Ganneruvaram | గన్నేరువరం, నవంబర్ 16 : గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి నుండి గన్నేరువరం మీదుగా పొత్తురూ వరకు డబుల్ రోడ్డు ప్రారంభించి పనులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ యువజన సంఘాల నాయకులు గుండ్లపల్లి వద్ద ఆదివారం రాజీవ్ రహదారిపై బైఠాయించి మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యువజన సంఘాల నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే కవ్వంపల్లి రోడ్డు సాకుగా చూపి అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు కావస్తున్నా తట్టుడు మట్టిపోయలేదని ఆరోపించారు.
మండల ప్రజలు శిథిలమైన రోడ్డుతో నానా అవస్థలు పడుతుంటే ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ రోడ్డు నిర్మాణాన్ని ఏమాత్రం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదని, డబుల్ రోడ్డు మంజూరై మూడు సంవత్సరాలు అవుతున్న పనులు పూర్తి కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో పూర్తి చేస్తానని హామీ ఇచ్చి నేడు అధికారంలోకి వచ్చాక చేతులు దులుపుకున్నారని ద్వజమెత్తారు. 15 రోజుల్లో రోడ్డు పనులు తిరిగి ప్రారంభిస్తానని తెలిపిన ఎమ్మెల్యే అదే మాటకు కట్టుబడి కాంట్రాక్టర్ తో రోడ్డు పనులు చేయించాలని లో-లేవల్ కల్వర్టుల వద్ద హై లెవల్ బ్రిడ్జిలు నిర్మించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.