సిరిసిల్ల టౌన్, సెప్టెంబర్ 23 : నిలువ నీడ లేక అష్టకష్టాలు పడుతున్న నిరుపేద మహిళకు అమాత్యుడు కేటీఆర్ అండగా నిలిచారు. గురువారం మంత్రిని కలిసి గోడు వెల్లబోసుకున్న ఆమెకు డబుల్ బెడ్రూం ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇవ్వడమే కాకుండా 24 గంటల్లోనే అమలుకు చర్యలు తీసుకున్నారు. పూర్తి వివరాలిలా ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బావుసాయిపేటకు చెందిన ఎల్లవ్వ గురువారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మంత్రి కేటీఆర్ను కలిసింది. తన భర్త ఏడాది క్రితం జరిగిన యాక్సిడెంట్లో మరణించాడని వాపోయింది.
ఆర్థిక కష్టాలతోపాటు నిలువ నీడ లేక ఒక్క బిడ్డతో భారంగా జీవనం సాగిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు గూడు ఇప్పించాలని గోడు వెల్లబోసుకుంది. ఎల్లవ్వ బాధ విని చలించిన మంత్రి కేటీఆర్ డబుల్ బెడ్రూం ఇల్లు నిర్మించి ఇవ్వాలని అక్కడే ఉన్న కలెక్టర్ అనురాగ్ జయంతిని ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్ శుక్రవారం ఎల్లవ్వ స్వగ్రామం బావుసాయిపేటలో ఆమె సొంత స్థలంలో డబుల్ బెడ్రూం ఇంటి నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు, ప్యాకేజీ-9 కార్యనిర్వాహక ఇంజినీరు శ్రీనివాస్ క్షేత్రస్థాయికి వెళ్లి ఇంటి నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల గురించి తెలుసుకున్న మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా ‘వెల్ డన్’ అనురాగ్ అంటూ కలెక్టర్ను అభినందించారు. కష్టాల్లో ఉన్నానంటూ గోడు వెల్లబోసుకున్న వెంటనే పేద మహిళకు గూడు కల్పించేందుకు చొరవ తీసుకున్న మంత్రిని ట్విట్టర్ వేదికగా నెటిజన్లు అభినందిస్తున్నారు.