జగిత్యాల, నవంబర్ 15(నమస్తే తెలంగాణ)/వేములవాడ/ కథలాపూర్ : ‘చల్మెడ లక్ష్మీనర్సింహారావు సౌమ్యుడు, పట్టుదల కలిగిన మంచివ్యక్తి. ఆయనను వేములవాడ బీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ ఎంపిక చేశారు. చల్మెడను భారీ మెజార్టీతో గెలిపిస్తే వేములవాడ నియోజకవర్గాన్ని దత్తత తీసుకొంటా. సిరిసిల్ల నియోజకవర్గంలా అభివృద్ధి చేస్తా’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ప్రకటించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సంక్రాంతి పగటి వేషగాళ్లలా, గంగిరెద్దులవారిలా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు ప్రజల వద్దకు ఓట్ల కోసం వస్తున్నారని, కాకిరిబీకిరి మాటలతో మరోసారి మభ్యపెట్టేందుకు చూస్తున్నారని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిర్ణయాత్మకమైన, కీలకమైన ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి, మేలు చేసే బీఆర్ఎస్, కేసీఆర్ ప్రభుత్వానికి మద్దతు పలకాలన్నారు. కథలాపూర్, చందుర్తి మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అలాగే రుద్రంగి, కోనరావుపేట, వేములవాడలో రోడ్షోల్లో పాల్గొన్నారు. ఆయాచోట్ల మాట్లాడారు. ఈ ఎన్నికలు అత్యంత కీలకమైనవని, తెలంగాణ తలరాతను మార్చుకునేవని, ప్రజలు జాగురుకతతో నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఆడపిల్ల పెండ్లి విషయంలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎంత క్షుణ్ణంగా ఆలోచించి, ప్రయోజకుడు అయిన వ్యక్తికి ఇవ్వాలని అనుకుంటామో..? ఎన్నికల సమయంలో అలాగే ఆలోచించి, సరైన వారికి అధికారం ఇవ్వాలన్నారు. తెలంగాణ ఏర్పడిన తొమ్మిదిన్నరేండ్లు పూర్తయినా, వాస్తవికంగా పరిపాలన సాగింది ఆరున్నరేండ్లేనని అన్నారు. రెండేండ్లు కరోనా సావగొట్టిందని, మూతికి బట్టకట్టుకొని అందరం భయంభయంగా బతికామన్నారు. మరో ఏడాది పార్లమెంట్, మున్సిపల్, పంచాయతీ ఎన్నికలకు పోయిందన్నారు. ఆరున్నరేండ్లలో అనేక విజయాలను సీఎం కేసీఆర్ సాధించారన్నారు. ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, 46 లక్షల మందికి పెన్షన్లు, నాలుగన్నర లక్షల మందికి బీడీ పెన్షన్లు అందజేస్తున్నామన్నారు.
గోదావరి నీటిని వేములవాడకు మళ్లించుకోగలిగామన్నారు. 2014కు ముందు ఎట్లున్న వేములవాడను, ఎట్లా మార్చుకున్నామో అందరూ గమనించాలని సూచించారు. కాంగ్రెస్ దరిద్రానికి నేస్తమని, పదొకొండు సార్లు అవకాశం ఇస్తే రాష్ర్టాన్ని దరిద్రంగా మార్చివేసిందన్నారు. కరెంట్ కోతలు, సాగు, తాగునీటి కష్టాలతో అల్లాడిన రోజులను అందరూ గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. అర్దరాత్రి ఇచ్చిన కరెంట్ వల్ల కరెంట్ షాక్లు తగిలి, పాములు, తేల్లు కుట్టి చాలా మంది చనిపోయారని విచారం వ్యక్తం చేశారు. విత్తనాలు సరిగా లేక, ఎరువులు రాక రైతులు పడిన బాధలు అందరికీ తెలిసినవేనన్నారు. ఇలాంటి రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ ఎలా మార్చివేశారో..? అందరూ అర్థం చేసుకోవాలని సూచించారు. నేడు అందరికీ రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. ఇంత గొప్పగా పరిపాలన సాగుతున్న సమయంలో ఎన్నికలు వచ్చాయని, అధికారం కోసం కాంగ్రెస్, బీజేపీలు మళ్లీ దొంగవేషాలతో, తియ్యటి, పుల్లటి మాటలతో ప్రజల వద్దకు వస్తున్నారన్నారు. ఇలాంటి వారిని ప్రశ్నించాలన్నారు. ఇది వ్యక్తుల మధ్య జరుగుతున్న ఎన్నిక కాదని పార్టీలు, అభివృద్ధి చేసిన బీఆర్ఎస్కు మధ్య జరుగుతున్న ఎన్నిక మాత్రమేనని ప్రజలు గుర్తించాలన్నారు. మావురోడు, మా కులపోడు అనే సెంటిమెంట్లకు పడిపోవదన్నారు. ‘సుట్టం అయితే ఒకరోజు ఉండి తినిపోమ్మనండి గానీ ఓటు వేయకండి’ అని ప్రజలకు పిలుపునిచ్చారు. కులం, మతం పేరుతో వచ్చేవారిని నమ్మవద్దన్నారు.
