ప్రగతి రథ సారథి, ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ముందుగా తంగళ్లపల్లి మండల కేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించి మండల ప్రజాపరిషత్ కార్యాలయ భవనాన్ని ప్రారంభించనున్నారు. ఆ తర్వాత సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్) పాలకవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం పద్మనాయక కల్యాణ మండపంలో వినియోగదారులు, రైతులతో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో ప్రసంగిస్తారు. చివరగా కొదురుపాకలో అమ్మమ్మ, తాతయ్య జోగినపల్లి లక్ష్మీ కేశవరావు జ్ఞాపకార్థం తన సొంత నిధులతో పాఠశాల భవనానికి శంకుస్థాపన చేసి, అదే గ్రామంలో కొత్తగా నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని ప్రారంభిస్తారు. మంత్రి పర్యటన నేపథ్యంలో ఆయాచోట్ల ఏర్పాట్లు పూర్తి చేశారు.
రాజన్న సిరిసిల్ల, జనవరి 9 (నమస్తే తెలంగాణ)/ సిరిసిల్ల రూరల్/ బోయినపల్లి : ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ మంగళవారం జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థ పాలక వర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకానున్నారు. బోయినపల్లి మండలం కొదురుపాకకు చేరుకుని తన అమ్మమ్మ, తాతయ్య జోగినపల్లి లక్ష్మీ కేశవరావు జ్ఞాపకార్థం తన సొంత నిధులతో నిర్మిస్తున్న ప్రాథమిక పాఠశాల భవనానికి శంకుస్థాపన చేస్తారు. మంత్రి పర్యటన నేపథ్యంలో ఆయాచోట్ల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కొదురుపాక జడ్పీ పాఠశాల ఆవరణలో మంత్రి కేటీఆర్ సభ కోసం సోమవారం ఏర్పాట్లను పరిశీలించారు.
రైతులు, నేతన్నలకు కృతజ్ఞత సభ
అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిచేలా అభివృద్ధి చేస్తున్న అమాత్యుడికి సిరిసిల్ల ప్రజలు అండగా నిలిచారు. ప్రతిపక్షాలు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా తలొగ్గకుండా సెస్ ఎన్నికల్లో ఏకపక్షంగా బీఆర్ఎస్ బలపరిచిన 15 మంది అభ్యర్థులను డైరెక్టర్లుగా గెలిపించారు. అందుకు పాలకవర్గం స్థానిక పద్మనాయక కల్యాణ మండపంలో మధ్యాహ్నం 12.30 గంటలకు రైతులు, నేతన్నలు, వినియోగదారులకు కృతజ్ఞత సభను ఏర్పాటు చేసింది. సుమారు రెండువేల మందితో నిర్వహిస్తున్న ఈ సభకు మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానుండగా, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఎంపీ సంతోష్కుమార్, ఎమ్మెల్సీలు భానుప్రసాదరావు, శంభీర్పూర్ రాజు, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్లు జిందం కళ, రామతీర్థపు మాధవి పాల్గొననున్నారు.
ముచ్చటగా మూడోసారి రాక
కేటీఆర్ మంత్రి హోదాలో తన అమ్మమ్మ ఊరు కొదురుపాకకు ముచ్చటగా మూడోసారి వస్తున్నారు. మొదటిసారిగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొదురుపాక హైలెవల్ వంతెన నిర్మాణ పనులు ప్రారంభించడానికి వచ్చారు. రెండేళ్ల క్రితం అమ్మమ్మ తాతయ్య లక్ష్మీ కేశవరావు పేరిట తన సొంత నిధులతో నిర్మించిన రైతు వేదిక ప్రారంభోత్సవానికి ఎంపీ సంతోష్కుమార్తో కలిసి వచ్చారు. ఇప్పుడు మూడోసారి స్కూల్ నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి వస్తున్నారు.
