కమాన్చౌరస్తా, నవంబర్ 22: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ రోడ్డు వేంకటేశ్వరస్వామి షష్టమ(ఆరో) బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని మంత్రి గంగుల కమాలాకర్ పేర్కొన్నారు. మంగళవారం ఆలయ ఆవరణలో విలేకరులతో సమావేశమై, బ్రహ్మోత్సవాల వివరాలను వెల్లడించారు. మాఘ, శుద్ధ, విదియ సోమవారం జనవరి 23న ఉదయం 8:30 గంటలకు అధ్యయనోత్సవాలు ప్రారంభమవుతాయని చెప్పారు. 24, 25 తేదీల్లో ప్రబంధ పారాయణం, 26న మొదటి సారి సహస్ర కళశాభిషేకం, సహస్ర దీపాలంకరణ ఉంటుందని వివరించారు. 27న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, పుట్టమన్ను తేవడం, విశ్వక్సేన ఆరాధన, ధ్వజాదివాసర శేషవాహన సేవ ఉంటుందన్నారు.
28న యాగశాల ప్రవేశం, అగ్ని ప్రతిష్ఠ, పూర్ణాహుతి, ధ్వజారోహణ, సూర్యప్రభ, చంద్రప్రభ వాహనసేవ, 29న యాగశాలలో నిత్యహోమం, కల్పవృక్ష వాహన సేవ, ఎదురుకోళ్లు, అశ్వవాహన, గజవాహన సేవ ఉంటాయన్నారు. 30న సోమవారం ఉదయం 11 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వస్వామి, లక్ష్మీనారాయణస్వామి కల్యాణోత్సవం, గరుడ వాహన సేవ నిర్వహిస్తామని చెప్పారు. 31న యాగశాలలో నిత్య పూర్ణాహుతి, హనుమత్ వాహన సేవ, సింహవాహన సేవ, ఫిబ్రవరి 1న చక్రతీర్థం, వసంతోత్సవం, పుష్పయాగం, ఏకాంతసేవ, పండిత సన్మానంతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు. 2న సాయంత్రం కన్నులపండువగా శోభాయాత్ర నిర్వహిస్తామని వివరించారు. ఈ సంవత్సరం పుట్టమన్నును భారత్ థియేటర్ సమీపంలోని వీరాంజనేయస్వామి ఆలయం నుంచి తెస్తామని, ఎదుర్కోలు ఉత్సవం పాత బజార్ శివాలయం నుంచి ఉంటుందన్నారు.
అందులో భాగంగా పద్మశాలీ కులబాంధవుల నుంచి పట్టువస్ర్తాల సమర్పణ ఉంటుందన్నారు. ఇందుకు సంబంధించిన సన్నాహక సమావేశం ఈ నెల 26న శనివారం ఆలయ కమిటీ, పోలీస్ అధికారులు, దాతలతో ఉంటుందన్నారు. ఉమ్మ డి జిల్లా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాతృలు కావాలని, ఇక్కడికి వచ్చే భక్తుల సౌకర్యాల విషయంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శానిటైజేషన్ పూర్తి చేయాలని మేయర్ సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి హరిశంకర్కు సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎన్ నాయకుడు చల్లా హరిశంకర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, వ్యవస్థాపక ధర్మకర్తలు చకిలం శ్రీనివాస్, చకిలం గంగాధర్, ఈవో ఉడుతల వెంకన్న, గంప రమేశ్, గోగుల ప్రసాద్, మిడిదొడ్డి నవీన్ పాల్గొన్నారు.
టీటీడీ ఆలయానికి శంకుస్థాపన చేస్తాం
బ్రహ్మోత్సవాల్లోపే కరీంనగర్ జిల్లా కేంద్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మించే ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తాం. అందుకోసం 10 ఎకరాల స్థలాన్ని ఇప్పటికే టీటీడీకి అప్పగించాం. ఇందుకు సంబంధించి సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆంధ్రపదేశ్ సీఎం జగన్కు లేఖ రాశారు. టెండర్లు పూర్తి చేసి, నిర్మాణం ప్రారంభించాలని కోరాం. అలాగే, జిల్లా కేంద్రంలో శ్రీనివాస కల్యాణం నిర్వహించేందుకు టీటీడీ అధికారులను కోరుతాం.
– మంత్రి గంగుల కమలాకర్