పెద్దపల్లి, సెప్టెంబర్ 28(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ఆదివారం (అక్టోబర్ ఒకటిన) పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు వివరాలను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి వెల్లడించారు. ఆదివారం ఉదయం మంత్రి కేటీఆర్ హైదరాబాద్ నుంచి నేరుగా మంచిర్యాల జిల్లా చెన్నూరులో మధ్యాహ్నం వరకు పర్యటిస్తారు.
మధ్యాహ్నం 12 గంటలకు పెద్దపల్లి జిల్లా రామగుండానికి చేరుకొని మంత్రి కొప్పుల ఈశ్వర్, మండలి చీఫ్ విప్ భానుప్రసాదరావు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేతకానితో కలిసి పర్యటించనున్నారు. మొదట రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ వద్ద ఐటీ పార్క్, అంతర్గాంలో నిర్మించనున్న ఇండస్ట్రియల్ పార్క్, తాజాగా మంత్రి కేటీఆర్ విడుదల చేసిన 100 కోట్ల పైలాన్తోపాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. తర్వాత గోదావరిఖని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగే ‘రామగుండం దశాబ్ధి ప్రగతి సభ’లో పాల్గొని ప్రసంగించనున్నారు.
అంతర్గాం మండలం పెద్దంపేట, రాయదండి గ్రామాల్లో స్వాతంత్య్రానికి పూర్వం నుంచి ఖురూజ్కమ్మీ భూములపై హక్కులు లేక దశాబ్దాల తరబడి ప్రజలు ఎదుర్కొంటున్న బాధితుల్లో మొదటి విడుతగా 600 మందికి భూ హక్కులు కల్పించనున్నారు. 58, 59,76 జీవోల ద్వారా రామగుండంలోని లబ్ధిదారులకు పట్టాలు, గృహలక్ష్మి లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్, 3425 మందికి 4 వేల చొప్పున పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఆ తర్వాత పెద్దపల్లికి చేరుకుని, మున్సిపల్ పరిధిలో 25 కోట్ల టీఎఫ్ఐడీసీ నిధులతో రోడ్లు, డ్రైనేజీల పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
అందులో మున్సిపల్ పరిధిలోని 36 వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఎన్ఎస్ గార్డెన్ నుంచి చర్చ్ వరకు, కేకే చికెన్ సెంటర్ ఏరియా, లీలావతి హాస్పిటల్ ఏరియా సీసీ రోడ్లు, డ్రైనేజీలు, చీకురాయి రోడ్డు విస్తరణ పనులు, ఇతర వార్డుల్లో రోడ్ల విస్తరణ పనులు చేపట్టనున్నారు. జిల్లా కేంద్రంలో రూ.50 లక్షల నిధులతో నిర్మించిన అమర్నగర్ జంక్షన్, రోడ్ డివైడర్స్, సెంట్రల్ లైటింగ్స్, రూ.1.60కోట్లతో నిర్మించిన పెద్దపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించనున్నారు. రూ.48 కోట్లతో కొలనూరు ఓదెల రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. రూ.కోటి ఎస్డీఎఫ్ నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు ప్రారంభించే విధంగా అధికారులు సిద్ధం చేస్తున్నారు. మంత్రి పర్యటన సందర్భంగా రామగుండం, పెద్దపల్లి నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి
పెద్దపల్లి, సెప్టెంబర్ 29 : మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని పెద్దపల్లి కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో అదనపు కలెక్టర్లు శ్యామ్ప్రసాద్లాల్, అరుణశ్రీతో కలిసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అక్టోబర్ 1న పెద్దపల్లి, రామగుండం నియోజకవర్గాల పరిధిలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారని, ఈ నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలో మంత్రి పర్యటన పర్యవేక్షణ బాధ్యతలు అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్యామ్ ప్రసాద్లాల్, రామగుండం నియోజకవర్గం పరిధిలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణశ్రీ పర్యవేక్షించాలన్నారు. వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ ఉంటుందని, వారు కూర్చునేలా సౌకర్యాలు ప్రత్యేకంగా చేయాలని సూచించారు. ఎకడా ఎలాంటి ఇబ్బందులూ రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీస్ శాఖకు సూచించారు. సమావేశంలో పెద్దపల్లి ఆర్డీవో మధుమోహన్ , ఏసీపీ ఎడ్ల మహేశ్, కలెక్టరేట్ ఏవో శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.