంలో ఉన్న మున్సిపాలిటీల పరిధిని సైతం విస్తరించింది. వార్డుల సంఖ్యను సైతం పెంచివేసింది. పెద్దపల్లి, మంథని, రాయికల్, ధర్మపురి, కొత్తపల్లి, సుల్తానాబాద్ లాంటి పెద్ద పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చివేసింది. మున్సిపాలిటీల సంఖ్యను పెంచడంతోపాటు వాటికి ప్రత్యేక నిధులు అందజేసే వ్యవస్థను ఏర్పాటు చేయడంతో జిల్లా పరిధిలోని రెండు కార్పొరేషన్లతోపాటు 14 మున్సిపాలిటీల్లో అభివృద్ధి శరవేగంగా సాగుతున్నది.
ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఈ తొమ్మిదేండ్ల వ్యవధిలో గణనీయమైన ప్రగతి కనిపిస్తున్నది. ప్రతి మున్సిపాలిటీకి మిషన్ భగీరథ పథకం కింద శుద్ధజలం సరఫరా అవుతున్నది. నాలుగు జిల్లాల పరిధిలో 618 కోట్ల వ్యయంతో మంచినీటిని సరఫరా చేస్తున్నది. ఒకప్పుడు వేసవి వచ్చిందంటే చాలు, సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల జిల్లాలోని పలు మున్సిపాలిటీల్లో మంచినీటికి ఇబ్బందులు వచ్చేవి. ఎస్సారెస్పీ పక్కనే ఉన్న జగిత్యాల లాంటి జిల్లాలో సైతం రోజు విడిచి రోజు మంచినీటి సరఫరాను చేసే దుస్థితి కనిపించేది. ఎస్సారెస్పీ నుంచి తాగునీటి కోసం నీటిని విడుదల చేసి, కాలువకు తాటిపెల్లి వద్ద అడ్డుకట్ట వేసి, ఆ కాలువ నుంచి నీటిని ధర్మసముద్రంలోకి మళ్లించి, అక్కడి నుంచి నీటిని శుద్ధి చేసి పట్టణ వాసులకు మంచినీటి సరఫరా జరిగేది. అయితే ఇప్పుడవన్నీ మాయమైపోయాయి. ప్రతి ఇంటికీ కుళాయిని ఏర్పాటు చేసి నీటిని సరఫరా చేస్తున్నారు. ఎస్సారెస్పీ నుంచి తీసుకున్న నీటిని ఇబ్రహీంపట్నం మండలం డబ్బా వద్ద శుద్ధి చేసి అక్కడి నుంచి జిల్లాలోని నలుమూలకు పంపిణీ చేస్తున్నారు.
సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలోను మంచినీటికి భగీరథ వల్ల ఇబ్బందులు తొలిగిపోయాయి. ఇక పట్టణ ప్రగతి, ఫైనాన్స్ నిధులు, టీయూఐఎఫ్డీసీ నిధులతో పట్టణాల్లో సమీకృత మార్కెట్లు, వైకుంఠధామాలు, పట్టణ ప్రకృతి వనాలు, అంతర్గత రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 17 సమీకృత మార్కెట్ల నిర్మాణాలు పూర్తి కావచ్చాయి. ఒకే చోట కూరగాయలు, మాంసం, చేపలు, పూలు, పండ్లన్నీ లభించే విధంగా సమీకృత మార్కెట్లు నిర్మిస్తున్నారు. గతంలో పబ్లిక్ టాయిలెట్స్ అనేవి పట్టణాల్లో కనిపించకపోయేవి. కానీ ఇప్పుడు ప్రతి పట్టణంలో రద్దీ ప్రాంతాల్లో అంటే మొత్తం 196 పబ్లిక్ టాయిలెట్లు నిర్మించారు. ఇక పట్టణాల్లో వైకుంఠధామాలు సైతం సరిగా లేకపోయేవి. చివరి మజిలీకి తీవ్ర ఇబ్బందులు వచ్చేవి. ఇలాంటి పరిస్థితుల్లో వైకుంఠధామాలను సైతం బాగుపర్చి, అందులో మౌలికవసతులను కల్పించేందుకు ప్రతి మున్సిపాలిటీ టాప్ ప్రయార్టీని ఇవ్వడం విశేషం. అన్నింటి కంటే ముఖ్యంగా మున్సిపాలిటీల్లో వేలాది కిలోమీటర్ల పొడువునా అంతర్గత సీసీ రోడ్లు నిర్మించారు. జిల్లాలో ఇప్పటి వరకు తొమ్మిదేండ్లలో దాదాపు 1500 కిలోమీటర్ల పొడవునా అంతర్గత సీసీ రోడ్లు నిర్మించారు.
