సిరిసిల్ల టౌన్, నవంబర్ 8: న్యూ బార్న్ కేర్ యూనిట్, డెడికేటెడ్ పీడియాట్రిక్ కేర్, హై డిపెండెన్సీ యూనిట్ ఇలా స్పెషల్ వార్డులు.. ఆధునిక వైద్యపరికరాలు.. 24 గంటలపాటు అందుబాటులో వైద్యులు.. అత్యాధునిక సేవలతో సిరిసిల్ల సిక్ న్యూ బార్న్ కేర్ యూనిట్ (ఎస్ఎన్సీయూ) నవజాత శిశువులకు అపరసంజీవనిలా మారింది. మంత్రి కేటీఆర్ చొరవతో పెద్ద దవాఖానలో రెండు నెలల క్రితం ఏర్పాటైన ఈ సెంటర్, చిన్నారులకు శ్రీరామరక్షగా నిలుస్తున్నది. నెలలు నిండక ముందే పుట్టడం, అతి తక్కువ బరువు ఉండడం, ఫిట్స్ రావడం, రకరకాల ఇన్ఫెక్షన్లతో బాధపడడం తదితర సమస్యలన్నింటికీ రూపాయి ఖర్చు లేకుండా మెరుగైన వైద్యం అందిస్తున్నది. కార్పొరేట్ హాస్పిటళ్లకు దీటుగా సేవలందుతుండడంతో జిల్లావాసులకు భరోసా దొరుకుతున్నది.
జిల్లా దవాఖానలో చిన్నారుల వైద్య సేవల కోసం ఆయా ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశారు. ఎస్ఎన్సీయూ(సిక్ న్యూ బార్న్ కేర్ యూనిట్)తోపాటు అనుబంధంగా ఎన్బీఎస్యూ(న్యూ బార్న్ కేర్ యూనిట్), డీపీసీయూ(డెడికేటెడ్ పిడియాట్రిక్ కేర్), హెచ్డీయూ(హై డిపెండెన్సి యూనిట్)ను రూ.1.50 కోట్ల వ్యయంతో గత ఫిబ్రవరిలో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి నెలలు నిండకుండానే జన్మించిన శిశువులు, ఉండాల్సిన బరువుకంటే అతి తక్కువ బరువుగల శిశువులు, పలు రకాల ఇన్ఫెక్షన్లతో బాధపడే, బలహీనమైన, కామెర్లతో బాధపడుతున్న నవజాత శిశువులకు ఆయా యూనిట్లలో చికిత్స అందిస్తున్నారు. ఫిట్స్ రావడం, పుట్టగానే ఏడ్వకపోవడం, నోట్లో నుంచి రక్తం వాంటింగ్ చేసుకోవడం, గుండె, కిడ్నీ సంబంధిత సమస్యలతో ఉన్న చిన్నారులకు ఇక్కడ అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు. గతంలో పై సమస్యల వల్ల శిశుమరణాలు అధికంగానే ఉండేవని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో ఏర్పడిన ఆధునిక వైద్య సేవలను అందుబాటులోకి తేవడం వల్ల తగ్గాయని చెబుతున్నారు.
పెరిగిన ఆదరణ..
జిల్లా దవాఖానకు నిత్యం వచ్చేవారిలో 100 నుంచి 150 మంది గర్భిణులే ఉంటున్నారు. ఇందులో ప్రతి రోజూ 8 నుంచి 10 మంది ఇన్పేషెంట్లుగా చేరుతారు. సూపర్స్పెషాలిటీ సౌకర్యాలు కలిగిన జిల్లా దవాఖానలో ఇతర ప్రైవేట్లో లేని విధంగా పెద్ద వారికి సంబంధించిన అన్ని రకాల వైద్య సేవలతో పాటు మహిళలకు ప్రసూతి, గైనిక్ సౌకర్యం, చిన్నపిల్లల ప్రత్యేక విభాగాలు ఉన్నాయి. చిన్న పిల్లల విభాగంలో ప్రతి రోజు 100 నుంచి 150 మంది పిల్లల్ని ఓపీ సేవల కోసం తీసుకు వస్తుంటారు. వీరిలో నిత్యం సుమారు 27మంది దవాఖానలో చేరుతారు. ఇందులో క్లిష్టమైన అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొనేవారికి అత్యవసర సేవలు అందించేందుకు సిక్ న్యూబార్న్ కేర్ యూనిట్ ఏర్పాటు చేశారు. ఈ యూనిట్ ద్వారా వైద్యులు కార్పొరేట్కు దీటుగా సేవలు అందిస్తున్నట్లు అక్కడ చికిత్స పొందుతున్న పిల్లల తల్లిదండ్రులు చెబుతున్నారు. అధికశాతం 9నెలలు నిండకుండానే జన్మించిన శిశువులకు ఇందులో అద్భుత చికిత్స చేస్తున్నారని హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్, ప్రైవేటు దవాఖానల్లో లక్షల రూపాయలు ఖర్చయ్యే వైద్యాన్ని పైసా ఖర్చు లేకుండా ఉచితంగా చేస్తున్నారని రోగుల బంధువులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వామర్స్ లేక శిశుమరణాలు జరిగేవని, ప్రస్తుతం వాటి కొరత లేకుండా సర్కార్ చర్యలు తీసుకోవడంతో పూర్తి స్థాయిలో మెరుగైన వైద్య సేవలు అందించగలుగుతున్నట్లు వైద్యులు తెలిపారు.
