గన్నేరువరం, జూన్ 23: హరితహారం కార్యక్రమంలో అధిక సంఖ్యలో మొక్కలు నాటి గన్నేరువరం మండలాన్ని జిల్లాలో ప్రథమ స్థానంలో నిలుపాలని ఎంపీపీ లింగాల మల్లారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచులు వారి గ్రామాల్లో ఉన్న సమస్యలను సభలో అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. జంగపెల్లి సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో బెల్టు షాపులు నిర్వహించడంతో కొందరు మద్యం తాగి సమావేశాలకు ఆటంకం కలిగిస్తున్నారని ఆరోపించారు.
ఎక్సైజ్ అధికారులు బెల్టు షాపులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్సైజ్ ఎస్ఐ సరిత మాట్లాడుతూ బెల్టు షాపుల నిర్వహించేవారి పై చట్ట పరమైన చర్యలు తీసుకొంటామని చెప్పారు. గ్రామాల్లో గంజాయిని నిర్మూలించడానికి ప్రజా ప్రతినిధులు అధికారులకు సహకరించాలని కోరారు. ఏపీఎం లావణ్య మాట్లాడుతూ మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. ఎంపీవో నర్సింహారెడ్డి మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రజలే అవకాశం ఉన్నందున సర్పంచులు పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. గ్రామాల్లో పల్లెప్రగతి పనులు విజయవంతంగా పూర్తి చేసిన అధికారులు, సర్పంచులకు జడ్పీటీసీ మాడుగుల రవీందర్రెడ్డి అభినందనలు తెలిపారు.
తాత్కాలిక మండల పరిషత్ కార్యాలయ ఏర్పాటుకు జడ్పీ నిధులను సమకూర్చనున్నట్లు పేర్కొన్నారు. గుండ్లపల్లి స్టేజ్ వద్ద ప్రభుత్వ అనుమతులు లేకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులు వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చి అక్రమ దందా నడుపుతున్నారని ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు గూడెల్లి ఆంజనేయులు ఆరోపించారు. ఎంపీవో నర్సింహారెడ్డి మాట్లాడుతూ తమ దృష్టికి వచ్చిన వెంచర్ల వద్ద ఖనీలను తొలగించి లే అవుట్ పర్మిషన్ లేదని బోర్డులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
గునుకుల కొండాపూర్ గ్రామ పంచాయతీ లో జరుగుతున్న వివాదాలను త్వరగా పరిష్కరించి అభివృద్ధి జరిగేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఎంపీటీసీ గూడెల్లి ఆంజనేయులు కోరారు. గ్రామంలోని సర్పంచ్, ఉప సర్పంచ్ మధ్య కొనసాగుతున్న వివాదం ఉన్నతాధికారులు దృష్టికి వెళ్లిందని, త్వరలోనే పరిష్కారమవుతుందని ఎంపీపీ తెలిపారు. గ్రామాల్లో రేషన్ షాపులు ఏర్పాటు చేయాలని చాకలివానిపల్లి సర్పంచ్ నక్క మల్లయ్య కోరారు. తహసీల్దార్ బండి రాజేశ్వరి మాట్లాడుతూ సర్పంచులు దరఖాస్తు ఇస్తే ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ న్యాత స్వప్నాసుధాకర్, ఏవో కిరణ్మయి, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.