Odela Mallanna Pedda Patnam | ఓదెల, జులై 12 : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెద్దపల్లి జిల్లాలోని ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో ఆదివారం స్వామివారి పెద్దపట్నం బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉగాది పర్వదినాన ప్రారంభమైన ఈ మల్లన్న జాతర నాలుగు నెలలుగా సాగి జూలై రెండో ఆదివారం పెద్దపట్నం బ్రహ్మోత్సవాలతో ముగియడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం ఉత్సవాలు వేద పండితులు, ఒగ్గు పూజారులు, కన్నుల పండుగ పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
గణపతి పూజ, శివ పుణ్యాహవాచనము, శివయాగ మంటప స్థాపన, బియ్యం సుంకు, వీరభద్ర ప్రస్థానం, పల్లారా ముసల ఖడ్గ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామి వారికి ఆలయ చైర్మన్ చీకట్ల మొండయ్య, కార్యనిర్వాహణాధికారి సదయ్యలు పట్టు వస్త్రాలను సమర్పించారు. పూజల్లో ఆలయ ధర్మకర్తలు, వేద పండితులు ధూపం వీరభద్రయ్య, భవాని ప్రసాద్, పంచాక్షరి, గంగాధర్, అభిషేక్, మఠం భద్రయ్య, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేద పండితులు తదితరులు పాల్గొన్నారు.
ఏర్పాట్లలో నిర్వాహకులు విఫలం
అంగరంగ వైభవంగా జరిగే ఉత్సవాల ఏర్పాట్లలో అధికారులు విఫలమయ్యారు. ఈ ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో క్యూ లైన్ లో భక్తులు బారులు తీరారు. గంటల తరబడి క్యూ లైన్ లో నిలబడలేక మహిళలు, వృద్ధులు, పిల్లలు క్యూ లైన్ లో కింద కూర్చోవడం కనబడింది. కాగా వృద్ధులను, దివ్యాంగులను ఆలయ సిబ్బంది ప్రత్యేక దర్శనం ద్వారా ఆలయం లోపలికి పంపించారు.