విద్యానగర్, మార్చి 20: జిల్లాలో క్షయ నివారణ కోసం అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచాలని కలెక్టర్ శశాంక ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశమందిరంలో జిల్లా టీబీ ఫోరం సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ రవీందర్రెడ్డి టీబీ నివేదికను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో గతేడాది నుంచి కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం వల్ల క్షయ వ్యాధి కేసులు తగ్గాయని తెలిపారు. 2021 సంవత్సరంలో జనవరి నుంచి ఇంతవరకు 280 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. క్షయ వ్యాధి నియంత్రణకు డాక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఎక్కువ కేసులు నమోదయ్యే ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా కేంద్రంలో క్షయ వ్యాధి నివారణ దవాఖానను వ్యాధి బారిన పడిన వారందరూ వినియోగించుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోస్టర్లు, కరపత్రాలు, స్టిక్కర్లు ప్రచార సామగ్రిని అన్ని పీహెచ్సీలు, సబ్ సెంటర్లు, ఆర్ఎంపీ, పీఎంపీల వద్ద ప్రదర్శించాలన్నారు. సమావేశంలో జిల్లా పరిషత్ సీఈవో వెంకటమాధవరావు, వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సుజాత, క్షయ వ్యాధి నివారణ అధికారి డాక్టర్ రవీందర్రెడ్డి, టీబీ కన్సల్టెంట్ శ్రీఘన, దవాఖాన ప్రొఫెసర్ ప్రసాద్, చల్మెడ దవాఖాన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అస్లవన్ తదితరులు పాల్గొన్నారు.
కరోనా పరీక్షలు పెంచాలి
విద్యానగర్, మార్చి 20: జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా పరీక్షలు పెంచాలని, అలాగే కరోనా టీకా తీసుకునేలా ప్రజలను ప్రోత్సహించాలని కలెక్టర్ శశాంక పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశమందిరంలో మెడికల్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, త్వరలో జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రారంభమవుతుందన్నారు. వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి తక్షణమే కచ్చితమైన చికిత్స అందించేందుకు ప్రభుత్వం టెలీ మెడిసిన్ విధానాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అవసరమైన మరమ్మతులకు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. జిల్లాలో 43 సబ్ సెంటర్ల నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. నిర్మాణ పనులను మెడికల్ ఆఫీసర్లు జూన్లోగా పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సుజాత, క్షయ వ్యాధి నివారణ అధికారి డాక్టర్ రవీందర్రెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్వో రవిసింగ్, డాక్టర్ జువేరియా, వీ రాజగోపాల్రావు, శిరీష, నాగశేఖర్, రాజేందర్రెడ్డి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.