కరీంనగర్ రూరల్, జనవరి 11:అంధత్వ రహిత తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మండల ప్రత్యేకాధికారి మధుసూదన్రెడ్డి తెలిపారు. బుధవారం కరీంనగర్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య అధ్యక్షతన సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీటీసీలు, వైద్యసిబ్బందితో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 18 నుంచి రెండోవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారని తెలిపారు. మండల డాక్టర్ ఎం ఆరుణ మాట్లాడుతూ గ్రామాల్లో 100 రోజుల పాటు శిబిరాలు నిర్వహిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. కంటి ఆపరేషన్ అవసరమైన వారికి హైదరాబాద్లోని సరోజిని కంటి వైద్యశాలకు పంపిస్తారన్నారు. ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఎంపీటీసీలు, సర్పంచులు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
కొత్తపల్లి, జనవరి 11: అంధత్వ నివారణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపడుతున్నదని ఎంపీపీ పిల్లి శ్రీలతామహేశ్ పేర్కొన్నారు. ఈ నెల 18 నుంచి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమ సన్నాహక సమావేశాన్ని కొత్తపల్లి మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఈసందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ, అధికారులు, ప్రజాప్రతినిధులు కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతంచేయడంలో క్రియాశీలక పాత్ర పోషించాలని కోరారు. ప్రతి గ్రామంలో డప్పు చాటింపు చేయించి, శిబిర నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. కంటి సమస్య ఉన్న ప్రతి వ్యక్తిని ఉచిత వైద్య శిబిరాలకు తరలించేలా ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి అద్దాలు కూడా ఉచితంగానే అందజేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్రెడ్డి, ఎంపీవో శ్రీనివాస్, వైద్యులు వంశీ, మౌనిక, సర్పంచులు జింక సంపత్, రాచమల్ల మధు, మొగిలి, మంజుల, సమ్మయ్య, ఎంపీటీసీలు తిరుపతినాయక్, పట్టం శారద, లక్ష్మీనారాయణ, పండుగ గంగవ్వ, నర్సయ్య, కోఆప్షన్ సభ్యుడు షరీఫ్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
చొప్పదండి, జనవరి11: కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎంపీపీ చిలుక రవీందర్ పిలుపునిచ్చారు. ఎంపీపీ అధ్యక్షతన మండలపరిషత్ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 18 నుంచి మే వరకు జరిగే కంటి వెలుగు కార్యక్రమంలో ప్రతి గ్రామపంచాయతీలో సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ప్రతి రోజు 300 నుంచి 400 మంది వరకు ప్రజలు చికిత్సకు వచ్చే అవకాశం ఉన్నందున వారికి తాగునీరు. టెంట్లు, కుర్చీలు, రవాణా, భోజన సదుపాయాలను కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీవో స్వరూప, మండల వైద్యాధికారులు రమాదేవి, అద్నాన్, మండల పంచాయతీ అధికారి రాజగోపాల్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు సింగిరెడ్డి కిష్టారెడ్డి, సర్పంచులు కొత్తూరి లింగమ్మ, అప్పిడి సౌజన్య, కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.