Minister KTR | రాజన్న సిరిసిల్ల, ఏప్రీల్ 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి, శాసన సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లాకు రానున్నారు. ఉదయం 9.45 గంటలకు తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల వ్యవసాయ కళాశాలకు హెలీకాప్టర్ ద్వారా చేరుకుంటారు. 10 గంటలకు జిల్లెల్లలో నిర్మించిన ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్ను ప్రారంభిస్తారు. అనంతరం అక్కడే నిర్మించిన వ్యవసాయ కళాశాల భవనాల సముదాయాన్ని ప్రారంభించి విద్యార్థులు, ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. తర్వాత మంత్రి నిరంజన్రెడ్డి, సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి హెలీకాప్టర్లో హైదరాబాద్కు తిరుగు పయనమవుతారు.
మంత్రి కేటీఆర్ మధ్యాహ్నం 1.30 గంటలకు రోడ్డు మార్గం ద్వారా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామానికి చేరుకుని ఎస్టీ హాస్టల్ భవనాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ముస్తాబాద్ మండలం మద్దికుంట శివారులో మెట్టుబండల వద్ద బీఆర్ఎస్ నిర్వహించే ఆత్మీయ సమ్మేళనానికి హాజరవుతారు. కాగా, మంత్రుల రాక సందర్భంగా అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కళాశాల ప్రారంభోత్సవానికి అతిథులుగా ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, చెన్నమనేని రమేశ్బాబు, సుంకె రవిశంకర్, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు హాజరు కానున్నారు.