కరీంనగర్ : రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR ) మూడోసారి సీఎంగా కావడం ఖాయమని తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇన్హాన్ (Imtiaz Inhan) ధీమాను వ్యక్తం చేశారు. నిరుపేద ముస్లిం మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల పంపిణీలో పాల్గొనేందుకు కరీంనగర్కు వచ్చిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా పరిపాలన సాగుతున్నదని అన్నారు.
గత ప్రభుత్వాలు చేయని విధంగా వంద శాతం సబ్సిడీ (Subcidy) తో ఆర్థిక సాయం చేయటం మైనార్టీల అభివృద్ధి పట్ల కేసీఆర్కు ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందని పేర్కొన్నారు. మైనార్టీ బంధు (Minority Bandu) కోసం దరఖాస్తులు చేసుకున్న వారందరికీ విడతలవారీగా ఆర్థిక సాయం చేసేందుకు ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.
మొదటి విడతగా రాష్ట్రవ్యాప్తంగా 10 వేల మంది లబ్ధిదారులకు అందజేయగా, రెండో విడతలో మరో 15 వేల మందికి చెక్కులు పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల 65 వేల మంది దరఖాస్తులు చేసుకోగా ప్రతి వ్యక్తికి ఆర్థిక సాయం అందించేందుకు కృషి చేస్తామన్నారు. మైనార్టీ బంధు పథకం నిరంతర ప్రక్రియని వివరించారు.
అభివృద్ధిలో కరీంనగర్ నెంబర్ వన్ గా నిలుస్తోందని, సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో మంత్రి గంగుల కమలాకర్ ( Minister Gangula Kamalakar ) పట్టుదల, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ సహకారంతో కరీంనగర్లో ఊహించని అభివృద్ధి జరుగుతుందని ప్రశంసించారు. తీగల వంతెన, మానేరు రివర్ ఫ్రంట్, స్మార్ట్ సిటీ కరీంనగర్ అభివృద్ధిని చాటి చెబుతున్నాయని అన్నారు.