గోదావరిఖని, ఆగస్టు 11: గోదావరిఖనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి కేటీఆర్తో రామగుండం నియోజకవర్గ లబ్ధిదారులు ముచ్చటించారు. ‘ కల్యాణలక్ష్మి చెక్కు అందుకున్నానని, నెలనెలా క్రమం తప్పకుండా పెన్షన్ వస్తుంది’ అని దాసారపు శ్రీదేవి తెలిపింది. తాను, తన తల్లి దివ్యాంగురాళ్లమని, ప్రతి నెలా ఒక్కొక్కరికీ 3వేల చొప్పున పింఛన్ వస్తున్నదని, తన తల్లి సర్జరీ కోసం సీఎంఆర్ఎఫ్ చెక్కు కూడా అందుకున్నామని అనిత అనే యువతి చెప్పింది. తాను కూడా కల్యాణలక్ష్మి చెక్కు అందుకున్నానని, దాంతో పెళ్లి కోసం చేసిన అప్పుకు ఏడాదికి 24వేల వడ్డీ కట్టే బాధ తప్పిందని సాయి మమత అనే యువతి సంబురపడింది. తాను బీటెక్ చదువుతున్నప్పుడు ప్రభుత్వం నుంచి లక్షా 20వేల ఫీజు రీయింబర్స్మెంట్ రూపంలో పొందానని, అది లేకుంటే తన చదువు ఆగిపోయేదని సీఎంకు కృతజ్ఞతలు తెలిపింది. అనంతరం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కటౌట్లు, ఎమ్మెల్యే చందర్కు రాఖీలు కట్టి మహిళలు అభిమానాన్ని చాటుకున్నారు. ప్రభు త్వ సంక్షేమ పథకాలపై జిల్లా ప్రజలు ఆనందంగా ఉన్నారని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలుపగా, ఈ సందర్భంగా జిల్లాలో ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నారంటూ సాగిస్తున్నారని మంత్రి కేటీఆర్ అభినందించారు.
రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని రాష్ట్ర ఆడబిడ్డలతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆప్యాయంగా ముచ్చటించారు. గురువారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, ముందుగా మహిళలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి జిల్లా నుంచి పలువురు లబ్ధిదారులు పాల్గొనగా, ‘అమ్మా.. అక్కా.. చెల్లె.. బాగున్నారా..? ఆరోగ్యం ఎలా ఉంది?’ అంటూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ‘ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా..?’ ‘పింఛన్లు వస్తున్నాయా..?’ ‘మీ బిడ్డల పెండ్లికి కల్యాణలక్ష్మి వచ్చిందా..?’ ‘దళితబంధు మీకు ఉపాధి చూపిందా..?’ అంటూ ఆరా తీశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, అన్నింటా ముందుండాలని రాణించాలని పిలుపునిచ్చారు. ఈ నెల 15 నుంచి 57 ఏండ్లు నిండిన వారికి కొత్త పింఛన్ ఇస్తామని చెప్పారు. అమాత్యుడి పలుకరింపుతో లబ్ధిదారులు ఆనందంలో మునిగిపోయారు. కేటీఆర్ అడిగిన ప్రశ్నలకు ఉత్సాహంగా బదులిచ్చారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బాగున్నాయని, అవి తమ బతుకులకు భరోసా ఇస్తున్నాయని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్లో చొప్పదండి నియోజకవర్గానికి చెందిన మాడిశెట్టి స్వరూప ఉద్వేగానికి లోనయ్యారు. తన కవల పిల్లల పెండ్లిళ్లు చేస్తే.. ఇద్దరికీ కల్యాణ లక్ష్మి వచ్చిందని, ఈ పథకం లేకుంటే తమ కుటుంబం ఇబ్బందులు పడాల్సి వచ్చేదని చెప్పారు. ఆయాచోట్ల సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కటౌట్లకు రాఖీ కట్టి, కృతజ్ఞతలు చెప్పారు.