రాష్ట్రంలోనే నంబర్ వన్ డెయిరీగా పేరుగాంచిన కరీంనగర్ డెయిరీ ఆదివారం నుంచి సరికొత్త పాలను అందించనున్నది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మిటమిన్ ‘ఏ‘, ‘డీ’లను జోడించి ఫోర్ట్టిఫైడ్ పాలను మార్కెట్లోకి విడుదల చేయనున్నది. ఇదే సమయంలో సరికొత్త ప్యాకింగ్ను సైతం ఈ నెల 11 నుంచే అమల్లోకి తేనున్నది. ఈ సందర్భంగా డెయిరీ చైర్మన్ చలిమెడ రాజేశ్వర్రావు ‘నమస్తే తెలంగాణ’కు ఇంటర్వ్యూ ఇచ్చారు. మారుతున్న మార్కెట్ పరిస్థితులు, ప్రజల ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇదే సమయంలో డెయిరీపై ఆధారపడి ఉన్న లక్ష మంది రైతుకుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవడంతోపాటు సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు వ్యవసాయ రంగానికి ప్రత్యామ్నాయంగా పాడి పరిశ్రమను విస్తరించేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
– కరీంనగర్, జూన్ 10 (నమస్తే తెలంగాణప్రతినిధి)
విటమిన్ ‘ఏ’, ‘డీ’ తో పాలు
స్వచ్ఛమైన పాలను అందించడమే లక్ష్యంగా కరీంనగర్ డెయిరీ ముందు నుంచీ పనిచేస్తున్నది. ఆ దిశగానే విస్తరణ కార్యక్రమాలు చేపట్టి.. నేడు రాష్ట్రంలోనే నంబర్ వన్ డెయిరీగా నిలిచిందని చెప్పడానికి గర్వంగా ఉన్నది. దీనికి రాష్ట్ర ప్రభుత్వ సహకారం సంపూర్ణంగా ఉంది. అందులోనూ సీఎం కేసీఆర్ సహకారాన్ని మా డెయిరీ పరిధిలోని రైతులెవరూ మరువలేరు. ఈ నేపథ్యంలో వినియోగదారులకు మరింత చేరువ కావడానికి, అలాగే నేటి ఉరుకుల పరుగుల ఒత్తిడి ప్రపంచంలో ప్రజల ఆరోగ్యానికి అవసరమయ్యే పోషకాలను దృష్టిలో పెట్టుకొని.. సరికొత్త పాలను కరీంనగర్ డెయిరీ ఆదివారం నుంచి అమల్లోకి తెస్తున్నది. అందులో భాగంగానే మిటమిన్ ఏ, డీలతో కూడిన ఫోర్టిఫైడ్ పాలను వినియోగదారులకు అందించనున్నాం.
ఇందుకోసం ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నాం. తద్వారా మా డెయిరీ పాలను వినియోగించడం వల్ల అదనపు అడ్వాంటేజ్ సమకూరుతుంది. ప్రధానంగా పుడ్సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ప్రమాణాల ప్రకారం ఈ విటమిన్ పాలను అందిస్తున్నందుకు సంతోషంగా ఉంది. తద్వారా అన్ని వయసుల వారికి పోషకాహారాలు అందుతాయి. దీంతోపాటు మారుతున్న మార్కెట్కు అనుగుణంగా ఆదివారం నుంచి కరీంనగర్ డెయిరీ పాలు సరికొత్త ప్యాకింగ్లో లభ్యమవుతాయి. టోన్డ్మిల్క్, పన్యూర్ మిల్క్, గోల్డ్ మిల్క్, అలాగే టీ-స్పెషల్ మిల్క్తోపాటు 6 శాతం కొవ్వు, 9 శాతం ఏఎన్ఎఫ్, అలాగే, 4.5 శాతం కొవ్వు, 9 శాతం ఎస్ఎన్ఎఫ్ కలిగి ఉండే రెండు కొత్త రకాల పాలను కూడా మార్కెట్లోకి విడుదల చేస్తున్నాం.
పాడితో కుటుంబాలకు ఆర్థిక భరోసా
వ్యవసాయనికి ప్రత్యామ్నాయంగా పాడి పరిశ్రమను పెంచాలని సీఎం కేసీఆర్ పదే పదే చెబుతున్నారు. ఆయన చెప్పింది నూటికి నూరుపాళ్లు నిజం. వ్యవసాయం-పాడి ఈ రెంటింటి మధ్య చాలా అనుబంధం ఉంది. నిజానికి పంట సాగు చేస్తే అది చేతికి అందే వరకు నమ్మకం ఉండదు. కొన్ని సార్లు వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం, మరికొన్ని సార్లు ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలతో చేతికి అందకుండా పోతున్నాయి. దీంతో రైతు పూర్తిగా నష్టపోవాల్సి వస్తున్నది. నిజానికి అదే పాడి పరిశ్రమ అయితే.. రోజువారీగా ఖర్చులు వెళ్లి సదరు కుటుంబానికి ఆర్థికంగా భరోసా దొరుకుతుంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించి పంటలు దెబ్బతిన్నా పాడి ద్వారా నిలదొక్కుకునే పరిస్థితి ఉంటుంది. అందుకే సీఎం కేసీఆర్ వ్యవసాయనికి ప్రత్యామ్నాయంగా పాడి పరిశ్రమను ప్రోత్సహించాలంటున్నారు. ఆ దిశగా కరీంనగర్ డెయిరీ చాలాకాలంగా అడుగులు వేస్తున్నది.
ఐదు లక్షల లీటర్ల సేకరణే లక్ష్యం
మా డెయిరీ పరిధిలోని రైతులకు అనేక రాయితీలు కల్పిస్తూ పాడి పరిశ్రమను ప్రోత్సహిస్తున్నది. దీని వల్ల మెజార్టీ గ్రామాల్లో రైతులు పాడిబాట పట్టారు. ఇంకా ఇది పెరగాల్సిన అవసరం ఉన్నది. ఒకప్పుడు కేవలం 20 వేల లీటర్ల సేకరణ మాత్రమే ఉన్న మా డెయిరీ ప్రస్తుతం లక్షన్నర నుంచి రెండు లక్షల లీటర్ల సేకరణకు వరకు వచ్చింది. అలాగే, మార్కెటింగ్ను కూడా రెండు లక్షలకు విస్తరించాం. దీంతోపాటు పాడి పరిశ్రమను మరింత ప్రోత్సహించేందుకు తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ వద్ద 3 లక్షల లీటర్ల సామర్థ్యమున్న డెయిరీని ఏర్పాటు చేశాం. అతి త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ డెయిరీని ప్రారంభించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. భవిష్యత్లో ఈ డెయిరీ సామర్థ్యం ఐదు లక్షలకు పెంచవచ్చు. మా పాల సేకరణ లక్ష్యం కూడా ఐదు లక్షలు. ఆ దిశగానే ప్రభుత్వ సహకారంతో ముందుకు వెళ్తున్నాం.
మరింత ఆదరించండి
కరీంనగర్ డెయిరీకి మార్కెట్లో మంచి ఆదరణ ఉన్నది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం మేం కొత్తగా అమల్లోకి తెస్తున్న ఫోర్టిఫైడ్ పాలను మరింత ఆదరిస్తారని బలంగా నమ్ముతున్నాం. వినియోగం పెరిగితే వాటి ద్వారా వచ్చే ప్రయోజనాలు మా డెయిరీని నమ్ముకొని ఉన్న రైతులకు చెందుతాయి. అంతే కాదు., భవిష్యత్లో మరింత విస్తరించడానికి మార్గం ఏర్పడుతుంది. ఒక్క పాలనే కాదు.. స్వచ్ఛతకు మారుపేరుగా ఉన్న కరీంనగర్ డెయిరీ నుంచి అనేక రకాల ఉత్పత్తులను మార్కెట్లోకి తెచ్చాం. వాటికి ప్రజల నుంచి విపరీతమైన ఆదరణ ఉన్నది. వీటిని పరిణలోకి తీసుకొని తాజాగా ఐస్క్రీం, బ్రెడ్, చిక్కీస్, మిల్క్స్క్ బిస్కెట్లను కూడా తెచ్చాం. వీటి విక్రయాలకు కరీంనగర్ డెయిరీ ఆధ్వర్యంలో 75 డెయిరీ పార్లర్స్ను ప్రారంభించాం. మున్ముందు మరిన్ని ప్రారంభిస్తాం. చివరగా నాది ఒక్కటే విజ్ఞప్తి. నిత్యం వందలాది గ్రామాలకు వెళ్లి అక్కడి నుంచి స్వచ్ఛమైన పాలను సేకరించి, వాటిని వినియోగదారులకు అందిస్తున్న నేపథ్యంలో కరీంనగర్ డెయిరీ పాలను, ఉత్పత్తులను పూర్తిస్థాయిలో ఆదరించి మాకు మరింత అండగా నిలిచి, ప్రోత్సహించాలని వినియోగదారులకు విజ్ఞప్తి చేస్తున్నా.