రాంనగర్, డిసెంబర్ 6: తిమ్మాపూర్ అనుబంధ గ్రామం జోగయ్యపల్లి హనుమాన్ దేవాలయంలో స్వామిజీని హత్య చేసిన కేసులో ఇద్దరు నిందితులపై పీడీ యాక్టు అమలు చేస్తూ మంగళవారం కరీంనగర్ సీపీ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ జిల్లా శివాజీనగర్కు చెందిన నీలం శ్రీనివాస్, మహబూబాబాద్ జిల్లా నెల్లి కుదురు మండలం, ఆలేరు గ్రామానికి చెందిన కోనేటి జ్ఞానేశ్వర్ జోగయ్యపల్లి హనుమాన్ దేవాలయ ఆశ్రమంలో స్వామీజీ చెల్పూరి పెద్దన్న స్వామి వద్దకు వెళ్లి పూజలు, ఇతర పనుల పేరుతో ఆశ్రయం పొందారు. అతడి వద్దకు వస్తున్న భక్తులను గమనించి, ఆశ్రమంలో ఒంటరిగా ఉంటున్న స్వామీజీ వద్ద డబ్బులు ఉంటాయని భావించి పథకం వేశారు. జూలై 4న తెల్లవారుజామున స్వామీజీ గదిలోకి ప్రవేశించి హత్య చేశారు. అనంతరం స్వామీజీ వద్ద ఉన్న రూ.30వేలు, ఇతర నగదును తీసుకొని పారిపోయారు. హైదరాబాద్ అమీర్పేటలో జరిగిన ఓ దోపిడీ కేసులో సెప్టెంబర్ 26న కోనేటి జ్ఞానేశ్వర్, నీలం శ్రీనివాస్ను ఎస్ఆర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి సమాచారం మేరకు ఎల్ఎండీ పోలీసులు నిందితులను స్వామీజీ హత్య కేసులో అక్టోబర్ 11న పిటి వారంట్లపై కరీంనగర్ కోర్టులో హాజరుపరిచారు. గతంలో జ్ఞానేశ్వర్ రేప్ కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు. కమిషనరేట్ పరిధిలో సంచలనం సృష్టించిన స్వామీజీ హత్య ఘటనలో భక్తులు, సాధారణ ప్రజలను భయబ్రాంతులకు గురి చేసిన ఇద్దరిపై పీడీ యాక్టు అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి చంచల్గూడ జైలులో ఉన్న ఇద్దరికి నిర్భంధ ఉత్తర్వులు అందజేశారు. పీడీ యాక్టు అమలు చేయడంలో కీలక పాత్ర పోషించిన తిమ్మాపూర్ సీఐ శశిధర్రెడ్డి, పీడీ సెల్ ఇన్చార్జి పండరిని సీపీ అభినందించారు.