గోదావరిఖని, ఫిబ్రవరి 16: జననేత, ప్రగతి రథసారథి ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్డే సందర్భంగా ఖనిలోని మహిళలకు రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ కానుకలు అందజేశారు. గోదావరిఖని పట్టణంలోని మహిళలకు 23వేల చీరలు పంపిణీ చేశారు. కోలేటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. పెద్ద సంఖ్యలో మహిళలు రావడంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. వారిని అదుపు చేయడానికి గోదావరిఖని ఏసీపీ గిరి ప్రసాద్, సీఐలు, ఎస్ఐలు నానా తంటాలు పడ్డారు. చివరికి ఫౌండేషన్ సభ్యులు పంపిణీని నిలిపివేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఆందోళన వద్దని, ఇంటింటికీ వచ్చి పంపిణీ చేస్తామని కోలేటి స్పష్టం చేయడంతో అందరూ వెనుదిరిగారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు కోలేటి శ్రీనివాస్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాతపెల్లి ఎల్లయ్య ఉన్నారు.
దేశానికి కేసీఆర్ నాయకత్వం అవసరం
ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను అధిగమించే సత్తా కేసీఆర్కు మాత్రమే ఉన్నది. రాష్ర్టాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తూ, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న కేసీఆర్ ప్రధాని కావాలని దేశమంతా కోరుకుంటున్నది. బీఆర్ఎస్ ద్వారానే అనేక సమస్యలు పరిష్కారమవుతాయని ప్రజలు భావిస్తున్నారు. నిరుపేదలకు కోలేటి ఫౌండేషన్ ఎప్పుడూ అండగా ఉంటుంది. కరోనా టైంలో నియోజకవర్గంలో వందలాది మందికి నిత్యావసర వస్తువులు అందించాం. కోలేటి ఫౌండేషన్ ద్వారా ఇక ముందు కూడా సేవా కార్యక్రమాలు చేపడుతాం. – విలేకరులతో రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్