ఓదెల, నవంబర్ 28: నాంసానిపల్లి గ్రామానికి చెందిన పోతుగంటి శ్రీనివాస్గౌడ్కు తెలంగాణ జానపద కళారూపాలంటే ప్రాణం. ఊరిలోనే తనకున్న 20గుంటల్లో వ్యవసాయం చేసుకుంటూనే ఒగ్గుకథలు చెబుతున్నాడు. పాఠశాల స్థాయి నుంచే సాంస్కృతిక పోటీల్లో ప్రతిభ చూపుతున్న ఆయన, అంతర్జాతీయ ఒగ్గుకథ కళాకారుడు మిద్దె రాములును అనుకరిస్తూ ముందుకుసాగాడు. ఒగ్గుకథల సీడీలు, క్యాసెట్ల ద్వారా కథలను వింటూ తనకున్న ప్రతిభకు మరింత పదునుపెట్టాడు. గ్రామంతోపాటు చుట్టుపక్కల ఊర్లలో జానపదం, ఒగ్గుకథలను ప్రదర్శించేవాడు. అతని కథలను విని పలువురు ప్రోత్సహించారు. పలు వేదికల పైకి తీసుకెళ్లారు. రాష్ట్ర రాజధానిలోని రవీంద్రభారతి, శిల్పారామం, కరీంనగర్ కళాభారతి, దేవాలయాల ఉత్సవాలు, జాతరల వేదికలపై ప్రదర్శనలు ఇచ్చి అభినందలు పొందాడు. సన్షైన్ కల్చరల్ అకాడమీ కరీంనగర్లో నిర్వహించిన తెలంగాణ సాంస్కృతిక పోటీలు, అన్నమయ్య కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో 2008లో నేషనల్ లెవల్ ఫోక్ ఫెస్టివల్, 2013 ఆగస్టు 22న ప్రపంచ జానపద దినోత్సవ వేడుకల్లో ప్రతిభ చూపాడు. రేణుకా ఎల్లమ్మ, పెద్దమ్మ, మల్లన్న, నల్లపోచమ్మ, సమ్మక్క సారలమ్మ కథతోపాటు పురాతన ఇతిహాసాలైన రంభా రంపాల, శివలీలలు, శివజ్యోతి వంటి 70 కథల వరకు శ్రీనివాస్ ధారాళంగా చెప్పగలడు. పెద్దకర్మ, సంవత్సరీకం కార్యక్రమాల్లో ప్రదర్శన ఇస్తున్నాడు. తనకు ప్రభుత్వ ప్రోత్సాహం అందిస్తే మరింత రాణిస్తానని చెబుతున్నాడు.