‘రాష్ట్రం వస్తే చీకట్లు అలుముకుంటయి. నీళ్లు రావు. కరువు తాండవిస్తుంది. ఇలా ఆనాడు ఆంధ్రాపాలకులు హేళన చేసిన్రు. కానీ, సీఎం కేసీఆర్ పదేండ్ల పాలనలో రాష్ట్రం దేశంలోనే ఆదర్శంగా నిలిచింది. ఒకప్పుడు వలస బతుకులతో ఆగమైన తెలంగాణ, ఇప్పుడు బతుకుదెరువు చూపే స్థాయికి ఎదిగింది. నేనొక్కటే చెబుతున్నా. రాష్ట్రం అప్పుడు ఎట్లుండె.. ఇప్పుడెట్ల ఉన్నది? ఎంతగా అభివృద్ధి చెందిందో గుర్తించాలి. బీఆర్ఎస్ గెలిస్తే ప్రజలు గెలుస్తరు. ప్రజలు బతుకులు బాగుంటయ్’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. జగిత్యాల బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్కు మద్దతుగా శనివారం ఆమె నియోజకవర్గంలో నిర్వహించిన రోడ్ షోలకు హాజరయ్యారు.
ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు ఏకదాటిగా రాయికల్ మండలం మైతాపూర్, ఇటిక్యాల, భూపతిపూర్, తాట్లవాయి, కట్కాపూర్, బీర్పూర్, అల్లీపూర్, రాయికల్తోపాటు జగిత్యాలలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల ప్రసంగించారు. కాంగ్రెస్ నేతలు అబద్ధాలు చెబుతున్నారని, నమ్మి మోసపోవద్దని, తెలంగాణను తెర్లు చేసుకోవద్దని సూచించారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జీవన్రెడ్డి లాస్ట్ ఛాన్స్ ఇవ్వాలని అంటున్నారని, ఆయనకు ఇంకా ఎన్నిసార్లు అవకాశం ఇస్తారని ప్రశ్నించారు. జగిత్యాలలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ సంజయ్ అన్నను భారీ మెజార్టీతో గెలిపించాలని, కారుగుర్తుపై ప్రజలు గుద్దుడు గుద్దితే ఈవీఎం మిషన్లు దద్దరిల్లాలన్నారు.
జగిత్యాల నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసిన. రాయికల్ పట్టణంతో పాటు అన్ని గ్రామాలను బాగు చేసిన. ఈ ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించండి. రెండో సారి గెలిపించాలి. మీరు-నేను కార్యక్రమంలో రాయికల్ మండలంలో ప్రతి గ్రామంలో తిరిగిన. పల్లె నిద్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించిన. 25కోట్లతో ఇటిక్యాల, కొత్తపేట, బోర్నపెల్లి వాగుల వద్ద ఐదు చెక్డ్యాంలు నిర్మించిన. దీంతో పరిసర గ్రామాల్లో భూ గర్భ జలాలు పెరిగినయి. రామారావుపల్లె వాగుపై రూ.10కోట్లతో బ్రిడ్డిజిని నిర్మిస్తున్న. ఇటిక్యాల ఒడ్డెర కాలనీకి రోడ్డు వేయిస్త. వైద్యుడిగా, ఎమ్మెల్యేగా తనను ప్రజలు ఎంతో ఆదరిస్తున్నరు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ దీవించండి. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించండి.
జగిత్యాల, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): ‘బతుకుదెరువు కోసం వలస పోయిన తెలంగాణ ప్రాంతంలోకి, నేడు బతుకుదెరువు కోసం ఇతర రాష్ర్టాల వాళ్లు వలస వచ్చే పరిస్థితి వచ్చింది. నేడు మన పొలాల్లో నాట్లు వేసేందుకు, కోతలు కోసేందుకు, బిహార్, బెంగాల్, ఉత్తర ప్రదేశ్ లాంటి రాష్ర్టాల నుంచి ప్రజలు వస్తున్నరు. అంటే మన రాష్ట్రం ఎంతగా అభివృద్ధి చెందిందో గుర్తించాలి. బీఆర్ఎస్ గెలిస్తే ప్రజల బతుకులు బాగుంటయ్’ అని నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ చెప్పినవన్నీ చేశారని, కాంగ్రెస్, బీజేపీ వాళ్లు మాటమీద నిలబడేవాళ్లు కాదన్నారు. ఆ పార్టీలను గెలిపిస్తే ఆ పార్టీలే గెలుస్తాయని, బీఆర్ఎస్ గెలిస్తే ప్రజలు గెలుస్తారని, ప్రజల బతుకులు బాగుంటాయని చెప్పారు. జగిత్యాల ఎమ్మెల్యేగా డాక్టర్ సంజయ్ కుమార్ను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
