Midde Ramulu |వేములవాడ, ఆగస్టు 10 : అమెరికాలో మిద్దె రాములు జయంతి 86వ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ జానపద కళారంగానికి అంతర్జాతీయ స్థాయిలో విశేష గుర్తింపు తెచ్చిన జాతీయ, అంతర్జాతీయ ఒగ్గుకథ కళాకారులు, స్వర్గీయ మిద్దె రాములు 86వ జయంతి వేడుకలు అమెరికాలోని చార్లెట్ నగరంలో తెలుగు వారి సమక్షంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఇటీవల ఆగస్టు1న కాలిఫోర్నియాలో జరిగిన సిలికానాంధ్ర రజతోత్సవ వేడుకలలో మిద్దె రాములు వారసులు మిద్దె పర్షరాములు, మిద్దె వినీత్ ప్రదర్శించిన ఒగ్గుకథ అద్భుతంగా ప్రదర్శించి అమెరికా గడ్డపై మన జానపద కళా వైభవాన్ని తాటి చెప్పగా తెలుగు ప్రముఖులు మంత్రముగ్ధులయ్యారు.
ఈ జయంతి సందర్భంలో మిద్దె రాముల పాడిన ప్రసిద్ధ పాటలు, ఒగ్గుకథలను ఆలపించి, ఆయన కళాసేవను ఘనంగా గుర్తుచేసుకున్నారు. తెలంగాణ సంస్కృతి, ఒగ్గుకథ విశిష్టతను ప్రపంచ నలుమూలలా చాటిచెప్పిన మిద్దె రాములు సేవలు చిరస్మరణీయమని ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుంకు ప్రదీప్, బొందిల శ్రీనివాస్, మిద్దె పర్శరాములు, రాజారెడ్డి, నాగిరెడ్డి, కేవీ రావు, సతీష్, అశోక్, కిరణ్, పురుషోత్తం, హరీష్, భారత్, రామ్, సురేష్, రవి, మిద్దె వినీత్ తదితరులు పాల్గొన్నారు.