కథలాపూర్ మండలంలోని సూరమ్మ చెరువు రిజర్వాయర్ గతంలోనే పూర్తి కావాల్సిందని, అయితే కరోనా వల్ల పూర్తి కాలేదన్నారు. కరోనా వల్ల రాష్ర్టానికి లక్షన్నర కోట్ల నష్టం వచ్చిందని, దీంతో సూరమ్మ చెరువు రిజర్వాయర్ను పూర్తి చేయలేకపోయామని చెప్పారు. మూడోసారి అధికారంలోకి రాగానే సూరమ్మ రిజర్వాయర్ పనులు చేపడుతామని, రెండేండ్లలో దాన్ని పూర్తి చేస్తామన్నారు. అలాగే మన్నెగూడెంను మండలం చేయాలన్న డిమాండ్ ఉందని, తప్పకుండా మండలంగా మార్చివేస్తామన్నారు. భీమారం మండలంలో జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉందని, దాన్ని పూర్తి చేస్తామన్నారు. మేడిపల్లి, కథలాపూర్, బీమారం మండలాల్లో కొన్ని అంతర్గత రోడ్లను పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారని, వాటన్నింటినీ పూర్తి చేస్తామన్నారు.
అలాగే 2014 కటాఫ్ డేట్ను ఏర్పాటు చేయడం వల్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా కొందరు బీడీ కార్మికులకు పెన్షన్ అందడం లేదని, అధికారంలోకి రాగానే మిగిలిపోయిన బీడీ కార్మికులందరికీ పెన్షన్ మంజూరు చేస్తామన్నారు. అలాగే కొత్త రేషన్కార్డులు, కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామన్నారు. లక్షల సం ఖ్యలో పెన్షన్లు ఇస్తున్నామని, మరో రెండు లక్షల మందికి పెన్షన్ ఇవ్వడం పెద్ద సమస్య కాదన్నారు. కాంగ్రెస్వాళ్ల లాగ తాము లంగలం కాదని, ఇచ్చిన మాట ప్రకారం అన్నీ ఇస్తామన్నారు.
బీజేపీలో మహిళలకు గౌరవం లేదని మంత్రి ధ్వజమెత్తారు. ఉద్యమకారిని, కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ తుల ఉమక్కకు టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి, తర్వాత బీఫాం ఇవ్వకుండా మోసం చేసిందని, తీవ్రంగా అవమానించిందని మండిపడ్డారు. ఉద్యమకారిని అయిన తుల ఉమక్కకు బీఆర్ఎస్ ఎప్పుడూ సముచిత స్థానం ఇచ్చిందని, ఇంటి ఆడబిడ్డలా చూసుకున్నదని, ఇంటి ఆడబిడ్డ కంట నీరు చూసి సీఎం కేసీఆర్తో పాటు అందరం వేదనకు గురయ్యామన్నారు. అక్కకు జరిగిన అవమానం చూసి చలించి, సొంత ఇంటికి తిరిగి రావాలని ఆహ్వానించామని, ఉమ అక్కకు బీఆర్ఎస్ ఎప్పుడూ తల్లిగారి ఇల్లే అని చెప్పారు. అక్కకు మరింత మంచి పదవి వస్తుందని, దానికి తనదే పూచి అన్నారు. అక్కను ఏడిపించి, మహిళ జాతిని అవమానించిన బీజేపీకి డిపాజిట్ రాకుండా బుద్ధి చెప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
వేములవాడ రాజన్న దగ్గర కోడెమ్మకు మొక్కు చెల్లించుకుని ఏడాదికి ఒకరోజు శివరాత్రికి మాత్రమే జాగారం ఉంటామన్నారు. కానీ, కాంగ్రెస్కు ఓటేస్తే ప్రతి రాత్రీ మనకు జాగారమే అవుతుందనే విషయాన్ని గుర్తించాలన్నారు. కాలిన కరెంటు మోటర్లు, పేలిన ట్రాన్స్ఫార్మర్లు, ఎండిన రైతు పొలాలు, అలాంటి దుఃఖం బతుకులు మనకు వద్దని సూచించారు. నాడు ఎండాకాలం వచ్చిందంటే నీళ్ల బాధతో గ్రామాలకు ప్రజాప్రతినిధులు వెళ్లలేని పరిస్థితి నుంచి నేడు ప్రతి ఇంటికి తాగునీరు అందించిన ఘనత సీఎం కేసీఆర్ కాదా..? ఒకసారి ఆలోచించాలని సూచించారు. పంటకు 10 హెచ్పీ మోటర్ పెట్టి నీళ్లు అందించాలని కరెంట్పై కనీస అవగాహన లేని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న తీరు వాళ్లకు రైతుల మీద ప్రేమ ఎంతవరకు ఉందో అర్థం చేసుకోవాలన్నారు.
