గంగాధర, నవంబర్ 10: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు, 24 గంటల విద్యుత్తో పాటు కాళేశ్వరం జలాలతో గ్రామాల్లోని చెరువులు, కుంటలు నింపడంతో గంగాధర మండలంలో వ్యవసాయాభివృద్ధి జరిగింది. వానకాలంలో సుమారు 24,270 ఎకరాల్లో వరి సాగు చేశారు. ప్రస్తుతం వరి కోతలు ఊపందుకున్నాయి. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. గంగాధర పీఏసీఎస్ ఆధ్వర్యంలో 12, కురిక్యాల పీఏసీఎస్ ఆధ్వర్యంలో 9, ఐకేపీ ఆధ్వర్యంలో 12, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఒక కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కేంద్రాల్లో రైతులకు సదుపాయాలు కల్పించడంతో పాటు ధాన్యం వెంట వెంటనే కొనుగోలు చేస్తున్నారు. కాగా, గత వానకాలం సీజన్లో గంగాధర పీఏసీఎస్ ఆధ్వర్యంలో 65 వేల క్వింటాళ్లు, కురిక్యాల పీఏసీఎస్ ఆధ్వర్యంలో 59 వేల క్వింటాళ్లు, ఐకేపీ ఆధ్వర్యంలో 70 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. కాళేశ్వరం జలాలతో పాటు ఈసారి వర్షాలు సమృద్ధిగా పడడంతో సాగు విస్తీర్ణం పెరిగింది. గతేడాది కంటే అధిక దిగుబడి వస్తున్నదని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఎటు చూసినా పచ్చని పంటలే
ఉమ్మడి రాష్ట్రంలో గంగాధర మండలంలో సాగు నీళ్లు లేక వేసిన పంటలు ఎండిపోయేవి. ఎక్కడ చూసినా నెర్రెలు బారిన భూములే కనిపించేవి. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపట్టిన రైతు సంక్షేమ పథకాలతో పాటు కాళేశ్వరం జలాలతో మండలంలో ఎటు చూసినా పచ్చని పొలాలే కనిపిస్తున్నయి. రైతులకు సిరులు కురిపిస్తున్నయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ను నిర్మించి రైతుల తలరాతను మార్చారు.
-సాగి మహిపాల్రావు, రైతు, గంగాధర
అధిక దిగుబడి వచ్చింది
రాష్ట్ర ప్రభుత్వం వరద కాలువకు కాళేశ్వరం జలాలు విడుదల చేయడంతో పాటు చెరువులు, కుంటలు నింపడంతో బీడు భూములు సాగులోకి వచ్చినయి. మండలంలో ఏడాదికేడాది సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తున్నది. మా ఊరి పక్క నుంచి వెళ్తున్న వరదకాలువలో నీళ్లు నిండుగా ఉండడంతో మొత్తం పొలం సాగు చేసిన. గతేడాది కంటే ఈ సారి దిగుబడి ఎక్కువ వచ్చింది.
-రేండ్ల శ్రీనివాస్, రైతు, కొండన్నపల్లి
కేసీఆర్ సారుకు రుణపడి ఉంటం
కేసీఆర్ సారు సీఎం అయినంక వ్యవసాయానికి పూర్వ వైభవం వచ్చింది. మా ఊరి ఎల్లమ్మ చెరువు నీటితో కళకళలాడుతున్నది. మస్తు నీళ్లు ఉండడంతో వానల కోసం ఎదరు చూడకుంట పొలం దున్ని వరేసినం. సకాలంలో నీళ్లు, ఎరువులు వేయడంతో దిగుబడి కూడా బాగానే వచ్చింది. చెరువులో నీళ్లు ఉండడంతో మూడు నాలుగేండ్ల వరకు కరువు ఉండదు. కేసీఆర్ సారుకు రైతులమంతా రుణపడి ఉంటం.
-జారతి సత్తయ్య, రైతు, గంగాధర