పెగడపల్లి/గొల్లపల్లి, నవంబర్ 19: ‘కాంగ్రెస్ యాభై ఏండ్ల పాలనలో ఈ ప్రాంత ప్రజలు ఉపాధి కరువై ఆగమైన్రు. వలస పోయి దుర్భర జీవితం గడిపిన్రు. మళ్లీ ఆ పార్టీకి ఓటేస్తే ఐదేండ్లు ఏడుపు తప్పదు’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. కాంగ్రెస్ నమ్మితే ప్రజలను మోసం చేసి రాష్ర్టాన్ని అంధకారం చేస్తుందని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ధర్మపురి ధర్మరాజు అని, ఈ ప్రాంత అభివృద్ధికి ఎనలేని సేవ చేస్తున్నారన్నారు. ప్రజా సంక్షేమం 18 గంటల పాటు పని చేస్తున్నారని, మరింత అభివృద్ధి చెందాలంటే ఈశ్వర్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈశ్వరన్నను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే నియోజకవర్గంలోని దళితులందరికీ ఒకేసారి దళిత బంధు ఇస్తామన్నారు. ధర్మపురి అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు మద్దతుగా ఆమె ఆదివారం పెగడపల్లి, గొల్లపల్లి మండల కేంద్రాల్లో నిర్వహించిన రోడ్షోలకు హాజరయ్యారు.
ఎంపీ వెంకటేశ్నేతకాని, జడ్పీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి పెగడపల్లి అంబేద్కర్ చౌరస్తా వద్ద, గొల్లపల్లి మండల పరిషత్ కార్యాలయం వద్ద మాట్లాడారు. ఆనాటి కాంగ్రెస్ పాలనలో నీళ్లు, కరంటు లేక ఉపాధి కరువై అనేక మంది బొంబై, దుబాయి వంటి ప్రాంతాలకు వలసలు పోయారని, అప్పుడు ఇంటి వద్ద ఉన్న మహిళలు జీవనోపాధి కోసం బీడీలు చుట్టడం మొదలు పెట్టారన్నారు. నాడు వాళ్లను ఎవరూ పట్టించుకోలేదని విమర్శించారు. కానీ, సీఎం కేసీఆర్ బీడీ పెన్షన్ అమలు చేశారని గుర్తు చేశారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక బీడీ కార్మికులకు పీఎఫ్తో సంబంధం లేకుండా పింఛన్ అందజేస్తామని చెప్పారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సిలిండర్తోపాటు ఉప్పు, పప్పు, నూనెలు తదితర నిత్యవసార వస్తువుల ధరలను విపరీతంగా పెంచేసిందని, సామాన్య జనాలు బతుకలేని పరిస్థితి నెలకొందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దెనెక్కిన వెంటనే సిలిండర్ను 400కే అందజేస్తామని, రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు. పేద కుటుంబాలను ఆదుకునేందుకు రైతు బీమా తరహాలో కేసీఆర్ ఇంటింటికీ బీమా కింద 5లక్షల సాయం చేయనున్నట్లు చెప్పారు.
పేదలకు కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించేందుకు ఆరోగ్య పథకంలో బాగంగా ఎలాంటి వ్యాధులకైనా చికిత్స చేసుకునేందుకు ప్రవేట్ దవాఖానల్లో 15 లక్షల వరకు వైద్య సౌకర్యం కల్పించనున్నట్లు వివరించారు. నేనొక్కటే చెబుతున్నా.. మంచి చేసే వారెవరు..? ముంచే వారెవరు..? అని బాగా ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాగా పెగడపల్లిలో మండలానికి చెందిన వివిధ పార్టీల నాయకులు కవిత సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఆయా కార్యక్రమాల్లో బీఆర్ఎస్ రాష్ట్ర నేత రమణారావు, జడ్పీటీసీలు రాజేందర్రావు, జలంధర్, ఎంపీపీలు శోభా-సురేందర్రెడ్డి, శంకరయ్య, ఏఎంసీ చైర్ పర్సన్ లోక నిర్మల, స్థానిక సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీ జమున-స్వామి, విండో చైర్మన్లు భాస్కర్రెడ్డి, వేణుగోపాల్, పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు మల్లారెడ్డి, వెంకన్న, పాక్స్ అధ్యక్షులు రాజసుమన్ రావు, మాధవ రావు, మార్కెట్ చైర్మన్ హన్మాండ్లు, వైస్ చైర్మన్ లింగా రెడ్డి, వైస్ ఎంపీపీ సత్తయ్య, గంగాధధర్, మండల అడ్హక్ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఆనందం, కరుణాకర్రావు, యూత్ అధ్యక్షుడు సంతోష్, ఆర్బీఎస్ మండల అధ్యక్షుడు నరెందర్రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ ఆంజనేయులు, జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు గంగా రెడ్డి, మండల ఫోరం అధ్యక్షుడు రమేశ్, ఉప సర్పంచ్ రాజశేఖర్, నాయకులు లింగారెడ్డి, నారాయణ రెడ్డి, కొమురయ్య, తిరుపతి ఉన్నారు.