కరీంనగర్ కార్పొరేషన్, ఫిబ్రవరి 24 : కరీంనగర్ నగరపాలక సంస్థ మరో జాతీయ స్థాయి అవార్డు దక్కించుకున్నది. అమృత్ సిటీ పథకంలో భాగంగా ‘పే జల్ సర్వేక్షణ్’లో మెరుగైన పనితీరు చూపి కైవసం చేసుకున్నది. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అవార్డును ప్రకటించింది. దేశవ్యాప్తంగా మెరుగైన పనితీరు చూపించిన అమృత్ సిటీలకు కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయి అవార్డులను ఇస్తున్నది. ఈ పథకంలో భాగంగా ఆయా నగరాల్లో మంచినీటి సరఫరా మెరుగుపరచడం, పార్కుల అభివృద్ధి, నగర సుందరీకరణ, తదితర కార్యక్రమాలకు నిధులు కేటాయించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో అమృత్ కింద వచ్చిన నిధులు, అప్పటి రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన అర్బన్ మిషన్ భగీరథ ద్వారా ప్రతి రోజూ మంచినీటి సరఫరా చేస్తున్నారు. దీంతోపాటు హౌసింగ్బోర్డు కాలనీ రిజర్వాయర్ పరిధిలో పైలెట్ ప్రాజెక్టు కింద 24 గంటల నీటి సరఫరా చేసేందుకు ఇప్పటికే అన్ని చర్యలూ తీసుకున్నారు.
వచ్చే రెండు, మూడు నెలల్లో దీనిని కూడా ప్రారంభించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అలాగే పార్కులను కూడా సుందరంగా తీర్చిదిద్దారు. అనేక చౌరస్తాలను ఆకర్షణీయంగా అభివృద్ధి చేశారు. వీటితోపాటు మెరుగైన పనులను చేపట్టడంతో జాతీయ స్థాయిలో కరీంనగర్ నగరపాలక సంస్థను అవార్డుకు ఎంపిక చేశారు. కాగా, అమృత్ సిటీ పథకంలో భాగంగా ఉన్న ఐదు కేటగిరీల్లో ఏ విభాగంలో జాతీయ అవార్డు వచ్చింది. ఈ విషయాన్ని వచ్చే నెల 5న కేంద్రం ప్రకటించనున్నది. అయితే సఫాయి మిత్ర, స్వచ్ఛ సర్వేక్షణ్తోపాటు ఇతర అన్ని కార్యక్రమాల్లోనూ నగరపాలక సంస్థ మెరుగైన పనితీరు చూపించి అవార్డులను సొంతం చేసుకుంటుండంపై నగరవాసులు హర్షం వ్యక్తం చేశారు. పాలకవర్గ సభ్యులతోపాటు కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది కృషిని ప్రశంసించారు.
కరీంనగర్ నగరపాలక సంస్థకు జాతీయ స్థాయిలో అవార్డు రావడం మా పాలకవర్గంపై మరింత బాధ్యత పెంచింది. కేంద్రం ఇచ్చిన అమృత్ నిధులతో నగరంలో అనేక అభివృద్ధి పనులు చేయడంతోపాటు ముఖ్యంగా మంచినీటి సరఫరాను పూర్తిస్థాయిలో మెరుగుపర్చాం. అలాగే పార్కులు, చౌరస్తాల సుందరీకరణ పనులు చేపట్టాం. మా పాలకవర్గ సమయంలో జాతీయ స్థాయిలో అవార్డులు ఎక్కువగా వచ్చాయి. మరింతగా పని చేసి మరిన్ని అవార్డులు సాధించే దిశగా పని చేస్తాం. ఈ అవార్డు వచ్చేందుకు కృషి చేసిన పాలకవర్గ సభ్యులు, నగరపాలక అధికారులు, సిబ్బందికి అభినందనలు.
– వై సునీల్రావు, కరీంనగర్ మేయర్