సిరిసిల్ల/రుద్రంగి, నవంబర్ 22 : బీపీ, షుగర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారా..? ప్రతి నెలా దవాఖానల చుట్టూ తిరుగుతూ.. మెడిసిన్లకే 2వేల నుంచి 3వేల దాకా ఖర్చు చేస్తున్నారా..? సంపాదించిన దాంట్లో మందులకే పూర్తిగా వెచ్చిస్తూ అనేక వ్యయ, ప్రయాసలు పడుతున్నారా..? ఏ మాత్రం వద్దు. మీ కోసం రాష్ట్ర సర్కారు గొప్ప నిర్ణయం తీసుకున్నది. ఎన్సీడీ (అసంక్రమిత వ్యాధుల నియంత్రణ) కార్యక్రమంలో భాగంగా వివిధ రుగ్మతల బాధపడుతున్నవారి ఇంటికే మెడిసిన్ను పంపిస్తున్నది. తొలుత బీపీ, షుగర్ బాధితులకు నెల రోజులకు సరిపడా మందులతో కూడిన ప్రత్యేక కిట్ను వైద్య సిబ్బందితో అందిస్తున్నది. అంతేకాదు మందులు ఎలా..? ఎప్పుడు.. వేసుకోవాలో అవగాహన కల్పించడంతోపాటు రెగ్యులర్ చెకప్లు చేయిస్తుండగా, రోగులకు ఎంతో సాంత్వన కలుగుతున్నది.
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులను ప్రాథమిక దశలో కట్టడి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. నిరుపేద, మధ్యతరగతికి చెందిన వారు ప్రతి నెలా మెడిసిన్ కొనడం భారమవుతుండగా, వారి పరిస్థితిని గుర్తించి ఉచితంగానే నెలకు సరిపడా మందులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రంగంలోకి దిగిన వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నది. ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు నెలనెలా బాధితుల ఇంటికే వెళ్లి కేసీఆర్ చిత్రంతో కూడిన మందుల కిట్లు పంపిణీ చేస్తున్నారు. అంతే కాదు రెగ్యులర్ పరీక్షలు చేయిస్తూ వ్యాధి తీవ్రతను బట్టి మెడిసిన్ మార్చుతున్నారు.
కిట్ విలువ 2వేల నుంచి 3వేల పైనే..
మధుమేహ, బీపీ వ్యాధిగ్రస్తుల ఇంటికి వెళ్లి సీఎం కేసీఆర్ చిత్రపటంతో నెలకు సరిపడా మందులతో ఉన్న మెడికల్ కిట్లను అందిస్తున్నారు. నెల రోజుల తర్వాత వారికి మళ్లీ పరీక్షలు చేసి, వారి ఆరోగ్య పరిస్థితి నిర్ధారించి మందుల మోతాదును తగ్గించి ఇవ్వనున్నారు. అంతే కాకుండా ఆరోగ్యసిబ్బంది ఏ పూటకు ఏ మెడిసిన్ వేసుకోవాలో కూడా తెలుపుతున్నారు. ప్రభుత్వం అందించే ఈ కిట్ విలువ దాదాపు 2వేల నుంచి 3వేలకుపైనే ఉంటున్నది. కార్పొరేట్ స్థాయిలో అందే వైద్యాన్ని ప్రభుత్వం పేదలకు ఉచితంగా అందిస్తుండడంపై వ్యాధి పీడితులకు భరోసా దొరుకుతున్నది.
సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 44వేల మంది..
జిల్లాలో గత ఆరు నెలల క్రితం ఎన్సీడీ (అసంక్రమిత వ్యాధుల నియంత్రణ) సర్వే నిర్వహించారు. దాదాపు రెండు లక్షల మందిని సర్వే చేయగా, 29,594 మంది బీపీ, 13,658 మంది షుగర్, 69 మంది నోటి, 80 మంది గర్భం, 166 మంది రొమ్ము వ్యాధులతో బాధపడుతున్నట్లుగా గుర్తించారు. వీరి కోసం 15 వేలకు పైగా మెడిసిన్ కిట్లు సిద్ధం చేశారు. సర్వేలో గుర్తించిన వ్యాధుల ఆధారంగా ముందుగా షుగర్, బీపీ బాధితులకు ఇంటింటికీ వెళ్లి ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు మెడిసిన్ అందజేస్తున్నారు. ఆరు ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, 89 ఆరోగ్య ఉప కేంద్రాల పరిధిలో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి మెడికల్ కిట్లు పంపిణీ చేస్తున్నారు.
ఇంటికే వచ్చి మందులిత్తన్రు..
నాకు బీపీ ఉంది. చానా ఏండ్ల సంది బాధపడుతున్న. ప్రతి నెలా సిరిసిల్ల దవాఖానకు పోయి చూపించుకొని మందులు కొనుక్కచ్చుకుంటున్న. వెయ్యి రూపాయల మీదనే అయితున్నయి. కానీ, మాసోంటోళ్ల కోసం కేసీఆర్ సారే మందులు పంపిస్తున్నడని తెలిసి సంబురపడ్డ. మొన్ననే మా ఇంటికి డాక్టర్లు అచ్చి నెలకు చాలె గోలీలు ఇచ్చిన్రు. ఎట్ల ఏసుకోవాలో చెప్పిన్రు. మళ్లీ నెలకు వచ్చి పరీక్షలు చేస్తామన్నరు. ఇక మందులు గొనే బాధతప్పింది. చానా సంబురమైతంది.
– ఎర్రం భూమయ్య, రుద్రంగి