కారు గుర్తుపై ప్రజలు గుద్దుడు గుద్దితే ఈవీఎం మిషన్లు దద్దరిల్లాలన్నారు. జగిత్యాల బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్కుమార్కు మద్దతుగా రాయికల్ మండలం మైతాపూర్, ఇటిక్యాల, భూపతిపూర్, తాట్లవాయి, కట్కాపూర్, బీర్పూర్, అల్లీపూర్, జగిత్యాల పట్టణాల్లో శనివారం నిర్వహించిన రోడ్డుషోల్లో ఎమ్మెల్సీ ఎల్ రమణ, జడ్పీ చైర్పర్సన్ వసంతతో పాల్గొని, మాట్లాడారు. తెలంగాణ ప్రాంతంలో ఒకప్పుడు నీటి వసతి లేక, ప్రభుత్వాలు పట్టించుకోక ప్రజలు దుబాయ్, ముంబై లాంటి ప్రాంతాలకు వలసలు పోయారన్నారు. కానీ, నేడు తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం రూపురేఖలు మారిపోయాయన్నారు. గ్రామాల్లో చెరువులు నీళ్లతో కళకళలాడుతున్నాయని, కాలువల్లో నీళ్లు పారుతున్నాయని, 24 గంటల విద్యుత్ వస్తున్నదని, ఎక్కడ చూసినా ధాన్యం కుప్పలు కనిపిస్తున్నాయన్నారు. ఒకప్పుడు పనిలేక, వలసలు పోయిన తెలంగాణ ప్రాంతం నేడు ఇతరులకు పని కల్పిస్తున్నదన్నారు.
బిహార్, బెంగాల్, ఉత్తర ప్రదేశ్, ఒడిశా తదితర 16 రాష్ర్టాల నుంచి బతుకుదెరువు కోసం వస్తున్నారని గుర్తు చేశారు. తెలంగాణ విభజన సమయంలో రాష్ట్రం ఏర్పడితే చీకట్లు అలుముకుంటాయని, నీళ్లు రావని, కరువు ఉంటుందని, నక్సలైట్ల రాజ్యం అవుతుందంటూ ఆంధ్రా ప్రాంతం వాళ్లు విమర్శలు చేశారని, అయితే పదేళ్ల పాలనలో సీఎం కేసీఆర్ తెలంగాణను దేశంలోనే నంబర్ వన్గా తీర్చిదిద్దారన్నారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేశారని, రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్ లాంటి పథకాలను రూపొందించారన్నారు. మహిళల నేతృత్వంలో ఐకేపీ కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేసే పద్ధతిని ప్రారంభించామని చెప్పారు. గత పాలకులు ఒక గింజా అయినా కొనుగోలు చేశారా..? అని ప్రశ్నించారు. చరిత్ర మరిచిపోతే మళ్లీ ఆగమవుతామన్నారు. తెలంగాణ రాక ముందు బీడీ కార్మికులను ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదని చెప్పారు.
దేశంలో 16 రాష్ర్టాలో బీడీ కార్మికులే ఉన్నారని, ఎకడా లేని విధంగా బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనని కొనియాడారు. రాష్ట్రంలో 2014ను ప్రామాణికంగా తీసుకొని బీడీ కార్మికుల పెన్షన్లకు కటాఫ్ డేట్ పెట్టామని, దీనివల్ల కొందరికి పెన్షన్లు రావడం లేదన్నారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లామని, కటాఫ్ డేట్ తీసివేసి అందరికీ పెన్షన్ ఇస్తామని సీఎం కేసీఆర్ హమీ ఇచ్చారని గుర్తు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విపరీతంగా గ్యాస్ సిలిండర్ ధరలను పెంచిందని, తగ్గించాలని చెప్పినా ప్రధాని మోడీ అంకుల్ పట్టించుకోలేన్నారు. చెప్పిచెప్పి విసిగిపోయిన సీఎం కేసీఆర్, ఆడబిడ్డలకు 400కే సిలిండర్ ఇవ్వాలన్న నిర్ణయం తీసుకున్నారన్నారు. మిగిలిన 800ను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తుందన్నారు. భూమి ఉన్న రైతు కుటుంబాలకు రైతు బీమా ఇస్తున్నామని, అయితే భూమిలేని వారికి ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమైందన్నారు.
