కలెక్టరేట్, నవంబర్ 22: సీనియర్ సిటిజన్లు నేటి తరానికి మార్గదర్శకులని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ పేర్కొన్నారు. వయోవృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం అమలుపై మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత వారి పిల్లలదేనని, పట్టించుకోనట్లయితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వయోవృద్ధుల్లో కేవలం 20 శాతం మంది మాత్రమే వారి ఆర్థిక అవసరాలు తీర్చుకునే స్థాయిలో ఉన్నారని, మిగతా వారంతా అనాథలుగా నిరాదరణకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వయోవృద్ధులు ఎదుర్కొనే సమస్యలు చెప్పుకొనేందుకు టోల్ఫ్రీ నంబర్ 1456ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. వృద్ధాప్యంలో నా అనే వారు లేనివారికి నగరంలో ప్రభుత్వ వృద్ధాశ్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. వారి కోసం ప్రత్యేకంగా ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలని, ప్రధాన దవాఖానలో ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయాలని సూచించారు.
జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో వృద్ధుల కోసం ప్రత్యేకంగా రిజిస్టరు నిర్వహించాలని, వృద్ధుల కోసం జిల్లా కేంద్రంలో డే కేర్ సెంటర్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అందుబాటులో ఉన్న భవనం గుర్తించి, ప్రతిపాదించాలని అధికారులను ఆదేశించారు. డే కేర్ సెంటర్లో ఇండోర్ గేమ్స్ ఆడేందుకు అవసరమైన క్రీడా సామగ్రితో పాటు పుస్తకాలు కూడా స్వయంగా అందిస్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో డీఎంహెచ్వో డా. జువేరియా, ఎల్డర్లైన్ స్టేట్ కో-ఆర్డినేటర్ రజాక్, ఆర్డీవో ఆనంద్కుమార్, తహసీల్దార్ సుధాకర్, వయోవృద్ధుల సంఘాల బాధ్యులు సముద్రాల జనార్దన్రావు, పెండ్యాల కిషన్రావు, తదితరులు పాల్గొన్నారు.