మంథని, జూలై 26: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తన జీవితాన్నే అంకితం చేసిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సర్ అని ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి పేర్కొన్నారు. పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో పట్టణంలోని బొకలవాగు వంతెనపై ఏర్పాటు చేసిన జయశంకర్ సర్ విగ్రహాన్ని పెద్దపల్లి, భూపాలపల్లి జడ్పీ అధ్యక్షులు పుట్ట మధూకర్, జక్కు శ్రీహర్షిణి, మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజతో కలిసి బుధవారం ఆవిష్కరించారు. అనంతరం స్థానిక ఎస్ఎల్బీ గార్డెన్స్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ, మాట్లాడారు. జయశంకర్ సర్ తనకు గురువు అని, చిన్న తనం నుంచే ఆయనతో అనుబంధం ఉందన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సర్ మార్గ నిర్ధేశంలోనే ముందుకు సాగానన్నారు. సర్ విగ్రహాన్ని తన చేతుల మీదుగా ఆవిష్కరించడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.
పుట్ట మధు ఎమ్మెల్యేగా మంథణి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంత ఆరాట పడ్డారో తనకు తెలుసన్నారు. మన కోసం.. మన భవిష్యత్ తరాల కోసం త్యాగాలు చేసిన 23 మంది మహానీయుల విగ్రహాలను ఏర్పాటు చేసి వారి చరిత్రను చాటి చెప్పడం అభినందనీయమని ప్రశంసించారు. అనంతరం భూపాలపల్లి జడ్పీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిణి మాట్లాడుతూ, రాష్ట్ర సాధన ఉద్యమంలో జయశంకర్ సర్ పాత్ర ఎనలేనిదని కొనియాడారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ అభివృద్ధిలో ముందుకు సాగుతూ యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్న పుట్ట మధూకర్ను ఈ ప్రాంత ప్రజలు ఆశీర్వదించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కొండ శంకర్, పీఏసీఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్, ఏఎంసీ చైర్మన్ ఎక్కటి ఆనంతరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఎగోలపు శంకర్గౌడ్, కౌన్సిలర్లు వీకే. రవి, గర్రెపల్లి సత్యనారాయణ, శ్రీపతి బానయ్య, కుర్ర లింగయ్య ఉన్నారు.