జగిత్యాల రూరల్, డిసెంబర్31: రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రతిఒక్కరూ పాటుపడాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ కోరారు. జగిత్యాల పట్టణానికి చెందిన 71 మంది లబ్ధిదారులకు ఆదివారం ఆయన తహసీల్ ఆఫీస్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను స్థానిక నాయకులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధితో నియోజకవర్గం ప్రస్తుతం ప్రగతిలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని పేర్కొన్నారు.
కల్యాణలక్ష్మి పథకం చెక్కుల పంపిణీలో అధికారులు స్టేజీ ఫ్లెక్సీ పెట్టకపోవడం.. అధికార పార్టీ నాయకుల ఒత్తిడే ప్రథమ కారణమన్నారు. ఫ్లెక్సీ లేకున్నా తాను ప్రజల గుండెల్లో ఉన్నానని చెప్పారు. ఆడబిడ్డలకు స్వయానా కానుక ఇస్తామంటే.. అడ్డుపడబోమన్నారు. మ్యానిఫెస్టో ప్రకారం ప్రతి మండలానికీ గురుకులం ఏర్పాటు చేయాలని, విద్యార్థుకు భృతి అందించాలని, వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ పట్టణాధ్యక్షుడు గట్టు సతీశ్, దావ సురేశ్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.