హుజూరాబాద్ టౌన్, జూలై 9: ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని, అందులో భాగంగానే హుజూరాబాద్ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూం ఇండ్లు పూర్తి చేసి త్వరలోనే లబ్ధిదారులకు అందజేస్తామని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. కలెక్టర్ కె శశాంకతో కలిసి హుజూరాబాద్ పట్టణ శివారులోని సిర్సపల్లి క్రాస్ రోడ్డులో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లను శుక్రవారం మంత్రి పరిశీలించారు. కలెక్టర్, ఆర్డీవో రవీందర్రెడ్డి, ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడి పనులు జరుగుతున్న తీరును తెలుసుకున్నారు. రెండు ప్రాంతాల్లో సుమారు 500 ఇండ్ల నిర్మాణాలు దాదాపు పూర్తి కావచ్చాయని అధికారులు దృష్టికి తేగా, మిగిలిన పనులను కూడా త్వరగా పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్ను ఆదేశించారు. గత కాంగ్రెస్ హయాంలో అగ్గిపెట్టెలను తలపించే పిట్టగూళ్లలాంటి ఇండ్లను కట్టించారని, కానీ సీఎం కేసీఆర్ ఇస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్లు పేదల సొంతింటి కలను సాకారం చేసేలా ఉన్నాయన్నారు. అవినీతికి తావు లేకుండా నిర్మించి, లబ్ధిదారుల ఎంపికలో సైతం పారదర్శకత పాటిస్తున్నామన్నారు. అర్హులైన ప్రతి ఒకరికీ దశలవారీగా ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు.
అభివృద్ధిని చూసి ఓటేయ్యండి..
హుజూరాబాద్లో టీఆర్ఎస్ గెలిస్తేనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని, ఈటల గెలిస్తే ఆయన అభివృద్ధి చెందుతాడని మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. టీఆర్ఎస్ను వీడి బీజేపీలోకి వెళ్లిన ఈటలకు ఓటు ఎందుకు వేయాలో ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలని సూచించారు. సీఎం కేసీఆర్ సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నారని, ఆయన సూచించిన టీఆర్ఎస్ అభ్యర్థికే ఓటు వేసి గెలిపించాలని కోరారు. శుక్రవారం హుజూరాబాద్ సిటీ సెంటర్ హాల్లో కబడ్డీ, హాకీ అసోసియేషన్, గోల్డ్ స్మిత్, ఎలక్ట్రికల్, ప్లంబర్ సంఘాలకు చెందిన ప్రతినిధులు మంత్రిని కలిసి వినతిపత్రాలు అందజేశారు. అనంతరం వారితో మంత్రి సమావేశం కాగా, ఆయా సంఘాల ప్రతినిధులు టీఆర్ఎస్కు హామీ పూర్వక మద్దతు ప్రకటించారు. గతంలో తమకు భవనాలకు భూములు కావాలని, నిధులు కేటాయించాలని ఎన్నిసార్లు గత ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని పలు సంఘాల నాయకులు వాపోయారు.
ఇప్పటికైనా తమ గోడును పట్టించుకుని కుల, సంక్షేమ సంఘాలకు భూములు కేటాయించి నిధులను విడుదల చేయాలని విన్నవించుకున్నారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారు. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి భూములతో పాటు నిధులను విడుదల చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో గతంలో జరగని అభివృద్ధిని చేసి చూపిస్తామని స్పష్టం చేశారు. హుజూరాబాద్ అంటే సీఎం కేసీఆర్కు ప్రత్యేకమైన అభిమానమని, హుజూరాబాద్ అభివృద్ధి కోసం అడగగానే 40 కోట్ల నిధులను విడుదల చేశారని గుర్తు చేశారు. ఈ నిధులతో అభివృద్ధి పనులకు త్వరలోనే టెండర్లు పూర్తి చేసి, త్వరితగతిన పనులు పూర్తి చేస్తామన్నారు. నియోజకవర్గంలోని ప్రతి కుల, సంక్షేమ సంఘానికి భూములు కేటాయించి త్వరలోనే నిధులను విడుదల చేసి పనులు ప్రారంభించుకుంటామన్నారు. హుజూరాబాద్ను అభివృద్ధి చేసే బాధ్యత మాదని, అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు.
అభివృద్ధి కావాలో.. ఈటల కావాలో? హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు నిర్ణయించుకోవాలని సూచించారు. ఇంతకు ముందు ఈటల గెలిచినప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు ఏం జరుగనుందో బేరీజు వేసుకోవాలని కోరారు. చుట్టు పకల నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధి హుజూరాబాద్లో ఎందుకు జరగలేదో ఆలోచించుకోవాలన్నారు. తమకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని క్రీడాకారులు వినతిపత్రం ఇవ్వగా, మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ మేయర్ వై సునీల్రావు, మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక, వైస్ చైర్మన్ కొలిపాక నిర్మల, కమిషనర్ ప్రసన్నరాణి, తహసీల్దార్ రాంరెడ్డి, కౌన్సిలర్లు కళ్లెపెల్లి రమాదేవి, ముక్క రమేశ్, తాళ్లపెల్లి శ్రీనివాస్, తొగరు సదానందం, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, నాయకులు దొంత రమేశ్, హరిశంకర్, గందె శ్రీనివాస్, కొండ్ర నరేశ్, ప్రతాప కృష్ణ, కుమారస్వామి, సమ్మయ్య, బాబురావు, వెంకటేశ్వర్లు, ఇమ్రాన్, విక్కీ తదితరులు పాల్గొన్నారు.