హుజూరాబాద్ టౌన్, జూలై 7: నకిలీ బంగారాన్ని విక్రయించిన కేసులో ఒకరు పట్టుబడగా మరొకరు పరారీలో ఉన్నారు. హుజూరాబాద్ ఠాణాలో విచారణ బృందం అధికారి ఐపీఎస్ రితిరాజ్, హుజూరాబాద్ ఏసీపీ కోట్ల వెంకట్రెడ్డి బుధవారం వివరాలు వెల్లడించారు. రాజస్థాన్ రాష్ట్రం జాలోర్ జిల్లా లేడర్మర్ గ్రామానికి చెందిన గంగారాం అలియాస్ రమేశ్ ప్రజాపతి, గుజరాత్ రాష్ట్రం భయడా తాలూకా మోదాస గ్రామానికి చెందిన అర్జున్ అలియాస్ రాజు ఇద్దరు తోడల్లుళ్లు. ఉపాధి కోసం గత జనవరిలో కరీంనగర్ జిల్లాకు వచ్చారు. అక్రమంగా డబ్బు సంపాదించాలనే దురాలోచనతో నకిలీ బంగారం దందాకు తెరలేపారు. రాజస్థాన్కు చెందిన రమేశ్ ప్రజాపతి గత జనవరిలో హుజూరాబాద్కు చెందిన ఒక వ్యాపారి దగ్గరికి వెళ్లి ఒక పురాతన నాణేన్ని చూపెట్డాడు. ఇది తనకు మహారాష్ట్రలోని పర్భనీలో ఓ ఇంటిని కూల్చుతుండగా దొరికిందని, ఇలాంటివి చాలా ఉన్నాయని నమ్మబలికాడు. వ్యాపారి ఫోన్ నంబర్ను తీసుకొని వెళ్లాడు.
మూడు రోజుల తర్వాత ప్రజాపతి రమేశ్ వ్యాపారికి ఫోన్చేసి బంగారం తీసుకొని వస్తున్నామని అర్జున్ అలియాస్ రాజుతో కలిసివచ్చాడు. వెంట తెచ్చుకున్న బ్యాగులోంచి 20 వరుసల నకిలీ బంగారం గుత్తి నుంచి కొంతమేర కట్చేసి సదరు వ్యాపారికి ఇచ్చి ప్యూరిటీ చెక్ చేయించుకొమ్మని చెప్పారు. నాలుగు రోజుల తర్వాత వ్యాపారిని కలిశారు. ఈ సందర్భంగా చెక్ చేయించానని, బంగారంగా తేలిందని వ్యాపారి వారితో చెప్పారు. దీని మొత్తం బరువు 2 కిలోలని, విలువ రూ.కోటి వరకు ఉంటుందని, రూ.50 లక్షలకే అమ్ముతామని వ్యాపారిని నమ్మించారు. దీంతో వ్యాపారి రూ.35 లక్షలు ఇస్తానని చెప్పడంతో వారు ఒప్పుకున్నారు. తెల్లారి నిందితులు, వ్యాపారిని కేశవపట్నం బస్టాండ్ వద్ద కలిసి మొలంగూర్ వద్దకు వెళ్లి డీల్ కుదుర్చుకున్నారు. వ్యాపారికి అనుమానం రాకుండా నకిలీ బంగారం గుత్తి నుంచి మరికొంత కట్ చేసి ఇచ్చారు. మరికొంత బంగారాన్ని బాక్స్లో పెట్టి తాళం వేసి వ్యాపారికి ఇచ్చి వెళ్లిపోయారు. ఈ బంగారాన్ని చెక్ చేయించగా ఒరిజినల్గా తేలింది. దీంతో వ్యాపారి మొత్తం బంగారం కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాడు. గత ఫిబ్రవరి 2న నిందితులకు ఫోన్ చేసి మానకొండూర్కు రమ్మని చెప్పగా వారు అక్కడికి వచ్చారు. నిందితులు వ్యాపారిని కారులో ఎక్కించుకొని కరీంనగర్కు వెళ్లారు. ఈక్రమంలో కారులోనే బంగారాన్ని అప్పగించి రూ.35 లక్షలు తీసుకొని వెళ్లిపోయారు.
వ్యాపారి ఆ బంగారాన్ని చెక్ చేయించగా నకిలీదిగా తేలింది. దీంతో మోసపోయానని గ్రహించి వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సీపీ కమలాసన్రెడ్డి ఆదేశాల మేరకు విచారణకు ఐపీఎస్ రితిరాజ్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో నిందితుడి ఫొటోలను సోషల్మీడియాలో పెట్టారు. ఓ వ్యక్తి అందించిన పక్కా సమాచారం మేరకు రితిరాజ్, హుజూరాబాద్ రూరల్ సీఐ కిరణ్, ఎస్ఐ ప్రవీణ్రాజ్ కేశవపట్నం మండలం తాడికల్ శివారులో ప్రజాప్రతి రమేశ్ను పట్టుకున్నారు. అతడి వద్ద నకిలీ బంగారు చైన్ల గుత్తి, నాలుగు విడి చైన్లు, రూ.లక్ష స్వాధీనం చేసుకున్నారు. కాగా మరో నిందితుడిని పట్టుకొనేందుకు యత్నిస్తున్నారు. కాగా, నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన టాస్ఫోర్స్ ఇన్స్పెక్టర్, సృజన్రెడ్డి, హుజూరాబాద్ రూరల్ సీఐ కిరణ్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ వీ రవి, టీ మురళి, కేశవపట్నం ఎస్ఐ ప్రవీణ్రాజ్, టాస్ఫోర్స్ ఏఎస్ఐ నర్సయ్య, కానిస్టేబుళ్లు అనిల్, వసీం అక్రమ్, హసనొద్దీన్, లక్ష్మణ్, కుమారస్వామిని సీపీ కమలాసన్రెడ్డి అభినందించి రివార్డులు అందజేశారు.