గతంలో మున్సిపాలిటీల్లో ప్రజలు వ్యాయామం చేసేందుకు ఎలాంటి సౌకర్యాలు లేకపోయేవి. అయితే మున్సిపాలిటీల్లో జాగింగ్ కేంద్రాలతో పాటు వ్యాహ్యాళికి పట్టణ ప్రకృతివనాలు నిర్మించారు. ఇక యువతతో పాటు, ప్రజలందరికీ ఆరోగ్యం కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 10 కోట్లు వెచ్చించి 78 ఓజెన్ జిమ్స్ను ఏర్పాటు చేశారు. అందులో పది జిమ్స్ కేవలం మహిళల కోసమే ఏర్పాటు చేశారు. ఇక సాయంత్రం పూట ప్రజలకు ఆహ్లాదం అందించేందుకు జిల్లాలో చెరువులు ఉన్న ప్రాంతాల్లో 13 మినీట్యాంక్ బండ్లు నిర్మించారు. పట్టణ ప్రగతి నిధుల్లో పదిశాతం గ్రీనరీకి కేటాయించగా, ఈ లెక్కన జిల్లాలోని మున్సిపాలిటీల్లో 75లక్షలకు పైగా మొక్కలు నాటారు. అభివృద్ధి కోసం పాటుపడుతూనే మరో వైపు పట్టణాల్లో చిరువ్యాపారుల సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో చిరువ్యాపారాలు (వీధి వ్యాపారాలు) నిర్వహించుకునే వారికి 50వేల ఆర్థిక సాయం అందజేసింది. మొత్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 75వేల మంది లబ్ధి కలిగించింది.
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని 16 బల్దియాల అభివృద్ధి కోసం టీయూఎఫ్ఐడీసీ ద్వారా ఆర్థిక రుణం భారీగా మంజూరైంది. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు కలిపి 452 కోట్లకుపైగా రుణాలు పొందాయి. ఒక జగిత్యాల జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలే 200 కోట్ల రుణాన్ని తీసుకోవడం గమనార్హం. అటు పట్టణ ప్రగతి నిధులు, మరో వైపు ఆర్థిక సంఘం నిధులు, వీటికి తోడు టీయూఎఫ్ఐడీసీ సాయంతో మున్సిపాలిటీల్లో అనేక నిర్మాణాలు సాగుతున్నాయి.
రాష్ట్ర ఏర్పాటుకు ముందు ప్రతి మున్సిపాలిటీ తన మనుగడకు, అభివృద్ధికి తాను సమకూర్చుకున్న సాధారణ నిధి నుంచే ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉండేది. జనరల్ ఫండ్ నుంచే మున్సిపాలిటీల్లో పనిచేసే కార్మికులకు జీతభత్యాలు, ఇతర అవస్థాపన వ్యయాలు చేయాల్సి వచ్చేది. దీంతో చాలా మున్సిపాలిటీల్లో నిధుల లేమి సమస్య తలెత్తింది. చాలా బల్దియాల్లో కార్మికులకు వేతనాలివ్వలేని దైన్యమైన పరిస్థితి తరుచూ ఉత్పన్నమైన పరిస్థితి గోచరించేది. అయితే రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్.. పంచాయతీ సంస్థలతో పాటు, మున్సిపాలిటీలను సైతం స్వయం ప్రతిపత్తి గలిగిన సంస్థలుగా గుర్తించడంతో పాటు, జనాభా ఆధారంగా మున్సిపాలిటీలకు ప్రతి నెలా పట్టణ ప్రగతి పద్దు కింద నిధులివ్వాలని నిర్ణయించారు. అలాగే వీలైనంత వరకు కేంద్ర ఆర్థిక సంఘం ఇచ్చే నిధులను సైతం స్థానిక సంస్థలకు క్రమం తప్పకుండా అందించడంలో కృతకృత్యులయ్యారు. ఇప్పటి వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో దాదాపు 35 నెలల వ్యవధిలోనే ఏకంగా 272 కోట్లకు పైగా నిధులు మున్సిపాలిటీలకు వచ్చి చేరాయి. దీంతో పాటు, ఆర్థిక సంఘాల నుంచి సైతం 193 కోట్లు మంజూరయ్యాయి. మొత్తంగా పంచాయతీలకు 460 కోట్లకు పైగా నిధులు పురపాలక సంఘాలకు రావడంతో మున్సిపాలిటీల్లో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ఆరంభమైంది.