కార్పొరేషన్, నవంబర్ 14: పదేళ్లలో నగరంలో జరిగిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్కు ఓటు వేయాలని పార్టీ కరీంనగర్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ ప్రజలను కోరారు. నగరంలోని 33, 34,35వ డివిజన్లలో మంగళవారం సాయంత్రం ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. బీఆర్ఎస్ శ్రేణులు మంత్రిని గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ, ఈ పదేళ్ల కాలంలో నగరాభివృద్ధి కోసం వేల కోట్ల నిధులు తీసుకువచ్చి ఎంతో అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. రోడ్లన్ని ఎంత
సుందరంగా మారాయో ప్రజలకు కనిపిస్తున్నాయన్నారు. నగరంలో ఎక్కడా కూడా మట్టి రోడ్డు కనిపించకుండా అభివృద్ధి చేశామన్నారు. తెలంగాణను చూసి ఈర్ష పెంచుకున్న ఆంధ్రా నాయకులు ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీల ముసుగులో హైదరాబాద్లో అడ్డా వేశారని విమర్శించారు. కేసీఆర్ను ఈ ఎన్నికల్లో ఓడించి హైదరాబాద్ సంపదను దోచుకుందామని చూస్తున్నారని హెచ్చరించారు.
కాంగ్రెస్కు ఓటు వేస్తే తెలంగాణ కుక్కలు చింపిన విస్తరి అవుతుందని పేర్కొన్నారు. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణను ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. కరీంనగర్ ఎంపీగా గెలిచిన బండి సంజయ్ ఈ నాలుగున్నర ఏండ్లలో ఏ రోజైనా ప్రజల వద్దకు వచ్చారా అని ప్రశ్నించారు. స్మార్ట్సిటీ వచ్చినప్పుడు సంజయ్ కార్పొరేటర్గా ఉన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు తన వల్లే స్మార్ట్సిటీ వచ్చిందని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలోనే ప్రజల వద్దకు వచ్చే ఇలాంటి నాయకులకు ప్రజలే తగిన బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెస్ ఓ రౌడిషీటర్కు టికెట్ ఇచ్చిందన్నారు. సర్పంచ్గా ఉంటేనే 32 కేసులు నమోదైతే, ఇక ఎమ్మెల్యే అయితే ఎన్ని వందల కేసులు నమోదవుతాయో ఆలోచించాలన్నారు. అలాంటి వ్యక్తులను గెలిపిస్తే ప్రజల భూములు మిగులుతాయా అని ప్రశ్నించారు. ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి వేగంగా పూర్తి కావాలంటే కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మేయర్ యాదగిరి
సునీల్రావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, కార్పొరేటర్లు చాడగొండ బుచ్చిరెడ్డి, బర్కత్అలీ, మాజీ కార్పొరేటర్ చీటి రామారావు, బీఆర్ఎస్ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.
కాంగ్రెస్కు ఓటు వేస్తే తెలంగాణ ఆగమవుతది
కాంగ్రెస్ చెబుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మి వారికి ఓటు వేస్తే తెలంగాణ రాష్ట్రం ఆగం అవుతుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. బండి సంజయ్కి స్మార్ట్సిటీ సాధించిన విషయంలో ఎలాంటి సంబంధం ఉందని ప్రశ్నించారు. అర్హత లేకున్న కూడా సీఎం కేసీఆర్ అనుమతితో అప్పటి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు చుట్టు తిరిగి వారిని ఒప్పించి కరీంనగర్ స్మార్ట్సిటీని తీసుకువచ్చినట్లు తెలిపారు. కేంద్రం నుంచి రాష్ర్టానికి అనేక విషయాల్లో అనుమతులు, ఇతర వాటిని సాధించుకున్నామని పేర్కొన్నారు. మరి ఇప్పటి ఎంపీ ఏం సాధించారని నిలదీశారు. స్మార్ట్సిటీ నిధులతో మంత్రి గంగుల కమలాకర్ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. తెలంగాణలో పదేళ్లలో జరిగిన అభివృద్ధి విషయమై ప్రతి ఒక్కరూ చర్చ పెట్టాల్సినా అవసరం ఉందన్నారు.
– వినోద్కుమార్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు