రాయికల్, నవంబర్ 24: కాంగ్రెస్, బీజేపీలను నమ్ముకుంటే మునుగుడేనని, కష్టాలు, కన్నీళ్లు తప్ప మిగిలేది ఏమీ లేదని జగిత్యాల అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ విమర్శించారు. ఎన్నికలు వచ్చాయని ఎలాగైనా గెలవాలని అన్నీ మోసపూరిత హామీలు ఇస్తున్నారని, ఏ ఒక్కటీ చేయరని నమ్మితే మోసపోతారన్నారు. రాయికల్ మండలం కురుమపల్లి, శ్రీరామ్నగర్, సింగర్రావుపేట, అల్లీపూర్, కిష్టంపేట గ్రామాల్లో శుక్రవారం బీఆర్ఎస్ జగిత్యాల అభ్యర్థి డాక్టర్ సంజయ్ కుమార్ ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ అంటేనే రైతు, పేదల పక్షపాతి ప్రభుత్వమని, నిరంతరం రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే పార్టీనే గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
పదేండ్ల క్రితం జగిత్యాల నియోజకవర్గం ఎలా ఉండె..? ఇప్పుడెట్ల ఉందో..?, పల్లెలు ఎంత అభివృద్ధి చెందాయో..? ఆలోచించాలని సూచించారు. గత ప్రభుత్వాలు పేదలు, రైతుల కోసం చేసిందేమీలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ పేదలు, రైతుల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారని చెప్పారు. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ సరార్ పెన్షన్లను పెంచుతామని, డబుల్ బెడ్రూం ఇండ్లు, దళిత, బీసీ బంధును అర్హులందరికీ అందిస్తామన్నారు. అర్హులైన మహిళలందరికీ సౌభాగ్య లక్ష్మి పథకం ద్వారా నెలకు రూ.3వేలు అందిస్తామని, సిలిండర్ ధరను రూ.400కే అందిస్తామన్నారు. ఒకప్పుడు రైతులు కరెంటు, ఎరువులు, విత్తనాల కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డారని, కానీ రాష్ట్రంలో నేడు ఆ పరిస్థితి లేదన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వడ్లు కొనమంటే రైతుల పక్షాన ఢిల్లీకి వెళ్లి ధర్నాలు చేసిన ఘనత బీఆర్ఎస్దని కొనియాడారు. కాంగ్రెస్, బీజేపీని నమ్మితే ప్రజలకు కష్టాలు తప్పవన్నారు. మూడు పంటలు పండేలా కరెంట్, నీళ్లు ఇస్తున్న సీఎం కేసీఆర్ కావాలా..? మూడు గంటల కరంటు చాలంటున్న కాంగ్రెస్ కావాలా..?, మీటర్లు పెట్టే బీజేపీ కావాలా..? మీరే ఆలోచించుకోవాలని ప్రజలకు సూచించారు. రాష్ట్రంలో పుట్టిన పిల్లవాడి నుంచి ముసలివాడి దాకా సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని చెప్పారు. కురుమపల్లి, శ్రీరామ్ నగర్ గ్రామాల్లో రేషన్ షాపులను ఏర్పాటు చేసి ప్రజలకు సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తామని చెప్పారు. కిష్టంపేట మీదుగా ఆర్టీసీ బస్సును నడిపిస్తామని, కిష్టంపేట నుంచి జగిత్యాల రోడ్డును సైతం వేయిస్తానని వివరించారు.
విద్య, వైద్యానికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చిందని, అందులో భాగంగానే రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకులాలను వందల సంఖ్యలో ఏర్పాటు చేసినట్లు చెప్పా రు. ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయడంతో పాటు ప్రజలకు ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని వివరించారు. అల్లీపూర్ మండలం చేసేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని, మళ్లీ గెలిచిన తర్వాత వెంటనే ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. ఒక వైద్యుడిగా, ఎమ్మెల్యేగా నిత్యం ప్రజల మధ్యలో ఉండి సేవ చేస్తున్న తనను వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇక్కడ జడ్పీటీసీ సభ్యురాలు జాదవ్ అశ్విని, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కోల శ్రీనివాస్, సర్పంచులు సులత, స్వరూపగోపి, రాజమౌళి, రాంచందర్రావు, ఎంపీటీసీ సభ్యులు మోర విజయలక్ష్మీవెంకటేశ్, సాగరిక, ఏఎంసీ వైస్ చైర్మెన్ మల్లేశ్యాదవ్ ఉన్నారు.