తిమ్మాపూర్ రూరల్, నవంబర్ 7 : ఆరు గ్యారెంటీల పేరుతో దొంగ మాటలు చెప్పి ఊళ్లలోకి వస్తున్న పగటి బిచ్చగాళ్ల మాటలు నమ్మి ప్రజలు ఆగం కావొద్దని మానకొండూర్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సూచించారు. మంగళవారం మండలంలోని మక్తపల్లి, నల్లగొండ, సాహెబ్పల్లి, బాలయ్యపల్లి, కొత్తపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నల్లగొండకు చెందిన కాంగ్రెస్ నాయకులు 30 మంది బీఆర్ఎస్లో చేరగా ఆయన గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో సాగునీరు లేక ఉన్న ఊరును, కన్నవాళ్లను వదిలి గల్ఫ్ దేశాలు, బొంబాయికి బతుకు దెరువు కోసం వెళ్లారని, కేసీఆర్ సీఎం అయ్యాక కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి లక్షలాది ఎకరాలకు సాగునీళ్లు అందించి రైతులను కంటిరెప్పలా కాపాడుకుంటున్నట్లు తెలిపారు. ఒకప్పుడు కరెంటు, సాగునీళ్లు లేవని, కేసీఆర్ సీఎం అయిన తర్వాతనే వ్యవసాయానికి 24 గంటల కరెంటు, రైతుబంధు ద్వారా ఎకరాకు రూ.10 వేల పెట్టుబడి సాయం, రైతుబీమా ద్వారా రూ.5 లక్షల సాయం అందుతుందన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో అంశాలను వివరించారు. కారు గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించి, కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షుడు రావుల రమేశ్, రాష్ట్ర నాయకుడు కేతిరెడ్డి దేవేందర్రెడ్డి, ఇనుకొండ జితేందర్రెడ్డి, తుమ్మనపల్లి శ్రీనివాసరావు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.