కరీంనగర్ విద్యానగర్, జూన్ 27 : కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన దవాఖానలోని ఎన్సీడీ (నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్) కేంద్రంలో రోగులకు వైద్య సేవలు మృగ్యమయ్యాయి. మధుమేహం, రక్తపోటు, గుండెజబ్బులు, థైరాయిడ్ తదితర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రత్యేక వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో విధుల నిర్వహణ సరిగా లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిరోజూ సుమారు 150 మంది వరకు ఓపీ ఈ కేంద్రానికి వస్తున్నప్పటికీ, కొందరు వైద్యులు, సిబ్బంది సమయానికి రావడం లేదని, గంటల తరబడి వేచి చూసిన తర్వాత కొందరికి కేవలం రక్తపోటు పరీక్ష చేసి పంపిస్తున్నారని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హాజరు రిజిస్టర్పై అనుమానాలెన్నో?
ఈ సెంటర్లోని హాజరు రిజిస్టర్లో కొందరు ఉద్యోగులు వారం రోజులుగా సంతకాలు కూడా చేయడం లేదని, మరికొందరు సంతకం పెట్టి కొద్దిసేపటికే కేంద్రం నుంచి వెళ్లిపోతున్నట్లు తెలిసింది. రిజిస్టర్లో హాజరు నమోదవుతున్నా, విధి నిర్వహణలో మాత్రం సిబ్బంది కనిపించడం లేదని రోగులు, వారి బంధువులు చెబుతున్నారు. ఈ అంశంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని ప్రజలు కోరుతున్నారు.
పర్యవేక్షణ ఎకడ?
ప్రధాన దవాఖానలో ఉన్న ఈ కేంద్రంపై సంబంధిత వైద్యాధికారుల పర్యవేక్షణ కనిపించడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి సేవల నాణ్యతను పరిశీలించాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు. క్షేత్రస్థాయిలో సేవలపై దృష్టి పెట్టాల్సిన అధికారులు సమావేశాలు, ఫొటో కార్యక్రమాలకే పరిమితమవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్సీడీ కేంద్రంలో సేవలపై సమగ్ర విచారణ జరిపి, విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్వయంగా స్పందించి పరిస్థితులను పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం : డాక్టర్ విప్లవశ్రీ
ఎన్సీడీ సెంటర్పై వస్తున్న ఆరోపణలపై ఎన్సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ విప్లవశ్రీ స్పందించారు. అధికారుల అనుమతి లేకుండా ఎవరూ విధులకు గైర్హాజరు కావడానికి అవకాశం లేదన్నారు. డ్యూటీ సమయంలో ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా ఉండి రోగులకు వైద్య సేవలు అందించాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రతి ఆరోగ్య కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఉద్యోగులందరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ అంశంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని తెలిపారు.