Karimnagar | తిమ్మాపూర్, సెప్టెంబర్ 1: ఓ లారీ అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లడంతో కరీంనగర్లోని అలుగునూర్లో కలకలం రేపింది. ఈ ఘటనలో ఇంటి ముందు ఏర్పాటు చేసిన రేకుల షెడ్డు పూర్తిగా ధ్వంసమైంది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
కరీంనగర్ జిల్లా అలుగునూర్ 8వ డివిజన్లోని కార్పొరేట్ స్కూల్ సమీపంలో జాప మధుకు చెందిన ఇంట్లోకి మంగళవారం తెల్లవారుజామున భారీ లారీ దూసుకెళ్లింది. లారీ ఢీకొనడంతో పెద్ద శబ్దం రావడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. బయటకు వచ్చి చూడగా లారీ ఇంటి ముందు ఉన్న రేకుల షెడ్డును ధ్వంసం చేసి లోపలికి దూసుకెళ్లి కనిపించింది.
ప్రమాదం అనంతరం లారీ డీజిల్ ట్యాంక్ పేలి మంటలు వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన గ్రామస్తులు మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
లారీ ఢీకొనడంతో ఇంటి ముందు భాగం, రేకుల షెడ్డు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.8 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు జాప మధు తెలిపాడు. ప్రమాదానికి లారీ అదుపుతప్పడమే కారణమా, ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే వివరాలు తెలియాల్సి ఉంది.