ఎవరు ఎప్పుడు జైలుకు వెళ్తాడో తెలియదు కానీ, అలాంటి వాళ్ల మాటలు నమ్మి మనం మోసపోకూడదని సూచించారు. కాంగ్రెస్ పాలనలో 200 ఉన్న పింఛన్ను సీఎం కేసీఆర్ 2వేలకు పెంచడమే కాకుండా వచ్చే రోజుల్లో రూ.5వేల వరకు చేస్తామని హామీ ఇచ్చారు. 18 ఏండ్లు నిండిన యువతులకు సౌభాగ్య లక్ష్మి పథకం కింద నెలకు రూ.3వేలు అందిస్తామన్నారు. రైతుబంధు సాయాన్ని 16 వేలకు పెంచబోతున్నట్లు చెప్పారు. ప్రతి తెల్ల రేషన్ కార్డు నా కుటుంబానికి కేసీఆర్ బీమా పథకం అమలు చేస్తూ ఏదైనా ప్రమాదం జరిగితే 5 లక్షల బీమా అందేలా చూస్తామని చెప్పారు. ఉన్న ఒక్క తెలంగాణ గొంతు కేసీఆర్ మీదికి ఢిల్లీ నుంచి కాంగ్రెస్, బీజేపీలు కర్ణాటకను కలుపుకొని దండుగా వస్తున్నాయని, మనం అప్రమత్తంగా ఉండి కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రిగా చేసేందుకు ప్రతి ఒకరూ కారు గుర్తుపై ఓటు వేసి చల్మెడ లక్ష్మీనర్సింహారావును గెలిపించాలని కోరారు.
సాగునీరు విద్యుత్ కావలసినంత అందుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతం నుంచి వలసలు పూర్తిగా తగ్గాయని మంత్రి కేటీఆర్ అన్నారు. మలపేట రిజర్వాయర్ నిర్మాణం చేపట్టడమే కాకుండా పనులు కూడా పూర్తయ్యాయని, ఇకడి నుంచి రూ.166 కోట్లతో నిమ్మపల్లి చెరువుకి ఎత్తిపోతల పథకం కూడా పూర్తవుతుందని చెప్పారు. ఒకప్పుడు తాగు, సాగునీటికి ఇబ్బంది పడిన కోనరావుపేట మండలం ఇపుడు సస్యశ్యామలంగా మారిందని, ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన మార్పు కాదా..? ఆలోచించాలని సూచించారు. ఈ ప్రాంతానికి మొదటగా చందుర్తికి గోదావరి జలాలు తీసుకురావడమే కాకుండా 50వేల ఎకరాలకు సాగునీరు కేసీఆర్ ప్రభుత్వమే ఇచ్చిందని వివరించారు.
వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి నా బాధ్యత అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రాజన్న ఆలయం ఎదుట రోడ్షోలో మాట్లాడారు. కేసీఆర్ సీఎం కాకముందు వేములవాడలో కరెంట్ ఎట్లా ఉండే ఒకసారి ఆలోచన చేయాలని ప్రజలను అడిగారు. అవసరాలకు నాయకులను బతిమిలాడి కరెంటు వేసుకొని రోజులుపోయి.. 24గంటల విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రం రాకముందు వేములవాడ ఎట్లుంది? ఇప్పుడు ఎలా ఉందో ఆలోచించాలని కోరారు. వేములవాడలోనే వంద పడకల దవాఖాన పెట్టి నిరుపేదలకు వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. గోదావరి జలాలను రాజన్న చెంతకు చేర్చామని, గుడి చెరువును నింపామన్నారు. సిలిండర్ ధరల పెరిగితే నీతో అయితలేదని మన్మోహన్సింగ్ను విమర్శించిన ప్రధాని, ఇప్పుడు అదే సిలిండర్ రూ.1200 చేశాడని దుయ్యబట్టారు. మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత రూ.400కే ఇస్తామని చెప్పారు.