కొత్తపల్లి, ఫిబ్రవరి 1: చదువే అన్నింటికి మూలమని, విద్యతోనే ప్రతిఒక్కరికీ సమాజంలో గౌరవం లభిస్తుందని అని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యానించారు. సమైక్య పాలనలో సరైన వసతుల్లేక చిక్కి శిథిలమైన సర్కారు బడులకు సకల హంగులు కల్పించేందుకే ‘మన ఊరు-మన బడి’కి అంకురార్పణ చేశారని చెప్పారు. నిరుపేద పిల్లలకు కేజీ టూ పీజీ ఉచిత విద్యనందిస్తున్న గొప్పవ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు.
విద్యార్థులు సెల్ఫోన్లకు బానిసలు కావద్దని, కష్టపడి చదవి లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. కొత్తపల్లి మండలం చింతకుంటలో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం కింద అభివృద్ధి చేసిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల తరగతి గదులను కలెక్టర్ ఆర్వీ కర్ణన్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విద్య, వైద్యం కోసం సీఎం కేసీఆర్ ప్రతిక్షణం పరితపిస్తున్నారన్నారు. ప్రభుత్వ, గురుకుల, మోడల్ స్కూళ్లలో సీట్ల కోసం పోటీ పడుతుండడమే అందుకు నిదర్శనమన్నారు. ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’కి పెద్దమొత్తంలో నిధులు కేటాయిస్తున్నదని, కరీంనగర్ జిల్లాలో మొదటి విడుత 92 కోట్లతో 230 పాఠశాలలను ఆధునీకరిస్తున్నామని చెప్పారు.
కొత్తపల్లి మండలంలోని ఎనిమిది పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులు తుదిదశకు చేరాయన్నారు. 27.24 లక్షలతో చింతకుంట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను తీర్చిదిద్దామని చెప్పారు. విద్యార్థులు బాగా చదువుకొని గురువులు, తల్లిదండ్రులకు, రాష్ట్రానికి పేరు తెచ్చేలా గొప్పగా ఎదగాలని ఆకాంక్షించారు. కలెక్టర్ కర్ణన్ మాట్లాడుతూ ‘మన ఊరు- మన బడి’తో ప్రభుత్వ పాఠశాలలు సరికొత్తగా మారుతున్నాయన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, జిల్లా విద్యాధికారి జనార్దన్రావు, జడ్పీటీసీ పిట్టల కరుణ, ఎంపీడీవో ఏ శ్రీనివాస్రెడ్డి, నగర్ మేయర్ సునీల్ రావు, ఎంపీటీసీలు భూక్యా తిరుపతి నాయక్, పట్టెం శారదాలక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు.