Sunke Ravishankar | గంగాధర, సెప్టెంబర్ 1 : ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసి, దేశానికే రోల్ మోడల్ గా తీర్చిదిద్దిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నంది, పంది అంటూ కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన దానికి నిరసనగా మంగళవారం మండలంలోని మధురానగర్ చౌరస్తాలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కేసీఆర్ పని చేస్తే, అప్పుల కుప్పగా మార్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడని దుయపెట్టారు. ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న రేవంత్ రెడ్డి నోటిని అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వెయ్యి రోజులు గడిచినా 420 హామీలను నెరవేర్చలేదని దుయ్యబట్టారు. రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, రుణమాఫీ, దళిత బంధు, బీసీ బందు, వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇచ్చిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వెనుకబాటుకు గురైన తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశానికే రోల్ మోడల్ గా నిలిపారని గుర్తు చేశారు. తెలంగాణలో నంది ఎవరో, పంది ఎవరో ఇక్కడి ప్రజానీకానికి తెలుసని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి నోటిని అదుపులో పెట్టుకోవాలని, కెసిఆర్ కు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు మేచినేని నవీన్ రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాగి మహిపాల్ రావు, నాయకులు వేముల దామోదర్, మడ్లపల్లి గంగాధర్, శ్రీమల్ల మేఘరాజు, ముక్కెర మల్లేశం, గడ్డం స్వామి, ఎండి అబ్బాస్, వెంకటేశ్వరరావు, మామిడిపల్లి అఖిల్, బొల్లాడి శ్రీనివాస్ రెడ్డి, జోగు లక్ష్మీరాజం, వడ్లూరి ఆదిమల్లు, సామంతుల శ్రీనివాస్, లింగాల దుర్గయ్య, గంగాధర మోహన్, ద్యావ సంజీవ్, నల్ల నరోత్తం రెడ్డి, గంగాధర శంకర్ తదితరులు పాల్గొన్నారు.