కార్పొరేషన్, ఫిబ్రవరి 6: కరీంనగర్లోని నిరాశ్రయులకు ప్రభుత్వం నుంచి ఆశ్రయం కల్పిస్తున్న కేంద్రంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల వసతి సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని నగర మేయర్ యాదగిరి సునీల్రావు తెలిపారు. సోమవారం 10వ డివిజన్లోని నిరాశ్రయుల కేంద్రంలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆశ్రయం పొందుతున్న వారిని అక్కడ అందుతున్న సేవలు, భోజనం ఇతర వాటిపై అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మేయర్ మాట్లాడుతూ ఎలాంటి ఆదరణ, ఆశ్రయం లేని ఎందరో అభాగ్యులకు ప్రభుత్వమే ఆశ్రయ కేంద్రం ఏర్పాటు చేసి ఆశ్రయంతో పాటు భోజన వసతి కల్పిస్తుందని తెలిపారు. పట్టణ పేదరిక నిర్మూలన, నగరపాలక సంస్థల ఆధ్వర్యంలో నిర్వాహకుల పర్యవేక్షణలో వారి ఆలనా పాలనా చూస్తారని పేర్కొన్నారు. ప్రస్తుతం కేంద్రంలో 30 మంది వృద్ధులు ఆశ్రయం పొందుతున్నారని తెలిపారు. ఇలాంటి వారికి నగరపాలక సంస్థ ద్వారా అన్ని రకాల వసతి సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆశ్రయ కేంద్రానికి నిధులు కేటాయించామన్నారు. ఈ కేంద్రంలో పరిశుభ్రమైన వాతావరణం కల్పించి, సమస్యలు లేకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నగరపాలక సంస్థ నుంచి కలరింగ్, కుర్చీలు, పర్నిఛర్, బాత్రూంలు, మంచినీరు తదితర సదుపాయాలు కల్పించే పనులు చేపడుతున్నామన్నారు.
పార్కులను అభివృద్ధి చేస్తాం..
నగరంలోని పార్కులను ఆహ్లాదాన్ని పంచే విధంగా సుందరంగా తీర్చిదిద్దుతున్నామని నగర మేయర్ యాదగిరి సునీల్రావు తెలిపారు. 58వ డివిజన్లోని కేడీఆర్ పార్కులో అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కటారి దేవేందర్రావు పేరుతో ఏర్పాటు చేసిన ఈ పార్కులో ఇప్పటికే పచ్చదనం నెలకొందన్నారు. నగరంలోని అన్ని డివిజన్లల్లోని పార్కు స్థలాలను సుందరంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో కమిషనర్ సేవా ఇస్లావత్, కార్పొరేటర్లు ఆనంద్, రాపర్తి విజయ, నగరపాలక అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అంతరాయం లేకుండా చూడాలి
రానున్న వేసవి కాలంలో నగర ప్రజలకు మంచినీటి సరఫరాతో అంతరాయం రాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని నగర మేయర్ యాదగిరి సునీల్రావు అధికారులను ఆదేశించారు. నగర ప్రజలకు నీటి శుద్ధీకరణ కేంద్రం నుంచి ప్రతి రోజూ సురక్షిత నీటిని సరఫరా చేసే విధంగా నగరపాలక సంస్థ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. సోమవారం మానేరు డ్యాం సమీపంలోని నగరపాలక సంస్థ నీటి శుద్ధీకరణ కేంద్రంలో మంచినీటి సరఫరాపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండున్నర సంవత్సరాలుగా ప్రజలకు అంతరాయం లేకుండా సురక్షితమైన మంచి నీటిని అందిస్తున్నామన్నారు.
మానేరు డ్యాంలో ప్రస్తుతం 14 టీఎంసీల నీరు ఉన్నప్పటికీ వచ్చే వేసవిలో 3 నెలల పాటు యథావిధిగా నీరందించడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై సూచనలు చేశారు. ఫిల్టర్బెడ్ లోని మోటర్, స్పేర్ పంపులు, బూస్టర్ల వద్ద ఉన్న మోటరు పంపులు జనరేటర్లు సక్రమంగా పనిచేసేలా మందస్తు చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అదనంగా స్పేర్ బై మోటర్ పంపులను అందుబాటులో ఉంచుకోవాలన్నా రు. నీటి సరఫరాలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక్కడ ఎస్ఈ నాగమల్లేశ్వర్రావు, ఈఈ కిష్టయ్య, డీఈ లచ్చిరెడ్డి, ఓం ప్రకాశ్, ప్రజారోగ్య శాఖ ఈఈ సంపత్రావు, ఏఈ దేవేందర్ పాల్గొన్నారు.