పెద్దపల్లి కమాన్, ఏప్రిల్ 26 : పెద్దపల్లి జిల్లా సమగ్ర స్వరూపం పుస్తకం భావితరాలకు దిక్సూచిగా పనిచేస్తుందని ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ట్రినిటీ డిగ్రీ కళాశాల సమావేశ మందిరంలో బుధవారం ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో రూపొందించబడిన పెద్దపల్లి జిల్లా సమగ్ర స్వరూపం పుస్తకావిష్కరణకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. పెద్దపల్లి భౌగోళిక స్వరూపం, వనరులు, చారిత్రక కట్టడాలు, జలవనరులు, సిమెంట్, బొగ్గు తదితర అంశాల్లోనూ అన్ని జిల్లాలకు ఆదర్శంగా నిలిచే జిల్లా పెద్దపల్లి అని, అలాంటి జిల్లాలో రచయితలు, చరిత్రకారులు అందరూ కలిసి 400 పేజీల పుస్తకాన్ని తీసుకురావడం అభినందనీయమన్నారు.
ఈ పుస్తకం 33 జిల్లాలకు ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గాజోజు నాగభూషణం మాట్లాడుతూ, ఇక్కడి సాహిత్యం ఎల్లలు దాటిందని, అల్లం రాజయ్య, నారాయణ, వీరయ్య నుంచి మొదలుకొని ఆధునిక సాహితీవేత్తలు, చరిత్రకారులు ఇక్కడి నుంచి వందలాది కథలు, కవితలు, నవలలు రాశారని పేర్కొన్నారు. అనంతరం పుస్తకానికి రచనలు అందించిన జిల్లా కవులు, రచయితలకు మెమెంటోలు అందించి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. సమావేశంలో తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జుర్రు చెన్నయ్య, బుర్ర తిరుపతి, కూకట్ల తిరుపతి, ఏలేశ్వరం వెంకటేశ్వర్లు, వేల్పుల నారాయణ, కవులు, రచయితలు పాల్గొన్నారు.