అత్యాధునిక వైద్య పరికరాలు
చిన్నారుల వైద్య సేవల కోసం ఏర్పాటు చేసిన ఎస్ఎన్సీయూలో అత్యాధునిక వైద్య పరికరాలు సమకూర్చారు. వార్మర్ యూనిట్లు-13, మల్టీపారా మానిటర్లు-13, ఫొటోథెరపీ వార్మర్లు-12, వార్మర్స్-20, ఇన్ఫ్యూజన్ పంప్స్-15, మానిటర్స్-22, సిపాప్-3, వెంటిలేటర్స్-9, సిరంజి పంపులు-13, హెచ్ఎఫ్ఎన్సీ-11, ఓ2 కాన్సన్ట్రేటర్స్-10, లారింగోస్కోప్-1, తదితర పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ఈ విభాగంలో జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ మురళీధర్రావు పర్యవేక్షణలో ముగ్గురు ఎండీ పిడియాట్రిక్ వైద్యులు శ్రావణ్కుమార్, సాయికుమార్, శృతి విధులు నిర్వహిస్తున్నారు. షిఫ్టుల వారీగా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 8గంటల వరకు, 8గంటల నుంచి ఉదయం 8గంటల వరకు అందుబాటులో ఉండి చిన్నారులకు వైద్య సేవలు అందిస్తున్నారు.
చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు..
మంత్రి కేటీఆర్ సహకారంతో జిల్లా దవాఖానలో ఎస్ఎన్సీయూ(సిక్ న్యూ బార్న్ కేర్ యూనిట్) వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో అత్యాధునిక వైద్య పరికరాలు ఏర్పాటుచేశాం. చిన్నారుల్లో వివిధ రకాల ఆరోగ్య సమస్యలు ఉంటాయి. వాటిని గుర్తించడంతో పాటు అత్యవసర వైద్య చికిత్స అందించేందుకు ఎస్ఎన్సీయూ ఎంతో ఉపయోగకరంగా ఉంది. ప్రైవేట్కు వెళ్లలేక తల్లిదండ్రులు అవస్థలు పడేవారు. ఇప్పుడు ఇక్కడే అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నాం. ఎస్ఎన్సీయూలో 13పడకలతో పాటు 27పడకలతో కూడిన పిడియాట్రిక్ వార్డులో రోజుకు 30మంది దాకా చికిత్స పొందుతున్నారు.
– మురళీధర్రావు, దవాఖాన సూపరింటెండెంట్
24గంటలు వైద్యం అందిస్తున్నాం..
ఎస్ఎన్సీయూ వార్డు చిన్నారుల వైద్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంది. అప్పుడే పుట్టిన చిన్నారుల్లో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు వైద్యం అందుబాటులో ఉంటుంది. చిన్నారుల్లో రకరకాల సమస్యలు ఉంటాయి. సాధారణంగా ఉమ్మనీరు మింగడం, పుట్టగానే ఏడ్వకపోవడం, పసిరకలు వంటి సమస్యలతో పాటు కిడ్నీ, నోట్లో నుంచి రక్తం రావడం, శ్వాస సంబంధిత తదితర ప్రధాన సమస్యలు ఉంటాయి. వీటన్నింటికీ ఇక్కడే వైద్యం అందిస్తున్నాం. 24గంటల పాటు వైద్యులం అందుబాటులో ఉంటున్నాం. జిల్లా ప్రజలు ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి.
– డాక్టర్ శ్రావణ్కుమార్, ఎస్ఎన్సీయూ వైద్యుడు, ఎండీ పిడియాట్రిక్