కొత్తపల్లి రెవెన్యూ పరిధిలోని 476 రిజిస్ట్రేషన్లు రద్దు కానున్నాయి. ఈ మేరకు నాలుగు రోజుల క్రితమే గంగాధర సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కు నోటీసులు అందాయి. నిషేధిత జాబితాలో ఉన్న భూముల్లో లావాదేవీలు నిర్వహిస్తుండడంతో లోకాయుక్త సీరియస్ అయింది. ఈ మేరకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం కలకలం రేపుతున్నది. సీలింగ్ భూముల విషయం తెలియక లక్షలాది రూపాయలు వెచ్చింది భూములు కొన్న వారు, ఇప్పుడు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది.
గంగాధర, మే 19 : కరీంనగర్ జిల్లా కొత్తపల్లి రెవెన్యూ పరిధిలోని 175, 197, 198 సర్వే నంబర్లలో సుమారు 20 ఎకరాల భూమి ఉన్నది. దీనిపై 30 ఏండ్ల నుంచి సీలింగ్ యాక్ట్ అమలులో ఉన్నది. ఈ భూముల్లో ఎలాంటి లావాదేవీలు జరపరాదని హైకోర్టు ఆర్డర్ ఉన్నది. కానీ, పదిహేనేండ్ల కాలంలో 175లో 3, 197లో 291, 198లో 182 రిజిస్ట్రేషన్లు జరిగాయి. దీంతో 2016 ఆగస్టు 23న సదరు సర్వే నంబర్లను నిషేధిత జాబితాలో చేర్చాలని కలెక్టర్ కార్యాలయం నుంచి అప్పటి కరీంనగర్రూరల్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కు నోటీసులు అందాయి. అప్పటి వరకు (2018) కరీంనగర్ రూరల్ పరిధిలో ఉన్న కొత్తపల్లి మండలాన్ని గంగాధర సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కు మార్చారు. కానీ, అప్పటికే 424 రిజిస్ట్రేషన్లు చేశారు. 2018 తర్వాతి నుంచి 2024 వరకు గంగాధర పరిధిలో 52 రిజిస్ట్రేషన్లు చేశారు. అందులో ఒకటి మాత్రమే లోకాయుక్త ఆదేశాల మేరకు జరిగినట్టు తెలిసింది. కాగా, కొత్తపల్లి భూముల క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లపై లోక్సత్తా నాయకులు పోరాటం చేస్తూ వచ్చారు. ఆ మూడు సర్వే నంబర్లపై 1995లో వచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ జరపాలని అప్పటి కలెక్టర్ను హైకోర్టు ఆదేశించింది. ఆ మేరకు కలెక్టర్ విచారణ జరిపి సదరు సర్వే నంబర్లలోని భూములు సీలింగ్ పరిధిలో ఉన్నట్టు హైకోర్టుకు నివేదిక అందించారు. దాని ప్రకారం సదరు భూములపై ఎలాంటి లావదేవీలూ జరపొద్దని హైకోర్టు ఆదేశాల జారీ చేసింది. అదే సమయంలో కొంతమంది వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించగా, అప్పటి నుంచి విచారణ కొనసాగూతూనే ఉన్నది. కేసు పెండింగ్లో ఉండగానే కొందరు సదరు భూముల్లో అక్రమంగా లావాదేవీలు జరిపారు. దీనిని గుర్తించిన లోక్సత్తా ఉద్యమ సంస్థ 2015 లోకాయుక్తలో ఫిర్యాదు చేసింది. దాంతో విచారణ ప్రారంభించిన లోకాయుక్త, సదరు భూములపై పూర్తి విచారణ చేసి నివేదిక ఇవ్వాలని, ఇక ముందు ఆ భూములపై ఎలాంటి లావాదేవీలూ జరపవద్దని రెవెన్యూ శాఖకు ఆదేశాలు జారీ చేసింది.
దాంతో అప్పటి వరకు జరిగిన రిజిస్ట్రేషన్ల వివరాలను జిల్లా రెవెన్యూ శాఖ లోకాయుక్తకు సమర్పించింది. సదరు భూముల్లో ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయద్దని రిజిస్ట్రేషన్ శాఖకు సూచించింది. అయితే, లోకాయుక్తలో ఫిర్యాదు చేసిన లోక్సత్తా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ చనిపోవడం, విచారణ ఆగిపోవడం కబ్జారాయుళ్లకు కలిసివచ్చింది. ఇదే అదునుగా రిజిస్ట్రేషన్ శాఖలో ఉన్న కొద్దిమంది అధికారుల సహకారంతో సీలింగ్ యాక్టును తొక్కిపెట్టి రిజిస్ట్రేషన్లు చేశారు. ఈ క్రమంలో నిషేధిత జాబితాలో ఉన్న భూముల రిజిస్ట్రేన్లు జరుగుతున్న విషయం లోకాయుక్త దృష్టికి వెళ్లడంతో తిరిగి విచారణ ప్రారంభించింది. కొత్తపల్లి పరిధిలోని 175,197,198 సర్వే నంబర్ల భూములకు సంబంధించి లావాదేవీలు జరపొద్దని 2024 నవంబర్ 14న ఆర్డీవో రిజిస్ట్రేషన్ శాఖకు లేఖ రాశారు. అయినా, రిజిస్ట్రేషన్ శాఖ ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంతో ఆ విషయాన్ని లోకాయుక్తకు తెలిపారు. దీంతో ఆగ్రహించిన లోకాయుక్త తక్షణమే చర్యలు తీసుకోవాలని ఇటీవల కలెక్టర్కు సూచించింది. ఆ మేరకు కలెక్టర్ పమేలా సత్పతి 175,197,198 సర్వే నంబర్లలో ఇప్పటి వరకు జరిగిన 476 రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని రిజిస్ట్రేషన్ శాఖకు గత శుక్రవారమే ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయా సర్వే నంబర్లలో జరిగిన 476 రిజిస్ట్రేషన్లు రద్దు కానున్నాయి. కాగా, సీలింగ్ భూముల విషయం తెలియక భూములు కొన్న కుటుంబాలు రోడ్డున పడనున్నాయి. కాగా, సీలింగ్ భూములను విక్రయించిన అక్రమార్కులు, వారికి సహకరించిన అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకొని అమాయక ప్రజలకు న్యాయం చేయాలని పేదలు వేడుకుంటున్నారు. దీనిపై సబ్ రిజిస్ట్రార్ అబ్జల్నూర్ఖాన్ను సంప్రదించగా, కలెక్టర్ నుంచి నోటీసులు అందాయని చెప్పారు. పై అధికారుల ఆదేశాల మేరకు సర్వే నంబర్లు 175,197,198 జరిగిన రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తామని తెలిపారు.