జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావుపై సభ్యులు పెట్టిన అ‘విశ్వాస’ తీర్మాన పరీక్షకు సమయం ఆసన్నమైంది. నేడు ఉదయం 10గంటలకు 30 మంది కౌన్సిలర్లు హాజరుకావాల్సి ఉండగా, 2/3 మెజార్టీ లెక్కన 21 మంది మద్దతు దక్కుతుందా..? లేదా అన్నది సస్పెన్స్గా మారింది. అవిశ్వాస పరీక్షకు ప్రత్యేకాధికారిగా కరీంనగర్ ఆర్డీవో మహేశ్వర్ను కలెక్టర్ నియమించగా, గత 26 రోజుల క్యాంపు రాజకీయాలకు నేటితో తెరపడుతుందా..? కొనసాగుతుందా..? అనే టెన్షన్ అన్ని వర్గాల్లోనూ నెలకొంది.
– జమ్మికుంట, జనవరి 24
జమ్మికుంట మున్సిపల్లో 30 వార్డులున్నాయి. 2020 జనవరిలో ఎన్నికలు కాగా, 22 మంది సభ్యులు బీఆర్ఎస్ నుంచి గెలిచారు. కాంగ్రెస్, ఇండిపెండెంట్గా గెలిచిన ఏడుగురు కౌన్సిలర్లు బీఆర్ఎస్లో చేరగా, పార్టీ సభ్యుల సంఖ్య 29కి చేరింది. చైర్మన్ రాజేశ్వర్రావు, వైస్ చైర్పర్సన్గా దేశిని స్వప్న, సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. బాధ్యతలు స్వీకరించారు. ఒక్క 24వ వార్డు సభ్యురాలు సాయిని రమ మాత్రమే కాంగ్రెస్లో ఉండిపోయారు. అయితే కొద్ది కాలంగా చైర్మన్, సభ్యుల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. ఇదే క్రమంలో ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలవగా.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
అయితే ఎన్నికల సమయంలో 23వ వార్డు కౌన్సిలర్ మల్లయ్య కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ పెద్దల సహకారంతో అసమ్మతి కౌన్సిలర్లతో జతకట్టారు. గత డిసెంబర్ 29న 20 మంది కౌన్సిలర్ల సంతకాలతో చైర్మన్పై అవిశ్వాసం కోసం డీఆర్వోకు నోటీసులు అందజేశారు. 24గంటలు గడువక ముందే మెజార్టీ సభ్యుల మద్దతు తమకే ఉందంటూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఆధ్వర్యంలో చైర్మన్, వైస్ చైర్పర్సన్, కౌన్సిలర్లు సంతకాలతో కూడిన నోటీసులు కలెక్టర్కు అందించారు.
దీంతో రాజకీయం వేడెక్కింది. ఇరు వర్గాలు క్యాంపునకు తరలివెళ్లాయి. క్యాంపుల్లో సభ్యుల కోసం ఇరు వర్గాలు బాహాబాహీకి దిగాయి. పరిస్థితి కేసుల నమోదు వరకు వెళ్లింది. ఇదే సమయంలో జనవరి 25న అవిశ్వాస పరీక్ష ఉంటుందని, సభ్యులందరికీ కలెక్టర్ నోటీసులు జారీ చేశారు. దీంతో గత 26 రోజులుగా సభ్యులంతా క్యాంపులకే పరిమితమయ్యారు.
చైర్మన్ రాజేశ్వర్రావుకు 14 మంది కౌన్సిలర్లు, ఎక్స్ అఫీషియో సభ్యుడి హోదాలో ఎమ్మెల్యేతో కలిపి 15 మంది మద్దతు ఉండగా, మల్లయ్య వర్గంలోని క్యాంపులో 16 మంది కౌన్సిలర్లు ఉన్నట్లు సమాచారం. అవిశ్వాస నోటీసు సమయంలో మల్లయ్య 20 మంది సంతకాలతో కూడిన పత్రాన్ని అందించినట్లు తెలుస్తున్నది. అయితే అవిశ్వాసానికి 2/3 సభ్యుల సంతకాలు తప్పనిసరని తెలిసింది. దీన్ని మల్లయ్య వర్గం ఇక్కడి వరకు బాగానే వర్కవుట్ చేసింది. 2/3 లెక్క సరిపోయింది.
ఇక బల పరీక్షకు 30 మంది సభ్యుల్లో 16మంది ఉంటే ‘పరీక్ష’ నెగ్గుతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి కూడా. అయితే ఇక్కడే మరో ట్విస్ట్ వచ్చి పడింది. అవిశ్వాసం సాఫీగా సాగుతుందని భావించిన మల్లయ్య వర్గానికి ఎమ్మెల్యే షాక్నిచ్చారు. ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఓటు నమోదు చేసుకున్నారు. ఇటీవల పొందారు కూడా. ఇక దీంతో చైర్మన్ వర్గానికి 15 మంది సభ్యుల మద్దతు లభించినైట్లెంది. ఇదే జరిగితే 21 మంది సభ్యుల సంతకాలతో కూడిన మద్దతుంటేనే అవిశ్వాసం నెగ్గుతుందని అంటున్నారు.
అవిశ్వాసానికి నోటీసులిచ్చిన సమయంలో 21 మంది సభ్యుల సంతకాలు కావాలా..? 20 మంది సభ్యుల సంతకాలు సరిపోతాయా..? అవిశ్వాస నోటీసు తర్వాత ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఓటు హక్కును పొందిన ఎమ్మెల్యేను పరిగణనలోకి తీసుకుంటారా..? తీసుకోరా..? ఇరు వర్గాలు మున్సిపల్ యాక్ట్ను ఫాలో అవుతున్నాయా..? లేదా..? తెలియకున్నది. ఇదిలా ఉంటే.. నేటి ‘పరీక్ష’కు రెండు వర్గాలు హాజరవుతాయా..? పరీక్ష వాయిదా పడుతుందా..? ఒకవేళ పరీక్ష జరిగితే.. సభ్యులు చైర్మన్పై విశ్వాసం ప్రకటిస్తారా..? అవిశ్వాసానికే మొగ్గు చూపుతారా..? వేచి చూడాల్సిందే. ఏదేమైనా చైర్మన్ గిరి కోసం ఇరు వర్గాలు పోటాపోటీగా తలపడుతున్నాయి. ఉత్కంఠ వీడేందుకు కొన్ని గంటలు ఓపిక పట్టాల్సిందే.
జమ్మికుంట మున్సిపల్కు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిని పార్టీ విప్గా నియమిస్తూ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో ఆయన బీఆర్ఎస్ కౌన్సిలర్లు 22 మందికి విప్ జారీ చేశారు. విప్ కాపీలను కలెక్టర్కు ఎమ్మెల్యే అందజేశారు. బీఆర్ఎస్ తరఫున మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన కౌన్సిలర్లు పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తే వారి కౌన్సిల్ సభ్యత్వం రద్దు చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.