అందుకే కేసీఆర్ బీమా.. ప్రతి ఇంటికీ దీమా పేరిట ప్రతి పేద కుటుంబానికి బీమా సౌకర్యం కల్పించాలని నిర్ణయించామన్నారు. ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ సంకల్పిస్తే, బీమా ఎందుకని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయని, అందరూ బాగుండాలనే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నామన్నారు. బీఆర్ఎస్ గెలిస్తే ప్రజలకు మంచి భవిష్యత్తు బాగుంటుందని, తెచ్చుకున్న తెలంగాణను తెర్లు చేసుకోవద్దని, తెలంగాణను దొంగల చేతిలో పెట్టవద్దని కోరారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ వంద మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని, కానీ, ఒకటి కూడా నెరవేర్చలేదని విమర్శించారు. జగిత్యాలలో కాంగ్రెస్ అభ్యర్థిగా జీవన్రెడ్డి తనకు ఆఖరి అవకాశం ఇవ్వాలని అంటున్నారని, అయితే ఆయనకు ఎన్నిసార్లు ఆఖరి అవకాశం ఇవ్వాలని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ కాకుండా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది జీవన్రెడ్డినే అన్నారు. యువతకు ఉద్యోగాలు రా వడం లేదంటూ, అబద్ధాలు ఆడుతూ, అభాండాలు వేస్తున్నది జీవన్రెడ్డినే అని మండిపడ్డారు. రాయికల్ మండలంలోని అల్లీపూర్ను మండలం చేస్తామని కవిత హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్, ఎంపీపీ సంధ్యారాణి, జడ్పీటీసీ సభ్యురాలు జాదవ్ అశ్విని, బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు కోల శ్రీనివాస్ పాల్గొన్నారు.
భూపతిపూర్ ఎక్స్ రోడ్డు వద్ద రోడ్డుషోలో పాల్గొన్న కవిత చెప్పిన ‘తేలు. కప్ప పిట్టకథ’ అందరినీ ఆకట్టుకున్నది. చెరువులో నీరు లేని సమయంలో ఒక తేలు అందులో కాపురం ఉంది. అయితే చెరువులోకి నీరు రావడంతో తేలు బయటకు వెళ్లిపోవాలని అనుకున్నది. చెరువు మధ్య నుంచి ఒడ్డుకు ప్రయాణం మొదలు పెట్టింది. అయితే నీటిలో ప్రయాణం చేయడం తేలుకు ఇబ్బందిగా మారింది. అదే సమయంలో ఒక కప్ప తేలుకు కనిపించింది. తేలు కప్పను కలిసి తనను వీపుపై కూర్చోబెట్టుకొని ఒడ్డుకు చేర్చమని కోరింది. అయితే తేలు సంగతి తెలిసిన కప్ప తన వీపుపై కూర్చోబెట్టుకొని తీసుకువెళ్లేందుకు సంశయించింది. అయితే తేలు కుట్టనని, ఎలాంటి ఇబ్బందిపెట్టనని, కప్పను బతిమిలాడింది. పాపం అనుకున్న కప్ప తన వీపుపై తేలును కూర్చోబెట్టుకొని చెరువు ఒడ్డుకు చేర్చింది. అయితే తేలు తన సహజ లక్షణాన్ని విడువకుండా ఒడ్డుకు చేరగానే కప్ప వీపుపై కుట్టింది. దీంతో కప్ప విషం తట్టుకోలేక చనిపోయిందంటూ కవిత కథ చెప్పారు. ఈ కథలో తేలు కాంగ్రెస్ పార్టీ అని, ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీ వారిని ఇబ్బందుల పాలు చేస్తుందని ఆమె పేర్కొనడంతో ప్రజలందరూ చప్పట్లు కొట్టారు.
చెరువులు ఎండిపోయినప్పుడు కప్పలు చెరువును విడిచిపెట్టి వెళ్లిపోతయి. చేపలు మాత్రం చెరువు నిండినా ఎండినా అకడే ఉంటయి. బీఆర్ఎస్ వాళ్లు చేపల్లాంటి వాళ్లు. కాంగ్రెస్, బీజేపీ వాళ్లు కప్పల వంటి వాళ్లు. చెరువులు ఎండిన నాడు ప్రజలతో బీఆర్ఎస్ ఉన్నది. ఇప్పుడు చెరువులు నిండిన సమయంలో సైతం ప్రజలతోనే ఉన్నది. కష్టంలో ఉన్నప్పుడు మనతో ఉంటేనే మనవాడు అవుతడు. సంతోషంగా ఉన్నప్పుడు, సంపద ఉన్నప్పుడు మన వెంటే ఉండేవాళ్లు మనవాళ్లు కాదు.
– ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
జగిత్యాలలో బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కుమార్ ప్రజాసేవ లక్ష్యంగా పనిచేస్తున్నడు. డాక్టర్గా ఉన్నా, ప్రజాప్రతినిధిగా ఉన్నా ఎప్పుడూ ఒకేవిధంగా ఉన్నడు. ప్రజలు ఓడించినా, గెలిపించినా ఆయన ప్రజల వెంటే నడుస్తున్నడు. కార్తీకదీపం సీరియల్లో ఉన్న డాక్టర్ బాబులాగా, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ బాబు సైతం మంచివాడు. ఆయనకు ప్రజలు మద్దతు పలుకాలి. భారీ మెజార్టీతో గెలిపించాలి.
– ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత