కరీంనగర్ బల్దియా పారిశుధ్య విభాగం అధికారుల నిర్లక్ష్యం పెచ్చుమీరుతున్నది. పలు దవాఖానలు మెడికల్ వ్యర్థాలు, గడువు తీరిన గోలీలను నిత్యం చెత్త కలెక్షన్ పాయింట్లలో కుప్పలు తెప్పలు పారబోస్తున్నట్టు తెలుస్తుండగా, కనీస నిఘా పెట్టకపోవడం, చర్యలు తీసుకోకపోవడం అలసత్వానికి అద్దంపడుతున్నది. బయోమైనింగ్ చేయాల్సిన ఈ వేస్టేజీ చెత్తతోపాటే డంప్యార్డుకు చేరుతుండగా కాలిస్తే విషవాయువులు వెలువడే ప్రమాదం పొంచి ఉన్నది. ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది.
కరీంనగర్ కార్పొరేషన్, జూన్ 7: కరీంనగరంలోని పలు దవాఖానల యాజమాన్యాలు నిబంధనలు విస్మరిస్తున్నాయి. చెత్త కలెక్షన్ పాయింట్ల వద్ద భారీగా మెడికల్ వ్యర్థాలు, గడువు దాటిన టాబ్లెట్స్ను పారబోస్తుండగా, అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ముఖ్యంగా దవాఖానల ఏరియాల్లోనే ఇలాంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయని పారిశుధ్య విభాగం సిబ్బంది పేర్కొంటున్నారు. అయితే ఆయా పాయింట్ల వద్ద సరైన నిఘా లేకుండా పోవడం వల్ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
అయితే చెత్తలో మెడికల్ వ్యర్థాలను కలుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు, కేవలం నామమాత్రపు జరిమానాలతో సరిపెడుతుండడంతోనే వీరికి అడ్డూ అదుపు లేకుండా పోయిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలాగే దవాఖాన నిర్వాహకుల నుంచి పారిశుధ్య విభాగం ఉన్నతాధికారులకు భారీగా ముడుపులు వెళ్తుండడం వల్లే కఠిన చర్యలు ఉండడం లేదన్న గుసగుసలు పారిశుధ్య విభాగం సిబ్బందిలోనే వ్యక్తమవుతున్నాయి. గతంలో చెత్త కలెక్షన్ పాయింట్ల వద్ద ఎవరూ చెత్త వేయవద్దని, సీసీ కెమెరాల ద్వారా నిఘా పెట్టామని, జరిమానా విధిస్తామంటూ ఫ్లెక్సీలు పెట్టి హడావిడి చేసిన అధికారులు, ఆ కొద్దిరోజులకే మరిచిపోయారు.

విషవాయువులు వెలువడే ప్రమాదం
గడువు దాటిన టాబ్లెట్స్ను నిబంధనల మేరకు మెడికల్ బయో మైనింగ్ విధానంలోనే నాశనం చేయాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దవాఖానల నుంచి మెడికల్ వేస్ట్ తీసుకెళ్లేందుకు ప్రైవేటు సంస్థ పని చేస్తుంది. అయితే ఈ సంస్థకు ఎక్కువ మొత్తంలో ఫీజులు చెల్లించాల్సి వస్తుందన్న సాకుతో కొందరు యజమానులు రాత్రిళ్లు చెత్త పాయింట్ల వద్ద మెడికల్ వేస్టేజీ, కాలంచెల్లిన గోలీలను పారవేస్తున్నారని తెలుస్తోంది. అయితే పారిశుధ్య సిబ్బంది వీటిని చెత్తతోపాటే డంప్యార్డుకు తరలిస్తుండగా, వీటిని తగులబెడితే విషవాయువులు వెలువడే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా చెత్త పాయింట్ల వద్ద నిఘాపెట్టి మెడికల్ వేస్టేజీని పారబోస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, మరోవైపు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్న అధికారులపై విచారణ చేపట్టాలని పలువురు కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు.