శంకరపట్నం, జనవరి 14: మండలంలోని కల్వల గ్రామంలో శనివారం భోగి పండుగ సందర్భంగా యువజన సంఘం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన మహిళలకు వైస్ ఎంపీపీ పులికోట రమేశ్, సర్పంచ్ దాసారపు భద్రయ్య బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ గంగారాం, వీణవంక సరస్వతీ శిశు మందిర్ వైస్ ప్రిన్సిపాల్ ప్రసూన, గద్దపాక గ్రామ కో ఆప్షన్ సభ్యుడు పులికోట మహేందర్, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
తిమ్మాపూర్, గన్నేరువరంలో..
తిమ్మాపూర్, గన్నేరువరం మండలాల్లోని అన్ని గ్రామాల్లో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. నుస్తులాపూర్లో ఉదయాన్నే భోగి మంటలు వేశారు. సర్పంచ్ రావుల రమేశ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. పాల్గొన్న మహిళలకు బహుమతులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సంస్కృతీసంప్రదాయాలను కాపాడుకోవాలన్నారు. పోటీల్లో ప్రతిభ చూపిన మహిళలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ కొత్త తిరుపతిరెడ్డి, ఉపసర్పంచ్ బేతి శ్రీనివాస్రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు తాజుద్దీన్, వార్డు సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. ఖాసీంపేట గ్రామంలో సర్పంచ్ గంప మల్లీశ్వరీవెంకన్న ఆధ్వర్యంలో గంప నాంపల్లి, నర్సమ్మ జ్ఞాపకార్థం ముగ్గుల పోటీలు నిర్వహించారు. అలాగే మైలారం గ్రామంలో బీఆర్ఎస్ నాయకుడు తోట కోటేశ్వర్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు జరిగాయి. గెలుపొందిన మహిళలకు పోటీల నిర్వాహకులు బహుమతులతో పాటు చీరెలను అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో పాలకవర్గ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.
మానకొండూర్ మండలంలో..
మండలంలోని ముంజంపల్లి, చెంజర్ల, కొండపల్కల, వేగురుపల్లి, ఊటూర్, వెల్ది, రంగపేట, శ్రీనివాస్ నగర్ తదితర గ్రామాల్లో శనివారం భోగి పండుగను ఘనంగా జరుపుకొన్నారు. ఉదయం మహిళలు, యువతులు తమ ఇండ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేశారు. ఆలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. ముంజంపల్లిలో శ్రీరామాలయంలో ముగ్గుల పోటీలను నిర్వహించగా, విజేతలకు సర్పంచ్ రామంచ గోపాల్ రెడ్డి బహుమతులను అందజేశారు.