సెస్ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం
సిరిసిల్లను అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిపిన మంత్రి కేటీఆర్ సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థ (సెస్) అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపుతూ వస్తున్నారు. వందల కోట్ల రూపాయలతో 220 కేవీ సబ్స్టేషన్, ప్రతి రెండు మూడు గ్రామాలకొక 33/11కేవీ సబ్స్టేషన్లు 35 ఏర్పాటు చేయించారు. సాగుతోపాటు మరమగ్గాలు, జిల్లాలోని పరిశ్రమలకు నిరంతరంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా అయ్యేలా చేసిన కృషికి, సెస్ పరిధిలోని వినియోగదారులంతా తమ కృతజ్ఞతను చాటుకున్నారు. గత డిసెంబర్లో జరిగిన సెస్ 15 డైరెక్టర్ స్థానాల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించారు. ప్రతిపక్ష పార్టీలకు ఇక్కడ స్థానం లేదని చెప్పారు. అభివృద్ధికి అంకితమైన గులాబీ పార్టీకి పట్టంగట్టారు. ప్రజలు గెలిపించిన పాలకవర్గ సభ్యులతో నేడు మంత్రి చేతుల మీదుగా ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతున్నది. మధ్యాహ్నం 11.30 గంటలకు సెస్ కార్యాలయం వెనుక ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చైర్మన్గా చిక్కాల రామారావు ఆధ్వర్యంలో సభ్యులంతా ప్రమాణ స్వీకారం చేసి, బాధ్యతలను చేపట్టనున్నారు.
తంగళ్లపల్లిలో బాపూజీ విగ్రహం
కార్మిక క్షేత్రం, నేతన్నలకు కేంద్ర బిందువైన తంగళ్లపల్లి మండల కేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. శ్రీమార్కండేయ ఆలయం ఎదుట పద్మశాలీ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రాపెల్లి ఆనందం, మచ్చ ఆంజనేయులు ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. స్థానిక పద్మశాలీ నాయకుడు మోర రాజు విగ్రహాన్ని అందించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ పద్మశాలీల ముద్దుబిడ్డ. స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ తొలి దశ ఉద్యమకారుడు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 50లక్షలతో కాంస్య విగ్రహాన్ని ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసి, మంత్రి కేటీఆర్ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఆయన విగ్రహం జిల్లాలో రెండోది. నేడు తంగళ్లపల్లిలో లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించనున్నారు.
అమ్మమ్మ ఊరిపై మమకారం.. స్కూల్ భవన నిర్మాణం
మంత్రి కేటీఆర్ తన అమ్మమ్మ ఊరు కొదురుపాకపై మమకారంతో గ్రామంలో స్కూల్ నిర్మించాలని నిర్ణయించుకున్నారు. కొదురుపాక ఆర్అండ్ఆర్ కాలనీలో జడ్పీ పాఠశాల మాత్రమే నిర్మాణం జరిగింది. దీంతో ప్రాథమిక పాఠశాలను జడ్పీ స్కూల్ ఆవరణలో కొనసాగిస్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మంత్రి కేటీఆర్ తన అమ్మమ్మ, తాతయ్య జోగినపల్లి లక్ష్మీ కేశవరావు జ్ఞాపకార్థం తన సొంత నిధులతో జడ్పీ స్కూల్ ఎదుట ఉన్న 20 గుంటల స్థలంలో ప్రాథమిక పాఠశాల భవనాన్ని నిర్మిస్తానని గతంలో ప్రజలకు మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం నేడు మధ్యాహ్నం రెండు గంటలకు, ఎంపీ సంతోష్కుమార్ తండ్రి రవీందర్రావుతో కలిసి భూమి పూజ చేయనున్నారు. అలాగే కొదురుపాక ఆర్అండ్ఆర్ కాలనీలోని మాడల్ అంగన్వాడీ పాఠశాలకు ప్రారంభోత్సవం చేయనున్నారు.
చదువుతోనే సామాజిక సమస్యలు పరిష్కారం
చదువుతోనే సామాజిక సమస్యలు పరిష్కారమవుతాయి. మంత్రి కేటీఆర్ చదువు, విద్యా సంస్థల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. తన అమ్మమ్మ తాతయ్యపై ఉన్న ప్రేమతో కొదురుపాక ప్రజలకు ప్రయోజనం చేకూరాలన్న లక్ష్యంతో ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణం చేయిస్తున్నారు. అంతేకాకుండా ఆధునికంగా నిర్మాణం జరిగేలా చూస్తున్నారు. ఆధునిక టెక్నాలజీతో డైనింగ్ హాల్, వంట గది నిర్మాణం చేయనున్నారు.
– జోగినపల్లి రవీందర్రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు