కరీంనగర్, జూలై 19 (నమస్తే తెలంగాణ) : పాడి పరిశ్రమ అభివృద్ధికి విశేష కృషి చేసిన కరీంనగర్ డెయిరీ చైర్మన్ సీహెచ్ రాజేశ్వర్రావు డాక్టరేట్ అందుకున్నారు. అమెరికాలోని మేరీల్యాండ్ స్టేట్ యూనివర్సిటీ ప్రదానం చేసిన ఈ డాక్టరేట్ను ఆదివారం న్యూ ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో తీసుకున్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో డెయిరీని విజయవంతంగా నిర్వహిస్తూ పాడి రైతుల మన్ననల పొందుతున్న ఆయన ఈ అవార్డు అందుకోవడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
1971లో కేవలం 12 వేల సామర్థ్యంతో మొదలైన కరీంనగర్ డెయిరీని ప్రస్తుతం 3 లక్షల లీటర్ల సామర్ధ్యానికి తేవడంలో రాజేశ్వర్రావు ఎంతగానో కృషి చేశారు. ప్రస్తుతం ఆయన మేరీ ల్యాండ్ స్టేట్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ను పొందారు. రైతులకు అత్యంత సన్నిహితుడిగా ఉంటూ, వారి సంక్షేమం కోసం కృషి చేస్తూ గతంలోనూ ఎన్నో అవార్డులు అందుకున్నారు. 2010లో ఉత్తమ సేవల విభాగంలో డాక్టర్ సీ కృష్ణారావు అవార్డు, 2014లో ఉత్తమ సామాజిక సేవకుగాను ఆచార్య ఎన్జీ రంగా అవార్డు, 2016లో భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) నుంచి ఉత్తమ రైతు అవార్డు, 2017లో కరీంనగర్ లయన్స్ క్లబ్ అందించిన ఉత్తమ పారిశ్రామిక వేత్త అవార్డు, 2019లో ది హన్స్ ఇండియా అందించిన ఉత్తమ రిటైలర్ అవార్డు, 2020లో ఇండియా డెయిరీ అవార్డుతోపాటు ఈ యేడాది అవుట్స్టాండింగ్ డెయిరీ ప్రొఫేషినల్ అవార్డును కూడా అందుకున్నారు. డెయిరీని ఉత్తమ మార్గంలో నడిపిస్తున్న చైర్మన్ రాజేశ్వర్రావు ప్రస్తుతం డాక్టరేట్ అందుకోవడంపై పాడి రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.