మెట్పల్లి, ఫిబ్రవరి 15 : తమ నియోజకవర్గంలోని ముత్యంపేట నిజాం చక్కెర ఫ్యాక్టరీపై ప్రభుత్వం కమిటీ వేసినట్లు ఇటీవల ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకున్నానని, దీని గురించి తనకు పూర్తి సమాచారం ఇవ్వాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల కోరారు. ఈ మేరకు అసెంబ్లీలో గురువారం జీరో అవర్లో కోరుట్ల నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
ముందుగా శాసనసభ్యుడిగా ఎన్నికైన అనంతరం తొలిసారిగా సభలో మాట్లాడే అవకాశం వచ్చినందుకు శాసనసభాపతికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించారు. చక్కెర ఫ్యాక్టరీపై వేసిన కమిటీ గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని, చెరుకు రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు సంబంధిత అంశాలను కమిటీ దృష్టికి తీసుకెళ్లడానికి ఈ ప్రాంత ఎమ్మెల్యేగా బాధ్యత తనకు ఉంటుందన్నారు.
ఏ కమిటీ వేశారు, ఆ కమిటీ తీసుకునే చర్యలు, విధి విధానాలు ఏంటో తమకు చెప్పాలని కోరారు. కోరుట్ల, మెట్పల్లి మున్సిపాలిటీల అభివృద్ధి కోసం టీయూఎఫ్ఐడీసీ నుంచి గత ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, ప్రస్తుత ప్రభుత్వం ఆ నిధులను నిలిపేయాలని నిర్ణయించిందని, అభివృద్ధి పనులు కొనసాగేందుకు నిధులను విడుదల చేయాలని కోరారు. కోరుట్ల డయాలసిస్ కేంద్రంలో కిడ్నీ బాధితుల సంఖ్యకు అనుగుణంగా సంబంధిత మిషన్లు సరిపోవడం లేదని, వెంటనే డయాలసిస్ మిషన్ల సంఖ్యను పెంచినైట్లెతే పేద కిడ్నీ బాధితులకు మేలు జరుగుతుందని సంబంధిత మంత్రికి విజ్ఞప్తి చేశారు.